Jacqueline Fernandez మెడకు మనీలాండరింగ్ కేసు... ప్రియుడితో సహజీవనం చేస్తూ అలా బుక్కైందట!
బాలీవుడ్ టాప్ హీరోయిన్ జాక్వలైన్ ఫెర్నాండేజ్ మెడకు మనీ లాండరింగ్, ఫెమా ఉల్లంఘన కేసు చుట్టుకోబోతుందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తున్నది. గత కొద్ది కాలంగా దక్షిణాదికి చెందిన పారిశ్రామిక వేత్తతో సహజీవనం చేస్తున్నారు. ముంబైలో సముద్ర తీరంలో కోట్లాది రూపాయాలతో విలాసవంతమైన భవనంలో ఉంటున్నారనే వార్తలతో జాక్వలైన్ ఫెర్నాండేజ్పై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు (ఈడీ) దృష్టిపెట్టింది. మనీ లాండరింగ్ కేసులో జాక్వలైన్ ఫెర్నాండేజ్ను ఐదు గంటలకుపైగానే విచారించడం హిందీ సినీ పరిశ్రమలో ప్రకంపనలు మొదలయ్యాయి. అయితే జాక్వలైన్కు మనీ లాండరింగ్ వ్యవహారంతో సంబంధం ఏమిటంటే? జాక్వలైన్తో సహజీవనం చేస్తున్న పారిశ్రామిక వేత్త ఎవరు? అనే వివరాల్లోకి వెళితే..

175 కోట్ల వ్యయంతో బంగళా
బాలీవుడ్లో గ్లామర్ పంట పండిస్తున్న జాక్వలైన్ ఫెర్నాండేజ్ ప్రస్తుతం చెన్నైకి చెందిన పారిశ్రామిక వేత్తతో సహజీవనం చేస్తున్నది. అతడితో కలిసి ఉండేందుకు ముంబైలో రూ.175 కోట్ల వ్యయంతో ఓ విలాసవంతమైన బంగ్లాను కొనుగోలు చేశారు. ముంబైలో జుహులోని ఖరీదైన ప్రాంతంలో సముద్రానికి ఎదురుగా ఉన్న ఓ బంగ్లాను సొంతం చేసుకొన్నారు అని ఓ ఆంగ్ల దిన పత్రిక ఇటీవల కథనాన్ని వెల్లడించింది.

సుకేశ్ చంద్రశేఖర్ హవాలా దందా
మనీ లాండరింగ్ కేసులో రంగంలోకి దిగిన సుకేష్ చంద్రశేఖర్ అనే హవాలా దందాను నిర్వహించే వ్యక్తి అనుమానాస్పద వ్యవహారాలపై దృష్టిపెట్టారు. ఇటీవల సుకేశ్ ఇంటిపై మెరుపు దాడులు నిర్వహించడంతో అనేక విషయాలు ఈడీ అధికారుల దృష్టికి వచ్చాయి. దాంతో జాక్వలైన్ ఫెర్నాండేజ్ వ్యవహారం కూడా ముడిపడి ఉండటంతో ఆమెను విచారించినట్టు తెలుస్తున్నది. అయితే ఆమెను ఈ కేసులో నిందితురాలిగా విచారించలేదనే విషయాన్ని అధికారులు స్పష్టం చేసినట్టు తెలుస్తున్నది.

చెన్నై పారిశ్రామికవేత్తను బెదిరించి..
ఇటీవల చెన్నైలో సముద్ర తీరంలో ఉన్న సుకేశ్ చంద్రశేఖరన్ ఇంటిపై దాడులు నిర్వహించారు. దాంతో చెన్నైకి చెందిన ఓ పారిశ్రామికవేత్త నుంచి 200 కోట్ల మేర హవాలా కార్యక్రమాలు నిర్వహించారనే ఆరోపణలు సుకేశ్ చంద్రశేఖర్పై వచ్చాయి. గతంలో జైలు నుంచే హవాలా రాకెట్ నిర్వహించారు. ఆయనపై ఇలాంటి వ్యవహరాలపై 20 కేసులు నమోదయ్యాయి అనే విషయం వెలుగులోకి వచ్చింది. అయితే జాక్వలైన్ సహజీవనం చేస్తున్న బిజినెస్మెన్ను కూడా బెదిరించినట్టు, బ్లాక్ మెయిల్ చేసినట్టు వెలుగులోకి వచ్చింది.

సుకేశ్ చంద్రశేఖర్ లీలలు ఇలా
అంతేకాకుండా సుకేశ్ చంద్రశేఖర్ లీలలు ఎన్నో బయటకు వచ్చాయి. సంపన్న కుటుంబాలను బెదిరించడానికి ఏకంగా ప్రధాని కార్యాలయం, సీబీఐ హెడ్ క్వార్టర్స్లో పనిచేసే సీనియర్ అధికారుల మొబైల్ నంబర్లు, ల్యాండ్ లైన్ నంబర్లను ఉపయోగించారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి, సుప్రీంకోర్టు జడ్జీ పీఏ అని అందర్ని బెదిరించారు. ఎన్నికల కమిషన్కు లంచం ఇచ్చారనే ప్రధాన ఆరోపణలు వచ్చిన విషయం తాజా దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది.

ఈడీ అధికారులు దాడుల్లో
చెన్నైలోని విలాసవంతమైన భవనంలో ఉన్న విషయాలు చూసి ఈడీ అధికారులు కంగు తిన్నారట. ఆయన ఇంటిలోని ఇటాలియన్ మార్బుల్స్, ఖరీదైన ఫర్నీచర్, ఆ ఇంటి బాగోగులు చూసుకోవడానికి పదుల సంఖ్యలో పని మనుషులు ఉన్నారు. అంతేకాకుండా 16 హై ఎండ్ లగ్జరీ కారులు అధికారులు గుర్తించారు అనే విషయం విస్మయానికి గురి చేసింది.

డజనుకుపైగా విలాసవంతమైన కార్లు సీజ్
చెన్నైలోని సుకేష్ చంద్రశేఖరన్ ఇంటిలో రోల్స్ రాయిస్ ఘోస్ట్, బెంట్లీ బెంటాయ్గా, ఫెరారీ 438 ఇటాలియా, లాంబోర్గిని ఉరుస్, ఎస్కాలేడ్, మెర్సిడెజ్ ఏఎంజీ 63, బీఎండబ్ల్యూ రేంజ్ రోవర్, మెర్సిడెజ్ లాంటి కార్లను తన ఇంటిలో ఈడీ అధికారులు గుర్తించారు. ఈ దాడుల్లో 80 లక్షలకుపైగా నగదు, డజన్కుపైగా కార్లను సీజ్ చేశారు. ఇలాంటి సుకేశ్ చంద్రశేఖర్తో లావాదేవీలు జరిగినట్టు అనుమానిస్తూ పలు కోణాల్లో కేసును విచారించడానికి జాక్వలైన్ను ప్రశ్నించినట్టు తెలుస్తున్నది. ఈ విచారణ సోమవారం రాత్రి 7.30 గంటల వరకు కొనసాగినట్టు తెలిసింది.


Click it and Unblock the Notifications











