జెర్సీ షూటింగ్ పూర్తి.. ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పిన షాహిద్
తెలుగు సినిమాలు, కథలను దేశ మొత్తం గమనిస్తోంది. తెలుగు కథలు బాలీవుడ్లో రాణించడం కొత్తేమీ కాదు. ఇక్కడి కథలు అక్కడికి వెళ్లి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామినీ సృష్టిస్తోంది. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి వారు తెలుగు సినిమా కథలపై మోజు ఎక్కువగా పెంచుకున్నారు. మరీ ముఖ్యంగా సల్మాన్ కెరీర్లో టాలీవుడ్ కథలు ముఖ్య పాత్రను పోషించాయి. ఇలా మన తెలుగు సినిమాల రీమేక్లతో అక్కడ బ్లాక్ బస్టర్ హిట్లు సొంతం చేసుకున్నారు.
కానీ ఇప్పుడు మాత్రం ట్రెండ్ మారింది. ఒకప్పుడు కథలు మాత్రమే అక్కడికి వెళ్లేవి. కానీ ఇప్పుడు కథలతో పాటు దర్శకులు కూడా అక్కడికి వెళ్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమాను అక్కడ కబీర్ సింగ్గా సందీప్ వంగా తెరకెక్కించి బాలీవుడ్ను షేక్ చేశాడు. ఇక జెర్సీ సినిమాను అదే పేరుతో గౌతమ్ తిన్ననూరి హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ఈ రెండింటిలోనూ షాహిద్ కపూరే హీరో. తాజాగా షాహిద్ కపూర్ ఈ మూవీ షూటింగ్ పూర్తైందని ప్రకటించాడు.

ఆ మధ్య షాహిద్ ముక్కుకు గాయం కావడం షూటింగ్ మధ్యలో ఆపడం, ఆ తరువాత కరోనా రావడం మళ్లీ షూటింగ్ క్యాన్సిల్ అవ్వడం వంటివి జరిగాయి. ఈ మధ్యే ఉత్తరాఖండ్లో షూటింగ్ ప్రారంభించి పూర్తి చేశారట. ఈ మేరకు సహకరించిన ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి షాహిద్ థ్యాంక్స్ చెప్పాడు. మొత్తానికి హిందీలో 83, జెర్సీ అనే రెండు చిత్రాలు అవి కూడా క్రికెట్ నేపథ్యంలో ఉన్నవే రాబోతోన్నాయి. కానీ ఈ రెండు కథల నేపథ్యం క్రికెట్ అయినా కథనం మాత్రం వేరు. తాను 83 చిత్రం కోసం ఎదురుచూస్తున్నానని షాహిద్ ఆ మధ్య ఇంటర్వ్యూలో తెలిపాడు.


Click it and Unblock the Notifications











