వాళ్ల చిరునవ్వు నాకు ముఖ్యం..రూమర్లను ఖండించిన సోనుసూద్
దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల కారణంగా కష్టాల్లో పడిన వలస కార్మికులను ఆదుకొనేందుకు సోను సూద్ ఎంతో శ్రమిస్తున్నారు. ముంబైతోపాటు పలు నగరాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను సొంతంగా డబ్బు వెచ్చించి బస్సులు, విమానాల్లో తమ ఊర్లకు పంపిచండం అందర్నీ ఆకట్టుకొన్నది. సోనూ చేస్తున్న సామాజిక సేవపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వలస కార్మికులను తమ సొంత ఊళ్లకు పంపించే క్రమంలో సోనుసూద్ను అధికారులు బాంద్రాలోని రైల్వే స్టేషన్లోనికి అనుమతించలేదని రూమర్లు మీడియాలో హైలెట్ అయ్యాయి.
అయితే తనపై వచ్చిన రూమర్లపై సోనుసూద్ ట్విట్టర్లో వివరణ ఇస్తూ రైల్వే స్టేషన్లో వలస కార్మికులకు వీడ్కోలు చెప్పడానికి వెళ్లినప్పుడు నన్ను ఎవరూ అడ్డుకోలేదు. నిబంధనలు పాటించడంలో నేను ఎప్పుడూ ముందు ఉంటాను. ప్రభుత్వ మార్గదర్శకాలను ఫాలో అవుతున్నాను. ఫ్యామిలీ మెంబర్స్కు దూరమైన వలస కార్మికులను వారి ఊళ్లకు పంపించేందుకు వెళ్తుంటే వారికి వీడ్కోలు చెప్పివచ్చాను. ఇందులో ఎలాంటి వివాదం లేదు అని సోను సూద్ పేర్కొన్నారు.

వలస కార్మికులను పంపించడానికి ప్రత్యేక రైలు కావాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగగానే స్పందించి ట్రైన్ను ఏర్పాటు చేశారు. అందుకు ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరేకు ధన్యవాదాలు తెలుపుకొంటన్నాను. దాదాపు రెండు వేల మందిని పలు ప్రాంతాల నుంచి వారి సొంత ఊళ్లకు పంపించాను. వారి ముఖాల్లో కనిపించిన చిరునవ్వు నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది అని సోనుసూద్ తెలిపారు.
కార్మికులను తమ సొంత ఊళ్లకు పంపించడానికి వచ్చిన సోనుసూద్ను నిర్మల్ నగర్ రైల్వే స్టేషన్లో ఆపలేదు అని పోలీసులు తెలిపారు. ఈ విషయంపై మాకు ఎలాంటి ఫిర్యాదు గానీ, సమాచారం గానీ మాకు తెలియదు అని అన్నారు.


Click it and Unblock the Notifications











