కాందహార్ హైజాక్ వెబ్ సిరీస్.. టీజర్ అదరహో. ఓటీటీలో రిలీజ్ ఎప్పుడంటే!
ఓటీటీ దిగ్గజం హాట్ స్టార్ ఒరిజినల్ కంటెంట్తో దూసుకొస్తూ భారతీయ ఎంటర్టైన్మెంట్ మార్కెట్లో తన ప్రత్యర్ధులకు సవాల్ విసురుతోంది. ఇండియాపై గుత్తాధిపత్యం సాధించేందుకు ఓటీటీ కంపెనీలు పోటీపడుతున్నాయి. రోటీన్ క్రైమ్ , సస్పెన్స్ థ్రిల్లర్స్, కామెడీ కంటెంట్ కంటే వాస్తవ సంఘటలనతో తెరకెక్కుతోన్న వెబ్ సిరీస్, బయోపిక్స్ వంటి వాటిని ప్రేక్షకులు ఆదరిస్తుండటంతో ఓటీటీ సంస్థలు సైతం అలాంటి కంటెంట్ కోసం జల్లెడ పడుతూ.. ఈ తరహా కంటెంట్ క్రియేటర్లకు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. శోధించాలే కానీ మన చుట్టూ ఎన్నో అంశాలు, మరచిపోలేని ఘటనలు కోకొల్లలు. వాటిని అర్ధమయ్యేలా, మనసుకు హత్తకునేలా చెబితే చాలు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. ఈ దిశగానే నెట్ఫ్లిక్స్ పావులు కదుపుతోంది.
ఇదిలాఉండగా.. 1999 డిసెంబర్ 24న ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం (ఐసీ 814) ఉగ్రవాదుల చేతిలో హైజాక్కు గురైన ఘటన యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. తమ డిమాండ్లు సాధించడం కోసం చేసిన ఈ కుట్ర కారణంగా 180 మంది ప్రయాణీకులు దాదాపు 8 రోజుల పాటు దేశం కానీ దేశంలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఆ రోజున సాయంత్రం నేపాల్ నుంచి లక్నోకి వస్తున్న ఈ విమాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసి.. దానిని అమృత్సర్, లాహోర్, దుబాయ్ మీదుగా అఫ్ఘనిస్తాన్లోని కాందహార్కు తరలించారు.

కరడుగట్టిన ఉగ్రవాదులైన జైషే మొహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్, షేక్ ఒమర్, ముస్తాక్ జర్గార్ సహా 36 మందిని భారత్లోని జైళ్ల నుంచి విడుదల చేయాలని 200 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.1400 కోట్లు) ఇవ్వాలని భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడటం కోసం భారత్ సర్కార్ ఉగ్రవాదుల డిమాండ్లకు తలొగ్గింది. యావత్ భారతదేశాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసిన ఈ ఘటన కాందహార్ హైజాక్గా చరిత్రలో నిలిచిపోయింది. కానీ ఆ కరడుగట్టిన ముష్కరులను విడుదల చేసి భారత్ తగిన మూల్యం చెల్లించుకుంది. 2001లో పార్లమెంట్పై దాడి, 2008 ముంబై పేలుళ్లు, 2019 పుల్వామా ఉగ్రదాడి సహా ఎన్నో విధ్వంస ఘటనల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాదితో కాందహార్ హైజాక్ జరిగి 25 ఏళ్లు పూర్తికావొచ్చింది.
ఈ ఘటనపై నెట్ఫ్లిక్స్ తాజాగా '' ఐసీ 814 : ది కాందహార్ హైజాక్ '' పేరుతో వెబ్సిరీస్ను తెరకెక్కించింది. దీనికి సంబంధించిన టీజర్ను తాజాగా విడుదల చేశారు. నాడు హైజాక్ జరిగిన తీరును, విమానంలో ప్రయాణీకులు పడిన టెన్షన్, బందీలను విడిపించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన చర్చలను అద్భుతంగా తెరకెక్కించారు. ఈ వెబ్సిరీస్కు అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించగా.. మ్యాచ్బాక్స్ షాట్స్, బెనారస్ మీడియా వర్క్స్లు సంయుక్తంగా నిర్మించాయి. విజయ్ వర్మ, పంకప్ కపూర్, నసిరుద్దీన్ షా , అరవింద్ స్వామి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ వెబ్సిరీస్ను ఆగస్ట్ 29న స్ట్రీమింగ్ చేస్తున్నట్లు నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. ప్రస్తుతం కాందహార్ హైజాక్ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











