Lata Mangeshkar తిరిగిరాని లోకాలకు దిగ్గజ గాయని.. లతా మంగేష్కర్ మరణానికి కారణమేమిటో తెలుసా?
దేశం గర్వించదగిన గాయని, ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంగీతానికి ఘన కీర్తిని సంపాదించి పెట్టిన లతా మంగేష్కర్ ఇక లేరు. కోవిడ్, న్యుమేనియా వ్యాధి, ఇతర ఆరోగ్య సమస్యలతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో చేరిన లతా మంగేష్కర్ ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆమె మరణ వార్తతో భారతీయ సినీ పరిశ్రమతోపాటు ప్రపంచ సంగీత సాగరం తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. ఆమె మరణాన్ని జీర్ణించుకోలేని అభిమానులు గుండె పగిలేలా రోదిస్తున్నారు. లతా మంగేష్కర్ మరణం నేపథ్యంలో అభిమానులు, శ్రేయోభిలాషులు, సన్నిహితులు, స్నేహితులు, రాజకీయ, సినీ, వ్యాపార వర్గాలు తమ సంతాపాన్ని, ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. లతా మంగేష్కర్ వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాల్లోకి వెళితే..

జనవరిలో కరోనావైరస్తో
జనవరి మాసంలో లతా మంగేష్కర్ కరోనావైరస్ బారిన పడ్డారు. ఆమె ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో చేర్పారు. అప్పటి నుంచి ఆమెకు వైద్య నిపుణులు ప్రత్యేక పర్యవేక్షణతో చికిత్స అందించారు. దిగ్జజ గాయనిని బతికించుకొనేందుకు వైద్యుల అవిశ్రాంత పోరాటం చేశారు. శనివారం ఉదయం ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. గత నెల రోజులుగా మృత్యువుతో పోరాటం చేసిన ఆమె ఆదివారం ఉదయం తిరిగిరాని లోకాలు వెళ్లిపోయారు.

1929లో జననం..
ప్రముఖ రంగస్థల నటుడు, గాయకుడు పండిట్ ధీనానాథ్ మంగేష్కర్, షీవంతి దంపతులకు
లతా మంగేష్కర్ 1929, సెప్టెంబర్ 28న జన్మించారు. లతాకు ముందుగా హేమ అని నామకరణం చేశారు. ఆ తర్వాత ఆమె పేరును లతా మంగేష్కర్గా మార్చారు. లతాకు ఆశా భోంస్లే, ఉషా మంగేష్కర్ అనే ఇద్దరు సోదరిమణులు ఉన్నారు. లతా మంగేష్కర్ తనకు ఐదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే పాడటం నేర్చుకొన్నారు.

1945లో తొలి పాటను పాడిన లతా
లతా మంగేష్కర్ తొలిసారి మరాఠి చిత్రం కిటీ హాసాల్ కోసం తొలిసారి పాట పాడారు. కానీ తన తొలిపాటను ఎడిటింగ్లో తీసేశారు. ఆ తర్వాత పెహలీ మంగళాగౌర్ అనే చిత్రంలో నటాలీ చైత్రాచీ అనే పాటను పాడారు. 1945లో తన గురువు వినాయక్ మాస్టర్ అప్పటి బొంబాయికి మారడంతో లత అదృష్టరేఖ మారిపోయింది. బొంబాయిలో హిందుస్థాని క్లాసిక్ మ్యూజిక్ నేర్చుకొని హిందీ సినిమాల్లో వరుస ఆఫర్లు దక్కించుకొన్నారు. దాదాపు అన్ని భాషల్లో 20 వేలకుపైగా పాటలు పాడారు.

నిర్మాతగా, సంగీత దర్శకురాలిగా..
లతా మంగేష్కర్ కేవలం గాయనిగానే స్థిరపడలేదు. సింగర్గా గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించిన తర్వాత నిర్మాతగా, సంగీత దర్శకురాలిగా మారారు. మరాఠీ చిత్రం రాష్ట్రమ్ పహ్వానే, మరో నాలుగు చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. తన జీవితంలో వాదాల్ అనే మరాఠీ చిత్రాన్ని, ఝంఝుర్, కంచన్, లేకిన్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.

లతకు దక్కిన అవార్డులు, రివార్డులు
దేశ సంగీత రంగానికి విశేష సేవలు అందించిన లతా మంగేష్కర్కు ఎన్నో అత్యుత్తమ అవార్డులు లభించాయి. తన కెరీర్లో తొలిసారి 1969లో పద్మ భూషణ్ పురస్కారాన్ని భారత ప్రభుత్వం అందించింది. ఆ తర్వాత 1999లో పద్మ విభూషణ్ సత్కరించింది. 1989లో దాదా సాహెబ్ ఫాల్కే (1989) అవార్డును అందుకున్నారు. 2001 భారత అత్యున్నత పురస్కారం భారతరత్నను అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణ్ చేతుల మీదుగా లతా మంగేష్కర్ అందుకున్నారు. భారతీయ పురస్కారాలే కాకుండా ఫ్రాన్స్ ప్రభుత్వం 'ది లీజియన్ ఆఫ్ హానర్' పురస్కారం పొందారు.


Click it and Unblock the Notifications











