Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్పై కత్తిపోట్ల దాడిలో ట్విస్ట్.. 30 వేల చుట్టూనే స్టోరీ అంతా!
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడిన దండుగుడు ఆయనపై కత్తితో దాడి చేసిన ఘటన భారతీయ చిత్ర పరిశ్రమను ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనలో ఆయన చావు అంచుల దాకా వెళ్లొచ్చారు. సమయానికి పెద్ద కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ చాకచక్యంగా వ్యవహరించడం, వైద్యుల శ్రమ కారణంగా సైఫ్ అలీఖాన్కు ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వివరాల్లోకి వెళితే..
ఈ ఏడాది జనవరి 16వ తేదీన ముంబైలోని సైఫ్ నివాసంలోకి దుండగుడు చొరబడి లోపలి వరకు వెళ్లిపోయాడు. ఏదో అలికిడి అయిన శబ్ధం వినిపించడంతో సైఫ్ చిన్న కొడుకు బాగోగులు చూసుకునే కేర్ టేకర్ గమనించి కేకలు వేసింది. ఈ గొడవతో నిద్రలోంచి ఉలికిపడి లేచిన సైఫ్ అలీఖాన్ దుండగుడిని పట్టుకునేందుకు యత్నించాడు. దాంతో భయపడిన అగంతకుడు వారి నుంచి తప్పించుకునేందుకు గాను కత్తితో సైఫ్పై దాడి చేశాడు. ఈ ఘటనలో సైఫ్ తీవ్రంగా గాయపడటంతో పాటు రక్తస్రావమైంది.

వెంటనే స్పందించిన సైఫ్ పెద్ద కొడుకు ఇబ్రహీం .. మాత్రం ఆలస్యం చేయకుండా తండ్రిని ఒక ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అతని చాకచక్యం కారణంగా సైఫ్ ప్రాణాలతో బయటపడ్డారు. సైఫ్పై దాడితో బాలీవుడ్ ఉలిక్కిపడగా.. ముంబై పోలీసులు, క్రైం బ్రాంచ్తో పాటు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ రంగంలోకి దిగారు. సైఫ్ ఇంటిని పరిశీలించి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గంటల వ్యవధిలో అరెస్ట్ చేశారు. అతనిని బంగ్లాదేశ్కు చెందిన మహ్మద్ షరీపుల్ ఇస్లాం షెహజాద్గా గుర్తించారు. ఇతను అక్రమంగా సరిహద్దులు దాటి భారత్లోకి ప్రవేశించాడు.
ఈ కేసుకు సంబంధించి ముంబై పోలీసులు న్యాయస్థానంలో దాఖలు చేసిన దాదాపు 1600 పేజీల ఛార్జ్షీట్లో కీలక విషయాలు ప్రస్తావించారు. సైఫ్ అలీఖాన్ నివాసంలో క్లూస్ టీమ్ సేకరించిన ఫింగర్ ప్రింట్స్లో నిందితుడి ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ కాలేదు. దాదాపు 20 సెట్ల ఫింగర్ ప్రింట్స్ను ముంబై పోలీసులు .. సీఐడీకి పంపగా, అనాలిసిస్లో అవి నెగిటివ్ వచ్చినట్లుగా తెలిపారు. అంతేకాదు నిందితుడి అసలు లక్ష్యం డబ్బును దోచుకోవడమేనని ఛార్జ్షీట్లో వెల్లడించారు.
షెహజాద్ బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి చొరబడి కొన్నాళ్లు కోల్కతాలో ఉన్నాడు. అక్కడి నుంచి ముంబై చేరుకుని స్థానిక హోటల్లో పనిచేశాడు. ఫారిన్లో సెటిలవ్వాలని అనుకున్న నిందితుడు ఇందుకోసం భారత పౌరుడిగా నమ్మించే ధ్రువీకరణ పత్రాల కోసం ఓ ఏజెంట్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందుకోసం రూ.30 వేలు ఖర్చు అవుతుందని సదరు ఏజెంట్ చెప్పడంతో ఆ డబ్బు కోసం దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు.
జనవరి 15న సెలవు పెట్టి సైఫ్ అలీఖాన్ నివాసంలోకి చొరబడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈలోపు కేర్ టేకర్ గమనించడం, సైఫ్ అలీఖాన్ అతనిని ప్రతఘటించడం, నిందితుడు కత్తితో దాడి చేయడం జరిగింది. ఆ తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు షెహజాద్ను అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ కాకపోవడంతో ముంబై పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చర్చనీయాంశంగా మారింది.


Click it and Unblock the Notifications











