సింగర్ కనికాపై మర్డర్ కేసు? లక్నో పోలీసుల సీరియస్.. అదృశ్యమైన ఫ్రెండ్ కోసం గాలింపు
సింగర్ కనికాకపూర్ అంశాన్ని లక్నో పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తున్నది. లండన్ నుంచి లక్నోకు చేరుకొన్న కనికాకపూర్ అధికారుల కన్నుగప్పి పరీక్షలకు హాజరకాకుండా ఎయిర్పోర్టు నుంచి హోటల్కు చేరుకోవడం తెలిసిందే. అనంతరం ఆమెకు కరోనా పాజిటివ్ అని తేల్చడంతో ఈ వివాదం మొదలైంది. ఈ క్రమంలో మూడుకుపైగా విలాసవంతమైన విందులకు హాజరయ్యారని, ఆ పార్టీలో వసుంధర రాజే, ఆమె కుమారుడు దుష్యంత్ సింగ్ తదితరులు పాల్గొనడం రాజకీయంగా మరింత వివాదంగా మారింది. ఈ క్రమంలో పోలీసులు కనికా వ్యవహారాన్ని సీరియస్గా తీసుకొన్నట్టు సమాచారం.

కనికాకు వైద్యుల వార్నింగ్
ప్రస్తుతం కనికాకపూర్ను లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లోని ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్లోని కోవిడ్-19 యూనిట్ గదిలో ప్రత్యేకంగా చికిత్సను అందిస్తున్నారు. తనకు సరైన వసతులు కల్పించడం లేదనే గొడవ చేయడంతో అధికారులు తీవ్రంగా స్పందించారు. నీవు సెలబ్రిటీలా కాకుండా పేషెంట్లా వ్యవహరించాలి అంటూ వార్నింగ్ ఇవ్వడం తెలిసింేద.

పోలీసుల దర్యాప్తు వేగవంతం
ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా వైద్య పరీక్షలు నిర్వహించకుండా హోటల్లో ఉండటం, ఆ తర్వాత విలాసవంతమైన పార్టీలకు హాజరైన విషయంతో ఆమెపై తీవ్రమైన కేసులను పెట్టడానికి సిద్ధం అవుతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆమె పాల్గొన్న విందుకు హాజరైనట్టు భావిస్తున్న 260 మందితో అధికారులు మాట్లాడటం, ఆ తర్వాత చికిత్సలు కూడా జరిపించి పలు విషయాలను తెలుసుకొన్నారు.

కనికా ఫ్రెండ్ గురించి ఆరా
కనికాకపూర్తోపాటు లక్నోకు వచ్చిన తన స్నేహితురాలు ఓజాస్ దేశాయ్ గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. కనికాకు కరోనా పాజిటివ్ తేలినప్పటి నుంచి ఓజాస్ దేశాయ్ కనిపించకుండా పోయారు. ప్రస్తుతం ఆమె గురించి గాలింపు చర్యలు చేపట్టారు. ముంబైలోని ఆమె నివాసానికి వెళ్లి ఆమె ఆచూకి గురించి తెలుసుకొనే ప్రయత్నం చేశారు. ఓజాస్ ఎక్కడున్నదనే విషయంపై పోలీసులు దృష్టిపెట్టినట్టు సమాచారం.

లక్నోలో కేసు నమోదు
సింగర్ కనికా కపూర్ కేసు విషయంలో చాలా తప్పిదాలు, లోపాలు ఉన్నట్టు గుర్తించినట్టు పోలీసులు అంగీకరిస్తున్నారు. ఆమెపై ఛీప్ మెడికల్ ఆఫీసర్ స్థానిక సరోజిని నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. 14 రోజుల పాటు స్వీయ గృహనిర్భంధంలో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఉండాలని ఆదేశించారు.

తీవ్రమైన కేసు పెట్టాలని
కరొనావైరస్ విస్తృతంగా, వేగంగా విస్తరిస్తున్న సమయంలో ప్రభుత్వ ఆదేశాలను తుంగలోకి తొక్కినందుకు గాను... తీవ్రమైన కేసు నమోదు చేయాలని పోలీసులు అధికారులు భావిస్తున్నారు. ఐపీసీ సెక్షన్ల కింద పలు కేసులు నమోదు చేయాలని భావిస్తున్నారు. వీలైతే మర్డర్ కేసు స్థాయిలో కేసు నమోదు చేయడానికి కూడా సిద్ధమని పోలీసులు మీడియాకు వెల్లడించినట్టు సమాచారం. అయితే అధికారులు ఈ కేసు వివరాలను ధృవీకరించాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











