హీరోల తీరు అలా ఉంటుంది.. షారుక్ ఖాన్పై స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్
చిత్ర పరిశ్రమ ఎవరి సొత్తు కాదని పైకి చాలా మంది చెబుతున్నా.. కొందరి చేతుల్లో ఇండస్ట్రీ బందీగా మారిందని సినీజనాలు సన్నిహితుల వద్ద ప్రస్తావిస్తుంటారు. టాలీవుడ్ , బాలీవుడ్, కోలీవుడ్, మల్లూవుడ్, శాండల్వుడ్.. ఇలా ఏ ఇండస్ట్రీని తీసుకున్నా హీరోలదే రాజ్యం. కథానాయకుడు చెప్పినట్లు నిర్మాతైనా, దర్శకుడైనా నడుచుకోవాల్సిందే. ఆయనకు కోపమొస్తే పరిశ్రమలో పుట్టగతులు లేకుండా చేస్తాడని వారి భయం. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు హీరోల డామినేషన్ను ఎదిరించి నిలిచినవారిని వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు.
కెమెరా ముందు, వెనుక.. సినిమా మొత్తం తిరిగేది హీరో చూట్టూనే. హీరోయిన్, విలన్, ఇతర పాత్రలు కేవలం కథానాయకుడి వెనుక నిలబడటానికే. హీరోయిన్గా ఎవరుండాలి, సినిమాటోగ్రాఫర్గా ఎవరిని తీసుకుంటున్నారు.. కథ, కథనం, మాటలు, పాటలు చివరికి దర్శకత్వంలోనూ హీరోలు వేలు పెడుతున్నారనే కామెంట్స్ జోరుగా వినిపిస్తున్నాయి. అందరూ కాకపోయినా కొందరు స్టార్స్ది ఇదే మనస్తత్వమని ఫిలింనగర్లో గుసగుసలు వినిపిస్తుంటాయి. హీరోల మితిమీరిన జోక్యం వల్ల సినిమాలు దెబ్బయిపోయిన సందర్భాలు కోకొల్లలు. దీనికి తోడు నెపోటిజం అనే మహమ్మారి ఇండస్ట్రీలో జడలు విప్పుకుని కరాళ నృత్యం చేస్తోంది. దీనికి సుశాంత్ సింగ్ రాజ్పుత్ వంటి అప్కమింగ్ హీరోలు బలయ్యారు.. ఇంకా బలవుతూనే ఉన్నారు.

ఇదిలాఉండగా.. కపూర్లు, చోప్రాలు, మల్హోత్రాలు శాసించిన బాలీవుడ్ను మూడు దశాబ్ధాలుగా రూల్ చేస్తోంది ఖాన్ త్రయం అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్. కొత్త కుర్రాళ్లు ఎంతమంది వచ్చినా వీరి ముందు బలాదూరే. 60కి చేరువవుతున్నా వీరు ముగ్గురు నేటికీ బ్లాక్బస్టర్స్ కొడుతూనే ఉన్నారు. వీరిలో షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్, కింగ్ రొమాన్స్ ఇలా పలు పేర్లతో ఆయనను అభిమానులు ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు.
వరుస బ్లాక్బస్టర్స్తో బాలీవుడ్కి, భారతీయ చిత్ర పరిశ్రమకు ఐకాన్గా మారారు షారుఖ్ ఖాన్. కరోనాతో పాటు సౌత్ సినిమాల ధాటికి బాలీవుడ్ డౌన్ఫాల్ స్టార్టయ్యింది. ఇక రేపో మాపో బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు సౌత్ బాట పట్టకతప్పదని విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. జవాన్, పఠాన్ వంటి మూవీస్తో హిందీ ఇండస్ట్రీని నిలబెట్టి పరువు కాపాడారు షారుఖ్ ఖాన్. 60కి దగ్గరవుతున్నా నేటికీ అదే ఎనర్జీతో కుర్ర హీరోలకే పోటీనిస్తున్నారు కింగ్ ఖాన్.
కెరీర్లో ఎంతో మంది అందగత్తెలతో షారుఖ్ ఖాన్ రొమాన్స్ చేశారు. వీరిలో మనీషా కొయిరాల ఒకరు. గుడ్డూ, దిల్ సే సినిమాల్లో కలిసి నటించిన ఈ జంట ఆన్స్క్రీన్ కెమెస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా 1998లో వచ్చిన దిల్ సే వీరిద్దరికి మంచి పేరు తీసుకొచ్చింది. టెర్రరిజం నేపథ్యంలో సాగే ప్రేమకథగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రీతి జింటా కూడా ప్రధాన పాత్రలో నటించారు.

కానీ ఎందుకో తెలియదు కానీ దిల్ సే తర్వాత మనీషా - షారుఖ్లు కలిసి నటించలేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మనీషా కొయిరాలను ఇదే ప్రశ్న అడగ్గా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో తాము హీరోయిన్తో పనిచేయాలనేది హీరోలే నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. బాలీవుడ్లో హీరోల ఆధిపత్యం మరోసారి చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











