సుశాంత్ గురించి ఫిబ్రవరిలోనే ఫిర్యాదు.. సంచలన నిజాలు బయట పెట్టిన కేకే సింగ్
సుశాంత్ సింగ్ కేసులో ఎన్నో ట్విస్ట్లు, ఇంకెన్నో మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఇంత వరకు సుశాంత్ బాలీవుడ్ నెపోటిజం, మూవీ మాఫియా వల్ల డిప్రెషన్కు గురయ్యాడని అంతా అనుకున్నారు. సుశాంత్ తండ్రి కేకే సింగ్ రియా చక్రవర్తిపై చేసిన ఆరోపణలతో అంతా తారుమారైంది. తాజాగా కేకే సింగ్ బాంద్రా పోలీసుల తీరు గురించి చెప్పిన సంగతులు అందర్నీ షాక్కు గురి చేస్తున్నాయి. ఇంతకీ కేకే సింగ్ చెప్పిన విషయాలేంటో ఓసారి చూద్దాం.

ముంబై పోలీసుల విచారణ..
జూన్ 14న సుశాంత్ మరణించిన తరువాతి క్షణం నుంచి ముంబై పోలీసులు ఆత్మహత్యగానే కేసును పరిశీలించసాగారు. ఈ మేరకు బాలీవుడ్ నుంచి కొందరి స్టేట్మెంట్లను తీసుకున్నారు. ఇక సోషల్ మీడియాలో వచ్చిన ఒత్తిడి మేరకు సినీ పెద్దలను కూడా విచారించారు. అయితే కేసులో మాత్రం ఎలాంటి పురోగతి కనిపించలేదు.

ఎంట్రీ ఇచ్చిన కేకే సింగ్..
తన కుమారుడి మరణం సంభవించి దాదాపు 40 రోజులు అయినా కేసు ముందుకు జరగకపోవడంతో సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఫైర్ అయ్యారు. రియా చక్రవర్తిపై పాట్నాలో కేసు నమోదు చేశారు. డబ్బులు కాజేసింది, డిప్రెషన్కు, చావుకు కారణమైందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాట్నా పోలీసుల జోక్యంతో కేసు ముమ్మరంగా ముందుకు సాగింది.

తప్పించుకునేందుకు రియా పాట్లు..
ఇక సుశాంత్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రియాను విచారించేందుకు పాట్నా పోలీసులు చర్యలు చేపట్టారు. అయితే రియా మాత్రం వీరి నుంచి తప్పించుకుంటూ తిరుగుతోంది. ముందస్తు బెయిల్ తీసుకోవడానికి ఖరీదైన లాయర్ను కూడా నియమించుకుంది. ఈ కేసును పాట్నా నుంచి ముంబైకి మార్చమని కూడా వేడుకుంది.

గతంలోనే ఫిర్యాదు..
సుశాంత్ పరిస్థితి పట్ల, హాని జరగనుందనే అనుమానంతో ఫిబ్రవరిలోనే బాంద్రా పోలీసులకు కేకే సింగ్ ఫిర్యాదు చేశారట. ఈ మేరకు తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ అనేక విషయాలు తెలిపాడు. ఫిబ్రవరి 25నే సుశాంత్కు డేంజర్ ఉందని ఫిర్యాదు చేసినట్టు, అందులో కొందరి పేర్లను కూడా వ్యక్తపరిచానని, అయితే సుశాంత్ మరణం తరువాత కూడా వారు దాన్ని పట్టించుకోలేదని వాపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











