‘లక్ష్మీ బాంబ్’ వివాదం: రాఘవ లారెన్స్ను బుజ్జగించేందుకు చెన్నైకి నిర్మాతలు!
తెలుగు, తమిళంలో సూపర్ హిట్ అయిన 'కాంచన' ఫ్రాంచైజీ చిత్రాలను హిందీలో రీమేక్ చేసేందుకు రాఘవ లారెన్స్ ప్రయత్నాలు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. 'కాంచన' చిత్రాన్ని 'లక్ష్మీ బాంబ్' పేరుతో రీమేక్ చేస్తూ అక్షయ్ కుమార్ హీరోగా సినిమా కూడా ప్రారంభం అయింది. ఈ చిత్రం ద్వారా రాఘవ లారెన్స్ దర్శకుడిగా బాలీవుడ్లో అడుగు పెడుతున్నారు.
అయితే వారం రోజుల క్రితం జరిగిన ఓ వివాదం కారణంగా లారెన్స్ ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తనకు చెప్పకుండా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయడాన్ని అవమానంగా ఫీలైన అతడు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అవమానం జరిగిన చోట తాను ఉండలేనని, అయితే సినిమా ఆపే ఉద్దేశ్యం లేదు, నా కథ ఇస్తాను, వేరే దర్శకుడితో తీసుకోవచ్చు అంటూ ట్విట్టర్ ద్వారా స్టేట్మెంట్ ఇచ్చారు.
తాజాగా లారెన్స్ ట్విట్టర్లో మరో ప్రకటన చేశారు. ''హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్... అక్షయ్ కుమార్ హీరోగా నేను దర్శకత్వం వహిస్తున్న హిందీ సినిమా 'లక్ష్మీ బాంబ్' నుంచి బయటకు వస్తున్నట్లు కొన్నిరోజుల క్రితం నేను ప్రకటించాను. నేను ఈ ట్వీట్ చేసిన తర్వాత అక్షయ్ కుమార్ సర్ ఫ్యాన్స్, నా ఫ్యాన్స్ ఈ సినిమా చేయాలని నన్న రిక్వెస్ట్ చేయడం మొదలు పెట్టారు. నాపై వారు ప్రేమ చూపించడం చూసి పులకించిపోయాను. సినిమా నుంచి బయటకు వచ్చినందుకు మీ లాగా నేను కూడా గత వారం రోజుల నుంచి అసంతృప్తిగా ఉన్నాను.'' అని ట్వీట్ చేశారు.
ఈ సినిమా మొదలు పెట్టే సమయంలో ఎంతో థ్రిల్ అయ్యాను, దర్శకుడిగా ఇది నా తొలి హిందీ సినిమా. అందులో అక్షయ్ కుమార్ లాంటి స్టార్ నటిస్తుండటంతో చాలా సంతోషించాను. ప్రీ ప్రొడక్షన్ కోసం ఎంతో విలువైన సమయం కేటాయించాను. ఈ సినిమా కోసం నా డేట్స్ బ్లాక్ చేసి చాలా అవకాశాలు వదులుకున్నట్లు లారెన్స్ గుర్తు చేసుకున్నారు.

నన్ను కలిసేందుకు నిర్మాతలు చెన్నై వస్తున్నారు. ఇపుడు అంతా వారి చేతుల్లోనే ఉంది. నేను చేస్తున్న పనికి, నాకు సరైన రెస్పెక్ట్ ఇస్తే... నేను మళ్లీ ఈ సినిమా చేయడంపై ఆలోచిస్తాను. వారితో మీటింగ్ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఈ విషయాన్ని నా అభిమానులతో పంచుకోవాలనిపించిందని తెలిపారు.


Click it and Unblock the Notifications











