సుశాంత్ కేసులో సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం నేడే.. రియా పిటిషన్పై తీర్పు
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కేసుకు సంబంధించి సీబీఐకి దర్యాప్తును అప్పగించాలనే విషయంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పును బుధవారం వెల్లడించనున్నది. సుశాంత్ మరణం, ఆయన బ్యాంకు అకౌంట్లలో అవకతవకలు జరిగాయంటూ ఆయన తండ్రి కేకే సింగ్ పాట్నాలో కేసు నమోదు చేయడం తెలిసిందే. ఆ కేసును సీబీఐకి అప్పగించాలనే డిమాండ్ పెద్ద ఎత్తున రావడం తెలిసిందే. అయితే పాట్నా నుంచి కేసును ముంబైకి బదిలీ చేయాలని, అలాగే సీబీఐ దర్యాప్తు చేపట్టవద్దని సుశాంత్ సింగ్ ప్రియురాలు రియా చక్రవర్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
రియా చక్రవర్తి పిటిషన్పై సుశాంత్ తరఫున, కేంద్ర ప్రభుత్వం, బీహార్, మహారాష్ట్ర సర్కార్ వాదనలు విన్న తర్వాత ఈ కేసుపై నిర్ణయాన్ని సుప్రీంకోర్టు రిజర్వు చేసింది. ఆగస్టు 19వ తేది బుధవారం 11 గంటల ప్రాంతంలో ఉన్నత కోర్టు తన తీర్పును వెల్లడించాల్సి ఉండటంతో ఈ కేసుపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.

సుశాంత్ కేసును సీబీఐకి అప్పగిస్తారా లేదా అనే అంశంపై సినీ ప్రేక్షకులు, సుశాంత్ అభిమానులు, న్యాయ నిపుణులు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ క్రమంలో సుశాంత్ సోదరి శ్వేత సింగ్ కృతి ట్విట్టర్లో ఆసక్తికరమైన భగవద్దీత సూక్తిని ట్వీట్ చేసింది. అంధకారం నుంచి వెలుగులోకి తీసుకెళ్లే ప్రయత్నం అంటూ ట్వీట్లో పేర్కొన్నారు.
జూన్ 14వ తేదీన ముంబైలో బాంద్రాలోని తన నివాసంలో సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. సుశాంత్ మరణం తర్వాత ఫ్యామిలీ సభ్యులు, మీడియా అనేక అనుమానాలను వ్యక్తం చేసింది. దాంతో ముంబై పోలీసుల దర్యాప్తుపై సందేహాలు వ్యక్తమయ్యాయి. ఆ క్రమంలో ఈ కేసును సీబీఐకి అప్పగించాలనే డిమాండ్ లేచింది.


Click it and Unblock the Notifications











