Gun Fire: బాలీవుడ్లో కాల్పుల కలకలం.. స్టార్ డైరెక్టర్ ఇంటిపై గన్ఫైర్!
బాలీవుడ్లో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకొన్నది. మాఫియా వ్యవహారాలు ముంబైలో సద్దుమణిగాయని భావిస్తున్న సమయంలో ఆదివారం ఉదయం అగంతకులు కాల్పులు జరిపారు. ఈ ఘటన ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి నివాసం వద్ద చోటు చేసుకోవడంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనకు కారణమేమిటి? ఈ దాడి వెనుక ఎవరి హస్తం ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి నివాసం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు నాలుగు రౌండ్లపాటు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే ఈ ప్రాంతాన్ని క్లూస్ టీమ్ ఆధీనంలోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఆదివారం ఉదయం తెల్లవారుజామున చోటు చేసుకొన్నది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ప్రాథమిక దర్యాప్తు అనంతరం వివరిస్తాం అని ముంబై పోలీసులు తెలిపారు.

రోహిత్ శెట్టిని అగంతకులు టార్గెట్ చేయడంపై బాలీవుడ్ వర్గాలు దిగ్బ్రాంతికి గురయ్యారు. ఆయన నివాసంపై ఎందుకు కాల్పులు జరిపారు? ఏదైనా వ్యక్తిగత కక్షలు ఉన్నాయా? లేదా బలవంతపు వసూళ్ల కోసం మాఫియా బెదిరింపులకు పాల్పడిందా? అనే కోణంలో విచారిస్తున్నారు.
నిందితులను గుర్తించడానికి రోహిత్ నివాసంలోని సీసీటీవీ ఫుటేజ్ను, అలాగే ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల ఫీడ్ను పరిశీలిస్తున్నారు. అలాగే ఘటనాస్థలం నుంచి ఆధారాలను, బుల్లెట్ షెల్స్ను క్లూస్ టీమ్ సేకరించి ఫొరెన్సిక్ విభాగానికి పంపించారు. ఈ ఘటనతో ముంబై పోలీసులు అలెర్ట్ అయి.. పలు ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేశారు.
ముంబైలోని అతి ఖరీదైన ప్రాంతం జుహులో ఈ ఘటన చోటు చేసుకొన్నది. ఈ సమయంలో రోహిత్ శెట్టి నివాసంలో ఉన్నారా? లేదా? అనే విషయంపై క్లారిటీ లేదు. ఈ దాడికి పాల్పడిన వారి ఉద్దేశం ఏమిటి? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. నిందితులను గుర్తించేందుకు పోలీసులు తమ శైలిలో విచారణ చేపట్టారు.
ఈ మధ్య కాలంలో అగ్ర హీరోలు సైఫ్ ఆలీ ఖాన్, గోవిందా నివాసంలో జరిగిన కాల్పుల ఘటన సంచలనం రేపాయి. తాజాగా రోహిత్ శెట్టి నివాసం వద్ద జరిగిన ఘటనతో ముంబైలో మాఫియా వ్యవహారాలు పెరుగుతున్నాయా? అనే అనుమానం వ్యక్తమవుతున్నది.


Click it and Unblock the Notifications











