గుర్రుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు: ఆ సినిమాపై అక్కడ బ్యాన్?
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' చిత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విడుదలయ్యే అవకాశం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. గురువారం ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలవ్వగా... కాంగ్రెస్ పార్టీకి చెందిన వారి నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ చిత్రంలో మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రి కావడానికి దారితీసిన పరిణామాలు, పదవి చేపట్టిన తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గుప్పిట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి, ప్రధాన మంత్రి పదవికి మధ్య ఆయన ఎలా నలిగిపోయారు అనేది చూపించబోతున్నారు.
ట్రైలర్ విడుదలైన అనంతరం కాంగ్రెస్ ప్రతినిధి సుర్జేవాలా మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ మీద తప్పుడు ప్రచారం చేయడానికే ఈ చిత్రాన్ని తీసినట్లు ఉందని మండి పడ్డారు. మరికొందరు కాంగ్రెస్ నాయకులు సైతం ఈ చిత్రంపై ఆగ్రహంగా ఉన్నారు. చూస్తుంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఈ చిత్రం విడుదలవ్వడం కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

2004 నుండి 2008 మధ్యకాలంలో మన్మోహన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా పని చేసిన సంజయ్ బారు రాసిన వివాదాస్పద బుక్... 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్: ది మేకింగ్ అండ్ అన్ మేకింగ్ ఆఫ్ మన్మోహన్ సింగ్' ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.
విజయ్ రత్నాకర్ దర్శకత్వం వహించిన మూవీలో మన్మోహన్ సింగ్ పాత్రలో అనుపమ్ ఖేర్, సోనియా గాంధీ పాత్రలో సుసాన్నే బెర్నెట్, ప్రియాంక గాంధీ పాత్రలో అహనా కుమ్రా, రాహుల్ గాంధీ పాత్రలో అర్జున్ మాథుర్ నటించారు. సునీల్ బోహ్రా, జయంతిలాల్ గదా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2019 జనవరి 11న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











