Priyanka Chopra- Nick Jonas: ఆ మూడు నెలలు నరకం.. ప్రియాంక భర్త కంటతడి..
Priyanka Chopra- Nick Jonas: సార్ట్ కపుల్ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా- హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్ ప్రియాంక ప్రస్తుతం వారణాసి షూటింగ్ లో బిజీగా ఉంది. జోనస్ కూడా పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. అయితే.. వీరి జీవితంలో వెలుగులు ఎంత ఉన్నాయో... అంతకంటే పెద్ద పోరాటం కూడా ఉంది. తాజాగా నిక్ తమ కూతురు మాల్తీ మేరీ చోప్రా జోనస్ ( Malti Marie Chopra Jonas) పుట్టినప్పుడు ఎదురైన భయానక క్షణాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. చిన్నారి కోసం మూడున్నర నెలలపాటు సాగిన పోరాటం ఇప్పుడు నెట్టింట హృదయాలను తాకుతోంది. ఇంతకీ ఏమైందంటే?
ప్రముఖ పోడ్కాస్ట్ హోస్ట్ జై శెట్టి (Jay Shetty)నిర్వహించిన ఇంటర్వ్యూలో నిక్ జోనస్ పాల్గొన్నారు. ఈ సమయంలో నిక్ తన ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ లో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ తరుణంలో మాల్తీ పుట్టిన తొలి రోజుల గురించి తెలిపారు. నిక్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మాల్తీ ప్రీ-మెచ్యూర్గా జన్మించింది. పుట్టినప్పుడు ఆమె బరువు కేవలం 1 పౌండ్ 11 ఔన్స్ ( 765 గ్రాములు) మాత్రమే. 'ఆ క్షణంలో ఆమె శరీరం పర్పుల్ రంగులోకి మారిపోయింది. అది ఇప్పటికీ నా కళ్ల ముందు నిలిచిపోయిన దృశ్యం' అంటూ నిక్ చెప్పిన మాటలు వినేవారిని కదిలించాయి.

వాస్తవానికి మాల్తీ ఏప్రిల్లో పుట్టాల్సి ఉండగా, ముందుగానే డెలివరీ అవుతుందని కాల్ రావడంతో తాము హాస్పిటల్కు పరుగులు తీశామని నిక్ గుర్తు చేసుకున్నారు. అప్పటికి కరోనా మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయం కావడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారిందని చెప్పారు. మాల్తీ దాదాపు మూడున్నర నెలల పాటు ఐసీయూలో చికిత్స పొందిందని నిక్ వెల్లడించారు. ఈ సమయంలో ఆమెకు ఆరు సార్లు రక్తమార్పిడి (Blood Transfusions) చేయాల్సి వచ్చిందట. 'ప్రతిరోజూ ఆమె ప్రాణాల కోసం పోరాడింది. క్రమంగా బరువు పెరిగింది. ఆరు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ల తర్వాత పరిస్థితి మెరుగుపడింది. అప్పుడు మాత్రమే మేము ఆమెను ఇంటికి తీసుకురాగలిగాం' అంటూ నిక్ భావోద్వేగంగా చెప్పారు.
కరోనా కాలం కావడంతో, నిక్-ప్రియాంక ఇద్దరూ షిఫ్టుల వారీగా రోజుకు 12 గంటల చొప్పున ఆసుపత్రిలోనే ఉంటూ బిడ్డను చూసుకున్నారట. 'ఆ హాస్పిటల్ వాసన ఇప్పటికీ నాకు గుర్తుంది. అక్కడ ఉండటం ఒకవైపు ధైర్యం ఇచ్చేది. మరోవైపు భయంగా కూడా ఉండేది. మాల్తీతో పాటు అక్కడున్న ఇతర పిల్లలు, వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న బాధలు చూసి మనసు కలిచిపోయేది' అని నిక్ చెప్పారు. తన కుమార్తెను 'రియల్ ఫైటర్' గా అభివర్ణించిన నిక్, ఇప్పుడు మాల్తీ ఆరోగ్యంగా ఉండటం చూసి ఆశ్చర్యపోతున్నానన్నారు. 'ఈ అనుభవం నన్ను పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు ఆమె ఇంట్లో ఆనందాన్ని నింపుతోంది. ఆ కష్ట సమయంలో మాకు అండగా నిలిచిన డాక్టర్లు, నర్సులు, హాస్పిటల్ సిబ్బందికి జీవితాంతం రుణపడి ఉంటాం' అంటూ కృతజ్ఞతలు తెలిపారు.
ప్రియాంక చోప్రా - నిక్ జోనస్ 2018లో రాజస్థాన్లో సంప్రదాయ హిందూ, క్రిస్టియన్ పద్ధతుల్లో వివాహం చేసుకున్నారు. నాలుగేళ్ల తర్వాత, 2022లో సరోగసీ ద్వారా మాల్తీకి తల్లిదండ్రులయ్యారు. అప్పటి నుంచి మాల్తీ వారి జీవితం మార్పు వచ్చినట్టు తెలిపారు. ఇక ప్రియాంక వర్క్ ఫ్రంట్ చూస్తే.. ప్రస్తుతం ప్రియాంక 'వారణాసి' షూటింగ్లో బిజీగా ఉండగా, నిక్ త్వరలో పవర్ బాల్లాడ్ (Power Ballad) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా, కెరీర్ పరంగా ఇద్దరూ ఫుల్ స్పీడ్లో కొనసాగుతున్నారు.


Click it and Unblock the Notifications











