శ్రీదేవి హత్య చేయబడిందనే వాదనపై.... బోనీ కపూర్ ఎలా రియాక్ట్ అయ్యారంటే?
కేరళకు చెందిన జైళ్ల శాఖ డిజిపి రిషిరాజ్ సింగ్ కేరళ కౌముది అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీదేవి మరణంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. శ్రీదేవి ప్రమాదవశాత్తు జారి పడిపోవడం వల్ల చనిపోయి ఉండక పోవచ్చని, ఆమె హత్య చేయబడి ఉండొచ్చు అని వ్యాఖ్యానించారు. రిషిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా శ్రీదేవి భర్త, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ స్పందించారు.
ఓ ఆంగ్ల వెబ్ సైట్తో బోనీ కపూర్ మాట్లాడుతూ... 'అలాంటి చెత్త స్టోరీల మీద నేను స్పందించను. స్టుపిడ్ స్టోరీలు తరచూ వస్తూనే ఉంటాయి. వాటిని పట్టించుకోకూడదు. ఇదంతా కొందరు క్రియేట్ చేసే కట్టుకథలు, కల్పనలు మాత్రమే' అని బోనీ కపూర్ స్పష్టం చేశారు.

శ్రీదేవి మరణంపై డీజీపీ ఏమన్నారంటే...
కేరళ కౌముది పత్రికకు రిషి రాజ్ సింగ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘నా స్నేహితుడు, లేట్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ ఉమాదతన్ చాలా రోజుల క్రితం శ్రీదేవి మరణం గురించి ఓ విషయం చెప్పారు. ఆమెది హత్య అయి ఉండొచ్చు, ప్రమాదవశాత్తు సంభవించిన మరణం కాకపోవచ్చు అని తెలిపారు' అని వ్యాఖ్యానించారు.

కాళ్లను గట్టిగా పట్టుకుంటే తప్ప అలా జరుగదు
‘అతిగా మద్యం సేవించి ఉన్నప్పటికీ అడుగు లోతు ఉన్న నీటిలో ఒక వ్యక్తి తల పడిపోయే అవకాశం లేదు. ఎవరైనా వారి కాళ్లు గట్టిగా పట్టుకుని ఉన్నపుడే వారి తల బాత్ టబ్ అడుగు నీటిలో అలా పడి ముగిపోయే అవకాశం ఉంది అని తన స్నేహితుడు అభిప్రాయపడ్డారు' అని డిజిపి రిషిరాజ్ సింగ్ వెల్లడించారు.

పెళ్లి వేడుక కోసం వెళ్లి మరణించిన శ్రీదేవి
గతేడాది ఫిబ్రవరిలో తమ బంధువుల పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లిన శ్రీదేవి... అక్కడి హోటల్ గదిలోని బాత్రూంలో శవమై కనిపించారు. శ్రీదేవి మరణంపై అప్పట్లో అనేక అనుమానాలు తలెత్తాయి. కుట్ర జరిగిందని, హత్య జరిగిందని, ఆత్మహత్య అంటూ రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చారు. శ్రీదేవి డెత్ న్యూస్ దేశం మొత్తాన్ని షాక్కు గురి చేసింది.

ఆమె మరణం వెనక ఎలాంటి కుట్ర లేదని తేల్చిన యూఏఈ అధికారులు
శ్రీదేవి మరణాన్ని అనుమానాస్పదన మరణంగా టేకప్ చేసిన యూఏఈ అధికారులు... విచారణ అనంతరం ఇది ప్రమాదవశాత్తు సంభవించిన మరణంగా తేల్చారు. బాత్ టబ్లో జారి పడిపోవడం వల్లనే ఆమె మరణించిందని తమ రిపోర్టులో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











