అలాంటివన్నీ కామన్.. నేనస్సలు పట్టించుకోను: జాన్వీ కపూర్
శ్రీదేవి వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేసింది హీరోయిన్ జాన్వీ కపూర్. రావడం రావడమే గ్లామర్ బ్యూటీగా బీ టౌన్ ప్రేక్షకులను మాయ చేసి, భారీ ఫాలోయింగ్ కూడగట్టుకుంది. సోషల్ మీడియాలో సైతం యాక్టివ్గా ఉంటూ సెగలు రేపే పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది జాన్వీ. అయితే తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె.. తాను ఎలాంటి విమర్శలను పట్టించుకోనని చెప్పేసింది.
ప్రతిభ ఉన్న వాళ్ళను పక్కనబెట్టి స్టార్ హీరోహీరోయిన్ల వారసులకు, బంధువులకు మాత్రమే సినిమా అవకాశాలు ఇస్తున్నారని కొంతకాలంగా బాలీవుడ్ వర్గాల్లో చర్చలు ముదిరాయి. గతంలో కాఫీ విత్ కరణ్ కార్యక్రమానికి హాజరైన కంగనా రనౌత్ తొలిసారి ఈ అంశం గురించి విమర్శలు చేసింది. ఈ మేరకు ఇటీవలి కాలంలో జనాల్లో కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో ధఢక్ సినిమాతో బాలీవుడ్ తెరపై కాలుమోపిన జాన్వీ కపూర్ పై కూడా విమర్శల వెల్లువ కొనసాగింది. శ్రీదేవి కూతురు కాబట్టే జాన్వీ కపూర్ కూడా సులభంగా అవకాశం దక్కించుకుందని విమర్శించారు కొందరు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ.. తనపై వస్తున్న విమర్శల పట్ల ఆసక్తికరంగా స్పందించింది.
''ఒక్క అవకాశం కోసం ప్రాణం ఇచ్చేవారు ఎంతోమంది ఉన్నారని నాకు తెలుసు. బంధుప్రీతి గురించి వారి మనోభావాలను నేను అర్థం చేసుకుంటాను కానీ, ఆ విమర్శల గురించి ఆలోచిస్తూ మాత్రం కుంగిపోను. నన్ను నేను నిరూపించుకునే వరకు ఈ విమర్శలు వస్తూనే ఉంటాయని నాకు తెలుసు'' అని జాన్వీ కపూర్ రియాక్ట్ అయింది.


Click it and Unblock the Notifications











