బీఎంసీపై షారుఖ్ ప్రశంసలు.. భాగస్వామ్యంతో ఎంతో ఆనందం.. కింగ్ ఖాన్ కామెంట్స్
ప్రపంచమంతటా కరోనా విజృంభిస్తోంది. కరోనా వైరస్ ధాటికి అగ్రరాజ్యమే కుదేలైంది. లక్షల సంఖ్యలో కరోనా బారిన పడుతుండటంతో ఏం చేయాలో తెలీక తల పట్టుకుంది అమెరికా. మన దేశంలోనూ కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే దాదాపు నాలుగే వేల మందికి కరోనా సోకినట్టు తెలుస్తోంది. అయితే కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వాలు అహర్నిశలు శ్రమిస్తున్నాయి. ప్రభుత్వానికి అండగా నిలబడేందుకు సినీ తారలు ముందుకు వస్తున్నారు.

కదిలిన బాలీవుడ్..
మన దేశంలో కరోనా తాండవం చేస్తున్న ప్రారంభంలో టాలీవుడ్ చిత్ర సీమ మాత్రమే ముందడుగు వేసింది. ప్రభుత్వాలకు ఆర్థిక సాయాన్ని ప్రకటించడం ప్రారంభించింది. ఆపై ప్రధాని మోడీ పిలుపు మేరకు పీఎం కేర్స్కు బాలీవుడ్ హీరోలు విరాళాలు ప్రకటించడం ప్రారంభించారు. ఈ మేరకు మొదటగా అక్షయ్ కుమార్ రూ. 25కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

రంగంలోకి దిగిన స్టార్స్..
ప్రధాని ఇచ్చిన పిలుపుకు స్పందించిన బాలీవుడ్ హీరోలు కదిలారు. అందులో భాగంగా సల్మాన్ ఖాన్ సినీ పరిశ్రమలో కార్మికులకు నేరుగా డబ్బులు పంపిస్తానని తెలిపాడు. వారందరికీ నిత్యావసర సరుకులు ఇస్తానని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తన దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నాడు.
అనేక సేవలు అందిస్తూ..
కరోనా లాంటి కష్టకాలంలో ఆదుకునేందుకు షారుఖ్ ఖాన్ ముందుకు వచ్చాడు. తన ఆధ్వర్యంలో ఉన్న రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్, మీర్ ఫౌండేషన్, రెడ్ చిల్లీస్ వీఎఫ్ఎక్స్ సంస్థలతో పాటు కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ తరుపున పలు సహాయక కార్యక్రమాలు చేయనున్నట్టు వెల్లడించారు.

భాగస్వామ్యం అయినందుకు ఎంతో ఆనందం..
ముంబైలో ఉన్న తన సొంత కార్యాలయాన్ని క్వారంటైన్ కేంద్రంగా వాడుకోవడానికి ఇచ్చేశాడు. ఈ మేరకు ముంబయ్ మున్సిపల్ అధికారులు(బీఎంసీ) షారుఖ్కు ధన్యవాదాలు తెలిపారు. దీనికి స్పందించిన షారుఖ్.. కరోనాను ఎదుర్కొనేందుకు మీరు చేస్తున్న సేవలతో అది మన బీఎంసీ అని ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నామని అధికారులను ప్రశంసించాడు. మీరు చేస్తున్న ఈ సేవలో తాము కూడా పాలు పంచుకోవడం ఆనందంగా ఉందని మన ముంబై మన బీఎంసీ అంటూ ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











