300 కోట్ల మార్క్ జుకర్ బర్గ్ గిఫ్టు.. షారుక్ 40 కోట్ల విల్లా.. అంబానీ పెళ్లిలో సల్మాన్, దీపిక కానుకలు ఏమిచ్చార
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రపంచంలోని సంపన్నుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం రాధికా మర్చంట్తో ఇటీవల ఘనంగా జరిగింది. ముంబైలోని బాంద్రా - కుర్లా కాంప్లెక్స్లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ వేడుక యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. దేశ విదేశాల నుంచి సినీ, రాజకీయ, పారిశ్రామిక, క్రీడా తదితర రంగాలకు చెందిన అతిరథ మహారథులు అనంత్ అంబానీ వివాహానికి విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు.
ఆసియా ఖండంలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ కుమారుడి పెళ్లి అంటే తరతరాలు చెప్పుకోవద్దు. అందుకు తగ్గట్టుగానే కళ్లు చెదిరే ఏర్పాట్లు చేశారు. తన సంపద ప్రదర్శనకు, తన అట్టహాసానికి, తన దర్పానికి, తన ఆడంబరానికీ అనుగుణంగా తనయుడి పెళ్లిని ముఖేష్ జరిపించారు. మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి అంబానీ అక్షరాల రూ.5 వేల కోట్లను ఈ పెళ్లి కోసం ఖర్చు చేశారని అంచనా.

ఇక ఈ వివాహానికి విచ్చేసిన బంధుమిత్రులు, ఆత్మీయులు, విశిష్ట అతిథుల కోసం అంబానీ కుటుంబం ప్రత్యేకంగా బహుమతులను తయారు చేయించింది. అన్నింటిలోకి అత్యంత ఖరీదైన అడెమార్స్ పిగ్యుట్ బ్రాండ్కు చెందిన వాచీలను కానుకగా ఇచ్చారట. దీని ఒక యూనిట్ ధర అక్షరాల రూ.2 కోట్లు. బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, రణ్వీర్ సింగ్లు ఈ వాచీలు పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చారు. వీటిని ఎంత మందికి ఇచ్చారో తెలియదు కానీ వీటి ఖరీదే వందల కోట్లలో ఉండే అవకాశం ఉంది. ఇదొక్కటే కాదు.. అంబానీల పెళ్లిలో ఎన్నో వింతలు, విడ్డూరాలు ఉన్నాయి.
సాదాసీదా వ్యక్తులే తమ ఇంట్లో జరిగే శుభకార్యాలకు హాజరయ్యే వారు ఎలాంటి కట్న, కానుకలు ఆశించరు. ఈ విషయాన్ని ప్రత్యేకంగా ఇన్విటేషన్ కార్డులోనే తెలియజేస్తారు. అలాంటిది ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ ఏ రేంజ్లో ఆలోచిస్తారో తెలిసిందే. అయితే ఎంత వద్దు అన్నా శుభకార్యం జరిగే ఇంటికి ఒట్టి చేతులతోనే వెళితే ఏం బాగుంటుంది. అందుకే కొందరు సెలబ్రెటీలు అనంత్ అంబానీ - రాధికా మర్చంట్లకు విలువైన కానుకలు అందజేసినట్లుగా నెట్టింట్లో వార్తలు వైరల్ అవుతున్నాయి.

అన్నింటిలోకి మెటా సీఈవో మార్క్ జుకర్ దాదాపు రూ.300 కోట్ల విలువ చేసే ప్రైవేట్ జెట్ని బహుమతిగా ఇవ్వడం విశేషం. ఇక అనంత్ తల్లిదండ్రులైన ముఖేష్ అంబానీ - నీతా అంబానీలు దుబాయ్లోని ప్రఖ్యాత పామ్ జుమేరాలో దాదాపు 3 వేల చదరపు అడుగుల ఇంటిని బహుమతిగా ఇచ్చారట. దీని విలువ రూ.60 కోట్లు ఉంటుందని అంచనా. దీనితో పాటు రూ.130 కోట్ల విలువ చేసే నగలు.. రూ.5.42 కోట్లు విలువ చేసే బెంట్లీ కారును కొడుకు కోడలికి అందజేశారట.
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఫ్రాన్స్ రాజధాని పారిస్లో రూ.40 కోట్ల విలువైన విలాసవంతమైన ఓ ఫ్లాట్, బిగ్బీ అమితాబ్ బచ్చన్ రూ.30 కోట్ల విలువైన నెక్పీస్.. రణవీర్ సింగ్ - దీపికలు రూ.20 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ కారును కొత్త దంపతులకు కానుకగా ఇచ్చినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇవే కాకుండా మరింత మంది సెలబ్రెటీలు సైతం అనంత్ - రాధిక జంటకు విలువైన కానుకలు ఇచ్చారట.


Click it and Unblock the Notifications











