సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఫ్రెండ్ జానీ అరెస్ట్... సుశాంత్ కేసులో కీలక వివరాలు వెల్లడయ్యే అవకాశం?
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ చనిపోయి ఏడాది పైగా గడుస్తున్నా ఆయన ఆత్మహత్య చేసుకున్నారా లేక ఎవరైనా హత్య చేశారా అనేది ఇప్పటికీ వీడని మిస్టరీగానే మిగిలింది. ఈ రహస్యాన్ని ఛేదించడానికి ఐదు ఇన్వెస్టిగేషన్ సంస్థలు రంగంలోకి దిగినా సరే ఇంతవరకు ఆ విషయంలో సక్సెస్ సాధించలేదు. అయితే ఆయన మరణం తర్వాత వచ్చిన డ్రగ్స్ కేసులో చాలా అరెస్టులు జరిగాయి. తాజాగా ఈ కేసులో మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు ఎన్సీబీ అధికారులు. ఆ వివరాల్లోకి వెళితే

ఐదు సంస్థలు రంగంలోకి దిగినా
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ 2020 జూన్ 14న తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. నిజానికి మొదట్లో ఇది ఆత్మహత్య అని పోలీసులు వెల్లడించినా రోజులు గడుస్తున్న కొద్దీ ఈ కేసులో అనేక మలుపులు తిరిగింది. ముంబై పోలీస్, బీహార్ పోలీస్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), ఎంఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) ఇలా అనేక సంస్థలు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి.

కునాల్ జానీ అరెస్టు
అయితే సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కేసులో అనుమానాలున్న హోటల్ వ్యాపారి కునాల్ జానీ అరెస్ట్ అయ్యారు. కునాల్ జానీ సుశాంత్ సింగ్ రాజ్పుత్కు అత్యంత సన్నిహితుడు ఆయన చాలా కాలంగా పరారీలో ఉన్నాడు. కానీ NCB ముంబైలోని ఖార్ ప్రాంతానికి చెందిన కునాల్ జానీని అరెస్టు చేసింది. ఈ విషయాన్ని జాతీయ వార్తా సంస్థ ANI ఒక ట్వీట్ ద్వారా దీనిని ధృవీకరించింది.

రియా చక్రవర్తి అరెస్ట్
కునాల్ జానీ సుశాంత్కు సన్నిహితుడు కాబట్టి, అతని అరెస్ట్ తరువాత కొన్ని కొత్త ఆవిష్కరణలతో పాటు, సుశాంత్ మరణం గురించి కూడా కొన్ని కొత్త విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉందని అంటున్నారు. సుశాంత్ మరణించినప్పటి నుంచి కునాల్ జానీ పరారీలో ఉన్నట్లు తెలిసింది. నిజానికి సుశాంత్ మరణం అనంతరం జరిగిన విచారణలో డ్రగ్స్ కోణం తెరపైకి వచ్చినప్పుడు, గందరగోళం జరిగింది. NCB సుశాంత్ కేసులో ఆయనకు డ్రగ్స్ అలవాటు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని ప్రశ్నించింది ఆ తర్వాత ఆమె అరెస్ట్ చేయబడింది.

పాట్నాలో ఎఫ్ఐఆర్
అయితే, కొన్ని రోజుల తర్వాత ఆమె బెయిల్పై జైలు నుంచి విడుదలయ్యారు. సుశాంత్కి సంబంధించిన డ్రగ్స్ కేసులో దీపికా పదుకొనె నుండి సారా అలీ ఖాన్ మరియు రకుల్ ప్రీత్ సింగ్ వరకు అనేక మంది ప్రముఖులను ఎన్సిబి ప్రశ్నించింది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ యొక్క గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చేసాయి దర్యాప్తు సంస్థలు. సుశాంత్ మరణం తర్వాత, రియా చక్రవర్తి వలన ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపిస్తూ అతని తండ్రి పాట్నాలో ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేశారు.
Recommended Video

కీలక విషయాలు బయటకు
ఇక కొన్ని నెలల క్రితం, ఎన్సిబి ఈ కేసులో సిద్ధార్థ్ పితానిని కూడా అరెస్టు చేసింది. సుశాంత్ మరణం తరువాత, అతని జీవితానికి సంబంధించిన చాలా మంది వ్యక్తుల పేర్లు మీడియాలో వచ్చాయి, అందులో పితాని పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. నివేదికల ప్రకారం, సుశాంత్ మృతదేహాన్ని ఇంటి లోపల ఫ్యాన్కు వేలాడుతూ ఉండడాన్ని మొదట చూసిన సిద్ధార్థ్, ఆ తర్వాత అతను పోలీసులకు మరియు ఆసుపత్రికి ఫోన్ చేశాడు. సిద్ధార్థ్ పితాని అరెస్ట్ అయినప్పటి నుండి జైలులో ఉన్నాడు. కొన్ని వారాల క్రితం, అతను తన బెయిల్ కోసం కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు కానీ అది తిరస్కరించబడింది. ఇక కునాల్ అరెస్ట్ తో ఈ కేసులో కొన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











