King of Comedy Raju Srivastava no more ప్రధాని మోదీతో అనుబంధం..దావూద్ ఇబ్రహీం బెదిరింపులు.. ఎంపీగా..!
మిమిక్రీ టాలెంట్తోపాటు నటనపరంగా బుల్లితెర, వెండితెరపై అద్బుతంగా రాణించి.. ప్రేక్షకుల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించిన రాజు శ్రీవాస్తవ ఇకలేరు. ఆగస్టు 9వ తేదీన గుండెపోటుకు గురైన ఆయనను ఢిల్లీలోని ప్రముఖ హాస్పిటల్ ఎయిమ్స్లో చేర్పించారు. అప్పటి నుంచి ఆయనకు అక్కడే వెంటిలేటర్పై చికిత్సను అందిస్తున్నారు.
అయితే ఆయన ఇటీవల కోలుకొంటున్నట్టు ఆయన కుటంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు మీడియాకు వెల్లడించారు. అయితే మంగళవారం రాత్రి ఆయన ఆరోగ్యం విషమించడంతో బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచి అభిమానులను, సన్నిహితులను శోక సంద్రంలో ముంచారు. ఆయన వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాల్లోకి వెళితే..

మైనే ప్యార్ కియా సినిమాతో
ప్రముఖ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ హోస్ట్గా కొనసాగిన ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ షోతో స్టాండప్ కమెడియన్గా హాస్య ప్రపంచానికి పరిచయం అయ్యారు. ఆ తర్వాత అనతికాలంలోనే కింగ్ ఆఫ్ కామెడీగా వినోద పరిశ్రమలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకొన్నారు.
ఆ తర్వాత బాలీవుడ్లో అడుగుపెట్టి నటుడిగా ఆకట్టుకొన్నారు. ప్రఖ్యాత సినీ నిర్మాణ సంస్థ రాజశ్రీ బ్యానర్లో సల్మాన్ ఖాన్ నటించిన మైనే ప్యార్ కియా సినిమాతో బాలీవుడ్లో కెరీర్ ఆరంభించారు.

హర్బజన్, షోయబ్ అఖ్తర్తో కలిసి
టెలివిజన్ రంగంలో నాచ్ బలియే సీజన్ 6, కామెడీ నైట్స్ కపిల్, మజాక్ మజాక్ మే, అలాగే హర్బజన్ సింగ్, షోయబ్ అఖ్తర్ జడ్జీలుగా వ్యవహరించిన లైఫ్ ఓకే అనే స్టాండప్ కామెడీ షోలతో తన ప్రతిభను చాటుకొన్నారు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ హోస్ట్గా వ్యవహరించిన బిగ్బాస్ 3లో పాల్గొన్నారు.

విభిన్నమైన హాస్యంతో
రాజు శ్రీవాస్తవది విభిన్నమైన హాస్యశైలి. ప్రముఖులను అనుకరిస్తూ వారిపై సెటైర్లు వేయడంలో ఆయనకు ఆయనే సాటి. తాగుబోతులను అనుకరించడం, విభిన్నమైన వ్యక్తుల హావభావాలు ప్రదర్శించడంలో నేర్పరి. ఓ దశలో మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంపై సెటైర్లు వేయడంతో ఆయన ముఠా నుంచి చంపేస్తామని బెదిరింపు రావడం గమనార్హం.

కాన్పూర్ నుంచి లోక్సభకు పోటీ చేసి..
వినోద పరిశ్రమలో రాణిస్తూనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2014లో సమాజ్ వాదీ పార్టీ తరఫున కాన్పూర్ నుంచి లోక్సభకు ప్రాతినిథ్యం వహించారు. అయితే స్థానికుల నుంచి మద్దతు లభించకపోవడంతో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత నరేంద్రమోదీ పిలుపు మేరకు 2014లోనే ఆయన బీజేపీలో చేరారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి రాజు శ్రీవాస్తవను ప్రధాని మోదీ నామినేట్ చేయడం గమనార్హం.

రాజు శ్రీవాస్తవ వ్యక్తిగత జీవితం గురించి
రాజు శ్రీవాస్తవ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. 1963లో కాన్పూరులో జన్మించారు. ఆయన వయసు 58 సంవత్సరాలు. 1993లో శిఖా శ్రీవాస్తవను వివాహం చేసుకొన్నారు. వీరికి అంతారా, ఆయుష్మాన్ అనే ఇద్దరు సంతానం ఉన్నారు. వారి కుటుంబ జీవితం సవ్యంగా సాగుతున్న సమయంలో ఆయన గుండెపోటుకు గురై మరణించడం విషాదంగా మారింది.


Click it and Unblock the Notifications











