గణేష్ చతుర్థి వేడుక వల్ల ఏర్పడిన కాలుష్యంపై సోనాలి బింద్రే ట్వీట్
గణేష్ చతుర్థి చాలా మందికి ఎంతో ఆనందాన్ని కలిగించే పండుగ. అదే సమయంలో ఈ వేడుకలు పర్యావరణానికి ప్రమాదకరమైన మార్గంలో చేసినప్పుడు, పండుగ కూడా హాని కలిగిస్తుంది. ఈ సంవత్సరం గణేష్ నిమజ్జనం సందర్భంగా ముంబైలోని బీచుల్లో ఏర్పడిన కాలుష్యంపై ప్రముఖ నటి సోనాలి బింద్రే ఆందోళన వ్యక్తం చేశారు.
గణేష్ నిమజ్జనం జరిగిన బీచ్లో తీవ్రమైన కాలుష్యం ఏర్పడిన చిత్రాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టారు. "నిన్నటి గణేష్ విసర్జన్ తరువాత ... ఎంతో కాలుష్యం ఏర్పడింది. ఇలా జరుగకుండా మనం ఇంకా బెటర్గా చేయాలి" అని పేర్కొన్నారు.
ఈ ఏడాది గణేష్ చతుర్థి వేడుకల సందర్భంగా చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు తమ అభిమానులను ఎకో ఫ్రెండ్లీగా వేడుక జరుపుకోవాలని, మట్టి వినాయకుడిని ప్రతిష్టించాలనికోరారు. దియా మీర్జా, శిల్పా శెట్టి. ఇతర ప్రముఖులు తమ పర్యావరణ అనుకూలమైన గణేష్ చిత్రాలను షేర్ చేసిన సంగతి తెలిసిందే.
అంతకుముందు, సోనాలి గణేష్ చతుర్థి గురించి ఇలా వ్యాఖ్యానించారు. "గణేష్ చతుర్థి నాకు ఇష్టమైన పండుగలలో ఒకటి, గత సంవత్సరం ఇంట్లో దీన్ని జరుపుకోవడాన్ని నేను నిజంగా కోల్పోయాను" అన్నారు. క్యాన్సర్కు చికిత్స కారణంగా సోనాలి గతేడాది ఇంటికి దూరంగా విదేశాల్లో ఉన్న సంగతి తెలిసిందే.

"ఈ సంవత్సరం ఇంటికి తిరిగి రావడం చాలా ఆనందంగా ఉంది, ఆరోగ్యంగా, నా కుటుంబంతో జరుపుకుంటున్నాను. ఈ విశ్వాసాలను నేను నిజంగా నమ్ముతున్నాను, భక్తి అనేది మన అందరిలో ప్రతిబింభిస్తుంది... మీకు, మీ దేవునికి మధ్య సంభాషణలో .. కాబట్టి దాన్ని కోల్పోకండి.'' అని సోనాలి ట్వీట్ చేశారు.
ఈ సంవత్సరం తన గణేష్ చతుర్థి వేడుకల గురించి మాట్లాడుతూ, "మరోసారి మేము పర్యావరణ అనుకూలమైన గణేశుడిని తీసుకువచ్చే మార్గాన్ని ఎంచుకున్నాం. భగవంతుడిని మా ఇంటిలో నిమజ్జనం చేశాం. ఈసారి గణేష్ చతుర్థి ఆరోగ్యం, ఆనందాన్ని తెస్తుంది ఆశిస్తున్నాను.'' అని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











