Irrfan Khan Death: ఇర్ఫాన్ ఖాన్ చివరి రోజులు అత్యంత విషాదకరం.. తీరని కోరికలెన్నో..
భారతీయ సినిమా సూపర్స్టార్ల కెరీర్ను పరిశీలిస్తే ఇమేజ్ పరంగా కొన్ని పరిమితులతోపాటు భాష, ప్రాంతీయ పరమైన ఇబ్బందులు ఉంటాయి. అలాంటి ఎల్లలూ లేని నటుడెవరైనా ఉన్నారంటే ఇర్ఫాన్ ఖాన్ ఒకరని నిస్సందేహంగా చెప్పవచ్చు. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా ప్రేక్షకుల గుండెల్లో తన నటనతో స్థానం సంపాదించుకొన్నారు. అలాంటి ప్రతిభావంతుడైన, విలక్షణ నటుడు ఆకస్మిక మృతి చెందడం ప్రపంచ సినిమా అభిమానుల హృదయాలను పిండేసింది. అయితే ఆయన చివరి రోజులు అత్యంత విషాద భరితంగా ముగియడం సన్నిహితులను, స్నేహితులను కుంగ దీస్తున్నది. ఆ వివారాల్లోకి వెళితే..

లండన్కు వెళ్లే ప్రయత్నాలు
కరోనావైరస్ కారణంగా లాక్డౌన్ కొనసాగుతుండగానే ఇర్ఫాన్ ఖాన్ అనారోగ్యానికి గురయ్యారు. అయితే మెరుగైన చికిత్స కోసం లండన్కు వెళ్లాలని చేసిన ప్రయత్నాలు వర్కవుట్ కాలేదు. యూకేలో ముఖ్యంగా లండన్లో కరోనా వైరస్ స్థాయి ఎక్కువగా ఉండటం, ప్రయాణ సదుపాయాలు అందుబాటులో లేకపోవడం వల్ల మెరుగైన చికిత్సకు దూరమయ్యారు అని సన్నిహితులు పేర్కొంటున్నారు.

చివరి రోజుల్లో మిత్రులను, సన్నిహితులకు దూరంగా
లాక్డౌన్ పరిస్థితుల్లో అనారోగ్యం రోజు రోజుకు విషమించడంతో తనకు ఇష్టమైన వ్యక్తులను కలువాలని, ఆయనకు ఇష్టమైన వ్యక్తులు ఇర్ఫాన్ను కలువడానికి చాలా తాపత్రయ పడ్డారట. లాక్డౌన్, క్వారంటైన్ పరిస్థితులు సన్నిహితులతో కలువలేకపోయాయని తెలిసింది. చివరి రోజుల్లో తనకు ఇష్టమైన వ్యక్తులను కలిసి కోరిక తీరకుండానే ఆయన తిరిగి లోకాలకు వెళ్లిపోయారు.

ఓ పక్క అనారోగ్యం.. మరోపక్క తల్లి ఆరోగ్యం
ఇక ఓ పక్క తన అనారోగ్యం వేధిస్తున్న సమయంలోనే తల్లి సయిదా బేగం మరణం ఇర్ఫాన్ ఖాన్ను మరింత కుంగ దీసింది. లాక్డౌన్ కారణంగా ఆమె అంత్యక్రియలకు జైపూర్కు వెళ్లలేకపోవడం ఆయనను మరింత బాధించింది. తల్లి మరణంతో మరింత కుంగిపోయాడు. ఆ పరిస్థితుల నుంచి బయటపడలేకపోయాడు. గత ఐదు రోజులుగా ఒకరకమైన మానసిక క్షోభకు గురయ్యారు అని సన్నిహితులు పేర్కొన్నారు.

తల్లి అంత్యక్రియలకు దూరంగా
రాజస్థాన్లోని టోంక్ నవాబ్ వంశానికి చెందిన ఇర్ఫాన్ ఖాన్ తల్లి సయిదా బేగం శనివారం మరణించారు. జైపూర్లోని బెనీవాల్ కంటా కృష్ణ కాలనీలో నివాసం ఉంటున్న ఆమె అంత్యక్రియలకు ఇర్ఫాన్ ఖాన్ హాజరుకావడానికి కుదర్లేదు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే తల్లి అంత్యక్రియలకు హాజరుకావడం ఆయన చివరి రోజుల్లో మరో విషాదంగా మారింది.

బాలీవుడ్ ప్రముఖులకు దక్కని చివరిచూపు
ఇలాంటి పరిస్థితుల్లో ఇర్ఫాన్ ఖాన్ ఆరోగ్యం విషమించడంతో ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ హాస్పిటల్లో చేర్పించారు. భార్య సుతాపా సిక్దర్, బాబిల్, ఆయాన్ అనే ఇద్దరు కుమారులు ఆయనకు తోడుగా హాస్పిటల్లోనే ఉన్నారు. హాస్పిటల్లో ఉన్న సమయంలో సన్నిహితులు, స్నేహితులు, బాలీవుడ్ ప్రముఖులు హాస్పిటల్లో ఆయనను పరామర్శించడానికి వీలు చిక్కలేదు. చివరకు దర్శకులు, పీకూ ఫేం షుజిత్ సర్కార్ లాంటి వాళ్లు ఫోన్లోనే మాట్లాడినట్టు స్నేహితులు చెప్పుకొన్నారు.
Recommended Video

చివరి ప్రయాణం ఒంటరిగానే..
బాలీవుడ్లో అత్యంత ప్రముఖుడు, ప్రతిభావంతుడైన ఇర్ఫాన్ ఖాన్ చివరి రోజుల్లో ఒంటరి ప్రయాణమే చేశాడు. అంతిమ గడియల్లో కూడా చితికి ఒంటరిగానే ప్రయాణించే పరిస్థితి కనిపించింది. కరోనా కారణంగా బాలీవుడ్ ప్రముఖులు బయటకు రాలేని పరిస్థితి నెలకొన్నది. ఆయన అంత్యక్రియలను బుధవారం సాయంత్రం నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











