ప్రముఖ హాస్యనటుడి మృతి అంటూ వైరల్.. బతికి ఉండగానే చంపేసిన మీడియా!
బాలీవుడ్లో ప్రముఖ హాస్య నటుడు ఖాదర్ ఖాన్ మరణవార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఖాదర్ ఖాన్ ఇక లేరంటూ మీడియాలో వార్త రావడంతో సినీ ప్రముఖులు, అభిమానులు దిగ్బ్రాంతికి గురయ్యారు. అయితే ఆయన కుటుంబ సభ్యులు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వడంతో ఖాదర్ ఖాన్ మరణవార్త బోగస్ అని తేలిపోయింది. వివరాల్లోకి వెళితే...

కొంతకాలంగా కెనడాలో
గత కొద్దికాలంగా కమెడియన్ ఖాదర్ ఖాన్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొంతకాలంగా కెనడాలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఖాదర్ ఖాన్ మరణించారంటూ వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి. అయితే తన తండ్రి మరణవార్తపై కుమారుడు సర్ఫరాజ్ స్పందించారు. తన తండ్రి ఆరోగ్యం నిలకడగా ఉంది అని స్పష్టం చేశారు.

మరణవార్త అవాస్తవమని
ఖాదర్ ఖాన్ కుమారుడు సర్ఫరాజ్ మాట్లాడుతూ.. నా తండ్రి మరణంపై మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. నా తండ్రి ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది అని పీటీఐతో అన్నారు.

శ్వాస సంబంధిత వ్యాధితో
ఖాదర్ ఖాన్ వయసు 81 సంవత్సరాలు. శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతూ కెనడాలోని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రొగ్రెసివ్ సుప్రాన్యూక్లియర్ పాల్సీ (పీఎస్పీ) అనే వ్యాధికి లోనయ్యారు. ప్రస్తుతం ఆయన బీపాప్ వెంటిలెటర్పై చికిత్స పొందుతున్నారు. కెనడాలో స్థిరపడిన ఆయన కుమారుడి వద్ద ప్రస్తుతం ఉన్నారు.
అమితాబ్ బచ్చన్ ఆందోళన
ఖాదర్ ఖాన్ ఆరోగ్యం క్రమేపీ క్షీణించడంపై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్పందించారు. ఆయన ఆరోగ్యం కుదుటపడాలని అభిమానులను, సినీ ప్రముఖులను కోరారు. అద్భుతమైన ప్రతిభావంతుడైన నటుడు ఖాదర్ ఖాన్ ప్రస్తుతం అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నారు. ఖాదర్ ఖాన్ రచయితగా నా చిత్రాలకు విశేష సేవలందించారు. చాలా మందికి తెలియదు. ఆయన గణితశాస్త్రాన్ని అద్బుతంగా బోధిస్తారు అని అమితాబ్ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











