కశ్మీర్ అంశంపై భారతీయురాలిగా ప్రియాంక రియాక్ట్ అయ్యారు: జావేద్ అక్తర్ మద్దతు
కశ్మీర్ అంశంపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని ప్రియాంక చోప్రా సమర్ధించిన సంగతి తెలిసిందే. అయితే ఐక్యరాజ్య సమితి గుడ్ విల్ అంబాసిడర్ హోదాలో ఉన్న ప్రియాంక ఇలా చేయడం సరైంది కాదని, భారత్-పాకిస్థాన్ రెండు దేశాల మధ్య అణు యుద్ధం జరుగాలనే ఆమె కోరుకుంటున్నారని ఆరోపిస్తూ ఆమెను ఆ హోదా నుంచి తొలగించాలని... ఐక్యరాజ్య సమితికి పాకిస్థాన్ లేఖ రాసింది.
ప్రియాంక చోప్రాపై పాకిస్థాన్ ఫిర్యాదు చేయడంపై ప్రముఖ బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్ స్పందించారు. ఒక భారతీయులిగా ప్రియాంక చోప్రా తన నిర్ణయాన్ని చెప్పిందని, భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించిందంటూ.... ఆమెకు జావేద్ అక్తర్ తన మద్దతు ప్రకటించారు.

అణ్వాయుధాలను ముందుగా ప్రయోగించకూడదన్నది భారత్ విధానం, అయితే అది పరిస్థితులకు అనుగుణంగా మారవచ్చు అని ఇటీవల రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ చేసిన కామెంట్లను ప్రియాంక సమర్ధించారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య అణు యుద్ధం జరుగాలని ప్రియాంక కోరుకుంటోందని, యూఎన్ గుడ్ విల్ అంబాసిడర్ హోదాలో ఉన్న వ్యక్తి ఇలా చేయడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని, వెంటనే ఆమెను ఆ హోదా నుంచి తొలగించాలని పాకిస్థాన్ మంత్రి షిరీన్ మజారి ఐక్యరాజ్య సమితికి లేఖ రాశారు.
కశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా ఆ రాష్ట్రానికి ఇప్పటి వరకు కొనసాగుతున్న స్వయంప్రతిపత్తి హోదాను భారత్ రద్దు చేసింది. భారత దేశంలో ఇతర రాష్ట్రాలకు వర్తించే అన్ని చట్టాలు ఇకపై జమ్మూ కశ్మీర్కు సైతం వర్తిస్తాయి. అయితే భారత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పాకిస్థాన్ వ్యతిరేకిస్తోంది. అయితే భారత్ అంతర్గత వ్యవహరాల్లో తలదూర్చడం లాంటి చర్యలకు పాల్పడుతున్న పాకిస్థాన్ మీద సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











