సుశాంత్కు కన్నీటి వీడ్కోలు.. భోరుమన్న శ్రద్దాకపూర్, కృతిసనన్.. భారీవర్షంలో అంత్యక్రియలు
కాయ్ పో చే, ఎంఎస్ ధోని, చిచ్చోరే సినిమాలతో అద్బుతంగా రాణించడమే కాకుండా ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించిన సుశాంత్ సింగ్ రాజ్పుత్కు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు, అభిమానలు కన్నీటి వీడ్కోలు పలికారు. ముంబైలోని విలే పార్లేలోని పవన్ హాన్స్ శ్మశాన వాటికలో అశ్రునయనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆదివారం జూన్ 14వ తేదీన సుశాంత్ బాంద్రాలోని తన నివాసంలో ఉరేసుకొని మరణించిన సంగతి తెలిసిందే. అంత్యక్రియలకు సంబంధించిన వివరాలు..
Recommended Video

సోమవారం మధ్యాహ్నం అంత్యక్రియలు
ఆదివారం అర్ధరాత్రి రెండుగంటలపాటు జరిగిన పోస్టు మార్టమ్ అనంతరం సోమవారం ఉదయమే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అయితే తన సొంత పట్టణం పాట్నాలో అంత్యక్రియలు జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారనే వార్తలను కుటుంబ సభ్యులు ఖండించారు. మధ్యాహ్నం పవన్ హన్స్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.

బాలీవుడ్ తారలు కన్నీటి వీడ్కోలు
సుశాంత్ సింగ్ను చివరి చూపు చూడటానికి, అంతిమ వీడ్కోలు చెప్పడానికి బాలీవుడ్ ప్రముఖులు తరలివచ్చారు. చిచ్చోరేలో తనతో నటించిన శ్రద్ధాకపూర్, రాబ్దాలో నటించిన కృతి సనన్ అంత్యక్రియలకు హాజరయ్యారు. ఇక టెలివిజన్ రంగంలో సక్సెస్ అందించిన నిర్మాత ఏక్తాకపూర్ కూడా పవన్ విల్లేలోని శ్మశాన వాటికకు తరలివచ్చారు. మరణవార్త తెలియగానే నీవు చేసిన పని సరికాదు.. మై బేబీ అంటూ ఏక్తా ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

భోరున వర్షం.. తడుస్తూనే అంత్యక్రియలకు
సుశాంత్ అంత్యక్రియలకు హాజరైన వారిలో క్యాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ చాబ్రా, డైరెక్టర్ దినేష్ విజన్, తాహిర్ బాసిన్, ప్రతీక్ బబ్బర్, అభిషేక్ కపూర్, సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి తదితరులు ఉన్నారు. సుశాంత్ అంత్యక్రియల సమయంలో ముంబైలో భోరున వర్షం కురిసింది. వర్షంలోనే తడుస్తూ సినీ తారలందరూ కన్నీటి వీడ్కోలు తెలిపారు.

శ్మశాన వాటికలో గంభీర వాతావరణం
అంత్యక్రియల సమయంలో శ్మశాన వాటికలో గంభీరమైన వాతావరణం నెలకొన్నది. ఓ పక్క ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ శ్రద్దాకపూర్, కృతిసనన్, ఏక్తా కపూర్, ఉదిత్ నారాయణ్, వివేక్ ఒబెరాయ్ లాంటి వారు ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకొనేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. ఓ దశలో శ్రద్దాకపూర్, కృతి సనన్ తన బాధను ఆపుకోలేక భోరున విలపించినట్టు తెలిసింది.

సుశాంత్ది మర్డర్ అంటూ ఆరోపణల నేపథ్యంలో
సుశాంత్ సింగ్ మరణం సహజమైనది కాదు.. ఆయనది హత్య అంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మరణానికి ముందు సుశాంత్ మానసిక పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రియురాలు రియా చక్రవర్తి, స్నేహితుడు మధు శెట్టిని పోలీసులు విచారించారు. పలు ప్రశ్నలతో వారిని ఉక్కిరిబిక్కిరి చేసినట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











