‘పిఎం నరేంద్రమోడీ’ సినిమా ఆపాలంటూ సుప్రీం కోర్టులో పిటీషన్
'పిఎం నరేంద్ర మోడీ' సినిమా ఎన్నికల వేళ విడుదలవ్వకుండా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ చిత్రాన్ని ఆపాలంటూ ఇటీవల బాంబే హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం(పిల్) దాఖలు కాగా దాన్ని న్యాయస్థానం తోపిపుచ్చిన సంగతి తెలిసిందే.
అయితే బాంబే హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ... సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలైంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సినిమా విడుదలను ఆపివేయాలని, ఈ సినిమా ఎన్నికల్లో ఓటింగుపై ప్రభావం చూపే అవకాశం ఉందని పిటీషనర్ పేర్కొన్నారు. సుప్రీం కోర్టు నేడు ఈ పిటీషన్ విచారణకు స్వీకరించే అవకాశం ఉంది.
కాగా.. 'పిఎం నరేంద్ర మోడీ' చిత్ర నిర్మాతలు ఈ చిత్రాన్ని ఏప్రిల్ 12న విడుదల చేయాలని చాలా రోజుల క్రితమే నిర్ణయించారు. అయితే ఇటీవల మూవీ రిలీజ్ అంతకంటే ముందుగా ఏప్రిల్ 5న రిలీజ్ చేయాలని నిర్ణయించినప్పటికీ పరిస్థితులు అనుకూలించలేదని తెలుస్తోంది. దీంతో మళ్లీ ఏప్రిల్ 12వ తేదీనే రిలీజ్ చేయాలని ఫైనలైజ్ చేశారు.

ఏప్రిల్ 11న లోక్ సభ తొలి విడుత ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో... కావాలనే ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారనే విమర్శలు రావడంతో నిర్మాతలు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. కాగా.. ఎన్నికల సంఘం నుంచి ఈ చిత్రం విడుదలకు గ్రీన్ సిగ్నల్ అభించింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీవితం ఆధారంగా దర్శకుడు ఓమంగ్ కుమార్ ఈ చిత్రం రూపొందించారు. ఆయన బాల్యం నుంచి ప్రధానమంత్రి అయ్యే వరకు జరిగిన ముఖ్య ఘట్టాలను ఈ చిత్రంలో చూపించబోతున్నారు. మోడీ పాత్రలో వివేక్ ఒబెరాయ్ నటిస్తుండగా.. దర్శన్ కుమార్, బోమన్ ఇరానీ, మనోజ్ జోషి, ప్రశాంత్ నారాయణన్, జరీనా వాహెబ్, బర్ఖా బిస్త్ సేన్ గుప్తా, అంజన్ శ్రీవాస్తవ్, యతిన్ కార్యేకర్, రాజేంద్ర గుప్తా, అక్షత్ ఆర్ సలుజా, ముఖ్య పాత్రలు పోషించారు.


Click it and Unblock the Notifications











