దారుణమైన ప్లాప్: మా డబ్బు తిరిగి ఇవ్వాలంటూ డిస్ట్రిబ్యూటర్ల ఆందోళన!
అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ నటించిన 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' సినిమా బాక్సాఫీసు వద్ద దారుణమైన పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఇద్దరు పెద్ద స్టార్స్ నటించిన సినిమా కావడంతో ఆయా ఏరియాల్లో భారీ ధరకు డిస్ట్రిబ్యూటర్ రైట్స్ అమ్మాగా... సినిమాను కొన్నవారంతా ఊహించని స్థాయిలో నష్టాలు చవిచూశారు.
రూ. 300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించామని చెప్పిన యాష్ రాజ్ ఫిలింస్... వరల్డ్ వైడ్ రైట్స్ అంతకు మించిన ధరకు అమ్మారు. అయితే విడుదలైన తొలిరోజే ప్లాప్ టాక్ రావడంతో... రోజు రోజుకూ కలెక్షన్లు డ్రాప్ అవుతూ వచ్చాయి. 11 రోజుల్లో ఈ చిత్రం కేవలం రూ. 150 కోట్ల షేర్ మించిన గ్రాస్ వసూలు చేయలేదు.

50 శాతంపైగా నష్టం
సినిమాను కొనుగోలు చేసిన థియేటర్ ఓనర్స్, డిస్ట్రిబ్యూటర్లు తాము పెట్టిన పెట్టుబడిలో 50శాతం కంటే ఎక్కువే నష్టపోయినట్లు తెలుస్తోంది. అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ స్టార్ ఇమేజ్ మీద వారు పెట్టుకున్న నమ్మకం ఏమాత్రం నిలబడలేదు.

పరిహారం కోసం డిమాండ్
‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' చిత్రాన్ని రూ. 300 కోట్ల బడ్జెట్తో నిర్మించామని చెబుతున్న దాంట్లో కూడా నిజం లేదని కొందరి వాదన. ఇద్దరు స్టార్లను ముందు నిలబెట్టి సినిమాను అధిక ధరకు అమ్మడానికి యశ్ రాజ్ ఫిలింస్ గేమ్ ఆడినట్లు కొందరు ఆరోపిస్తున్నారు. నష్టపోయిన తమకు పరిహారం చెల్లించాలనే డిమాండ్ కొందరు డిస్ట్రిబ్యూటర్ల నుంచి వినిపిస్తోంది.

గతంలో రజనీ, షారుక్, సల్మాన్ డబ్బు తిరిగి ఇచ్చారు
గతంలో రజనీకాంత్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్.... తమను నమ్మి సినిమాను కొనుగోలు చేసి నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లను ఆదుకున్నారు. షారుక్ ఖాన్ జబ్ హ్యారీ మెట్ సెజల్, దిల్వాలే సినిమాలు ప్లాప్ అయినపుడు, సల్మాన్ ఖాన్ ట్యూబ్ లైట్ సినిమా డిజాస్టర్ అయినపుడు, రజనీకాంత్ లింగా సినిమా నష్టపోయినపుడు నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు కొంత డబ్బు తిరిగి ఇచ్చిన సంగతి తెలిసిందే.

ప్లాప్ అవ్వడానికి కారణం ఏమిటి?
‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' ప్లాప్ కారణం ప్రధానంగా కథ, స్క్రిప్టు ఆసక్తికరంగా లేక పోవడమే. రూ. 300 కోట్ల బడ్జెట్ అని చెబుతున్నప్పటికీ ఆ స్థాయిలో విజువల్స్ కూడా లేవనే విమర్శలు సైతం వినిపించాయి. అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్స్ ఉన్న ఈ సినిమా నుంచి ప్రేక్షకులు ఆశించిన స్థాయి వినోదం లభించక పోవడమే ఇందుకు కారణం.


Click it and Unblock the Notifications











