ప్రముఖ నటుడు కన్నుమూత.. కూతురును చూడటానికి వెళ్లి ఎయిర్పోర్ట్లోనే..
ప్రముఖ బెంగాలీ నటుడు, మాజీ టీఎంసీ ఎంపీ తపస్ పాల్ ఇకలేరు. ముంబైకి వెళ్తూ ఎయిర్పోర్టులోనే మంగళవారం ఉదయం గుండెపోటుతో ఆకస్మిక మరణం చెందారు. ఆయన మృతికి బెంగాల్ సీఎంతోపాటు పలు పరిశ్రమలకు చెందిన ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం ముంబైలొని కూతురు ఇంటికి వెళ్లి కోల్కతాకు తిరిగి వస్తుండగా ఎయిర్పోర్టులో గుండెపోటు వచ్చింది. హుటాహుటిన హాస్పిటల్కు తరలించేటప్పటికే ఆయన మృతి చెందారని వైద్యులు ధృవీకరించారు. తపస్ పాల్ ఉదయం 4 గంటల ప్రాంతంలోమృతి చెందారని వైద్యులు పేర్కొన్నారు.
గత రెండేళ్ల నుంచి తపస్ పాల్ హృదయ సంబంధిత వ్యాధితో కొంతకాలంగా బాధపడుతున్నారు. ఆయన పలుమార్లు చికిత్స కోసం హాస్పిటల్లో చేరారు. ఇప్పడిప్పుడే ఆయన అనారోగ్యం నుంచి కోలుకొంటున్నారు. కానీ ఇంతలోనే దారుణం జరిగిపోయింది అని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. తపస్ పాల్కు భార్య నందిని, కూతురు సోహిని పాల్ ఉన్నారు.

సినీ ప్రముఖులు తరుణ్ మజుందార్ రూపొందించిన దాదర్ కిర్తీ అనే చిత్రంతో బెంగాలీ చిత్ర పరిశ్రమలోకి తపస్ పాల్ ప్రవేశించారు. ఆ తర్వాత సాహెబ్ పరబాత్ ప్రియా, భలోబాస భలోబాస, అనురాగర్ చోయన్, అమర్ బంధన్ చిత్రాల్లో నటించారు. మాధురి దీక్షిత్ నటించిన అబోద్ అనే బాలీవుడ్ చిత్రంలో కూడా నటించారు.
తపస్ పాల్ మృతిపై బెంగాలీ నటులు అరిందమ్ సిల్, రంజిత్ మాలిక్ తదితరులు సంతాపం తెలిపారు. ఆయన లేని లోటు పూడ్చలేనిది అన్నారు.
తపస్ పాల్ మృతిపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. టీఎంసీ పార్టీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొన్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్లో సంతాపం వ్యక్తం చేస్తూ.. తపస్ మృతి వార్త తెలిసి విషాదంలో కూరుకుపోయాను. తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యాను. బెంగాలీ సినిమా రంగంలో ఆయన సూపర్ స్టార్ గానే కాకుండా తృణమూల్ పార్టీ కుటుంబ సభ్యుడిగా ఉన్నారు. రెండుసార్లు ఎంపీగా, ఎమ్మెల్యేగా సేవలందించారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాను అని మమతా సంతాప సందేశంలో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











