ఆ స్టూడియోపై హీరోయిన్ సిస్టర్స్ కన్ను.. 183 కోట్లతో డీల్.. రోడ్డునపడనున్న లక్షల మంది
100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన భారతీయ చిత్ర పరిశ్రమకు గర్వకారణంగా నిలిచే స్టూడియోలు ముంబై, హైదరాబాద్, చెన్నైలలో ఎన్నో ఉన్నాయి. అపురూప కళాఖండాలు తెరకెక్కడానికి వేదికగా నిలిచిన పలు స్టూడియోలు కాలక్రమంలో శిథిలావస్ధకు చేరుకుంటున్నాయి. మరికొన్ని కళ్యాణ మంటపాలుగా, రియల్ ఎస్టేట్ వెంచర్స్ల మారిపోతున్నాయి. తాజాగా భారతీయ సినీ పరిశ్రమకే గర్వకారణంగా నిలిచిన ఓ స్టూడియో కాలగర్భంలో కలిసిపోవడానికి సిద్ధమైంది. ఈ వివరాల్లోకి వెళితే..
కాలగర్భంలోకి ఫిల్మిస్తాన్ స్టూడియో
హిందీ చిత్ర పరిశ్రమకు కేంద్రమైన ముంబై మహానగరంలో ఎన్నో స్టూడియోలు ఉన్నాయి. సినిమాలు, సీరియల్స్, వాణిజ్య ప్రకటనలు, టీవీ కార్యక్రమాలు, రియాలిటీ షోలు వీటిలో నిర్మాణం జరుపుకుంటున్నాయి. మనకు ఎందరో స్టార్స్ను, మరపురాని చిత్రాలను అందించాయి. బాంబే టాకీస్, ఆర్కే స్టూడియో, ఫిల్మిస్తాన్ వంటి స్టూడియోలు హిందీ చిత్ర పరిశ్రమకు గుండెకాయగా వెలుగొందాయి. కానీ నేడు కాలం మారిపోయింది. అత్యాధునిక సదుపాయాలతో కూడిన హైటెక్ స్టూడియోలు ఆ స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి. దాంతో పాత స్టూడియోలను అమ్ముకుని కమర్షియల్ భవనాలుగా మార్చేస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో మరో ఐకానిక్ స్టూడియో చేరింది. అదే ఫిల్మిస్తాన్ స్టూడియో.
బాలీవుడ్ స్వర్ణయుగానికి కేరాఫ్
బ్రిటీష్ పాలనలో భారతదేశంలో ఏర్పడిన స్టూడియోలో ఫిల్మిస్తాన్ స్టూడియో కూడా ఒకటి. 1943లో శశధర్ ముఖర్జీ (బాలీవుడ్ హీరోయిన్లు కాజోల్, రాణి ముఖర్జీల తాత), నటుడు అశోక్ కుమార్, జ్ఞాన్ ముఖర్జీ, రాయ్ బహదూర్ చునీలాల్లు ఈ స్టూడియోను స్థాపించారు. బాంబే టాకీస్ను విడిచిపెట్టిన వీరంతా హైదరాబాద్ నిజాం సహాయంతో గోరేగావ్ వెస్ట్లో ఫిల్మిస్తాన్ స్టూడియోను స్థాపించారు. ఇక్కడ ఆ కాలంలోనే భారీ సౌండ్ స్టేజ్లు, ఔట్డోర్ సెట్లు ఉండేవి. సినిమాలు, టీవీ షోలు, వాణిజ్య ప్రకటనలకు ఈ స్టూడియో కేరాఫ్ అడ్రస్. అనార్కలి, షహీద్, జాగృతి, తుమ్సా నహిన్ దేఖా, దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే, రా వన్ వంటి అనేక చిత్రాలు ఇక్కడ నిర్మాణం జరుపుకున్నాయి.

183 కోట్లతో డీల్
అలాంటి ఎన్నో జ్ఞాపకాలను తనలో దాచుకున్న ఫిల్మిస్తాన్ స్టూడియో త్వరలో కాలగర్భంలో కలిసిపోనుంది. జూలై 3, 2025న ఆర్కేడ్ డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ .. ఈ ఫిల్మిస్తాన్ స్టూడియోను రూ.183 కోట్లకు కొనుగోలు చేసింది. 4 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ స్టూడియోను కూలగొట్టి ఒక్కొక్కటి 50 అంతస్తులుండే రెండు టవర్లతో కూడిన లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ను నిర్మించనున్నారు. ఈ టవర్లలో 3 BHK, 4 BHK, 5 BHK ఫ్టాల్స్తో పాటు పెంట్హౌస్లు ఉంటాయి. 2026లో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ విలువ రూ.3 వేల కోట్లుగా రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.
రోడ్డున పడనున్న లక్షలాది మంది కార్మికులు
అయితే ఫిల్మిస్తాన్ స్టూడియోను విక్రయించడం పట్ల ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేష్ (ఏఐసీడబ్ల్యూఏ) తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. స్టూడియో కూల్చివేతను ఆపాలని వారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను కోరారు. ఈ స్టూడియో ఏళ్లుగా లక్షలాది మంది కార్మికులు, కళాకారులకు ఉపాధిని కల్పించిందని .. దానిని కూల్చివేయడమంటే ఎంతోమంది తమ జీవనోపాధిని కోల్పోవడమేనని అసోసియేషన్ పేర్కొంది. ఫిల్మిస్తాన్ స్టూడియో కేవలం ఒక ప్రదేశం కాదు.. అది హిందీ సినిమా స్వర్ణయుగానికి చిహ్నం. దాని అమ్మకంతో బాలీవుడ్లో ఒక అధ్యాయం ముగిసిందని.. దీనితో ఎంతోమంది నటీనటులకు అనుబంధం ఉందని అసోషియేషన్ పేర్కొంది.


Click it and Unblock the Notifications











