‘ నా సినిమా ఫ్లాప్ వెనుక ... అల్లు అర్జున్ ఆ హీరోతో కలిసి, ఇంకెంత కాలం ’
ఒక్క టాలీవుడ్ అనే కంటే.. మొత్తంగా భారతీయ చిత్ర పరిశ్రమలో పెద్ద సినిమాలు, పెద్ద హీరోలదే రాజ్యం. కథ, కథనం బాగుండి.. జనం ఆదరిస్తున్నా సరే .. సరిగ్గా ఆ టైంకి పెద్ద సినిమా వస్తే నిర్ధాక్షిణ్యంగా చిన్న సినిమాను తొక్కేస్తారు. గతంలో అన్ని సినిమాలకు సమానంగా ఆదరణ దక్కేది. కానీ ఇటీవల ఈ రకమైన వివక్ష చిత్ర పరిశ్రమలో తీవ్రంగా పెరుగుతోంది. దీనిని కట్టడి చేయకుంటే చిన్న నిర్మాతల మనుగడ కష్టమవుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
నిజానికి పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలే ఇండస్ట్రీలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నాయన్నది బహిరంగ రహస్యం. 365 రోజులు చిన్న సినిమాల షూటింగ్స్ జరిగి ఎంతో మందికి ఉపాధి దొరుకుతోంది. కానీ విడుదల, థియేటర్ల కేటాయింపు దగ్గరికి వచ్చేసరికి పెద్ద సినిమాలకు ఇచ్చే ప్రాధాన్యత తమకు దక్కడం లేదని చిన్న నిర్మాతలు వాపోతున్నారు. దీనిపై ఎందరో చిన్న నిర్మాతలు గళమెత్తారు, సాయం కోసం చూశారు కానీ నో ఛేంజ్. చిన్న సినిమా , పెద్ద సినిమా వంటివేవీ ఉండవని అదంతా స్టార్డమ్, కలెక్షన్స్లో కనిపించే తేడా మాత్రమేనని మరికొందరు అంటారు.

అయితే చిన్న సినిమాలే కాదు.. మీడియం రేంజ్ హీరోలు నటించిన సినిమాలు కూడా పెద్ద హీరోల దెబ్బకి వణికిపోతున్నాయి. తాజాగా ఇదే అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు బాలీవుడ్ హీరో ఉత్కర్ష్ శర్మ. గదర్ 2 వంటి హిట్ సినిమా తీసిన అనిల్ శర్మ కుమారుడే ఉత్కర్ష్ శర్మ.. ఇప్పుడిప్పుడే హిందీ ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్న ఈ యువ హీరో ఐకాన్స్టార్ అల్లు అర్జున్ నటించిన బ్లాక్బస్టర్ మూవీ పుష్ప 2 ది రూల్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పుష్ప సినిమా వల్ల తమ సినిమా నలిగిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
దిగ్గజ నటుడు నానాపటేకర్తో కలిసి ఉత్కర్ష్ నటించిన చిత్రం వనవాస్. సిమ్రత్ కౌర్, రాజ్పాల్ యాదవ్, ఖుష్భూ తదితరులు కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 20న విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం దాదాపు రూ.6 కోట్ల వసూళ్లు సాధించి ఫ్లాప్గా నిలిచింది. ఈ సినిమా రిజల్ట్పై తాజాగా హీరో ఉత్కర్ష్ శర్మ మాట్లాడుతూ.. సరిగ్గా ఆ సమయంలోనే పుష్ప 2 ది రూల్, బేబీ జాన్ వంటి బడా చిత్రాలు రిలీజ్ కావడంతో ప్రేక్షకులకు మా సినిమా చేరువ కాలేకపోయిందన్నారు.
సినిమా బాగున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లు దక్కలేదని ఉత్కర్ష్ ఆరోపించారు. ఒకే సమయంలో రెండు లేదా మూడు సినిమాలను వీక్షించేలా మనదేశంలో స్క్రీన్స్ అందుబాటులో తక్కువ సంఖ్యలో ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ కారణం చేత ఒకే సమయంలో పలు చిత్రాలు విడుదలైతే ఈ పోటీలో కొన్ని సినిమాలు మాత్రమే నిలవగలుగుతున్నాయని , ఇకపై ఇలాంటి పరిస్ధితి ఉండకూడదని ఉత్కర్ష్ శర్మ సూచించారు. అయితే ఓటీటీలో మాత్రం తమ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
కాగా.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ నటించిన పుష్ప 2 ది రూల్ గతేడాది డిసెంబర్ 4న విడుదలై చరిత్ర సృష్టించింది. ఏకంగా రూ.1870 కోట్లకు పైగా వసూళ్లతో అత్యథిక కలెక్షన్స్ సాధించిన భారతీయ చిత్రాల్లో రెండో స్థానంలో నిలిచింది. ఒక్క హిందీలోనే ఏకంగా రూ.800 కోట్లకు పైగా కలెక్షన్స్తో స్ట్రెయిట్ హిందీ చిత్రాన్ని మించి రాబట్టి రికార్డులు తిరగరాసింది.


Click it and Unblock the Notifications











