Who was Baba Siddique? సల్మాన్ ప్రాణ స్నేహితుడి దారుణ హత్య.. బాబా సిద్ధిఖీ మర్డర్ వెనుక ఎవరి హస్తమో తెలుసా?
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్ గ్రూప్) నేత, మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యారు. శనివారం సాయంత్రం ముంబైలోని బాంద్రా ఈస్ట్లో ముగ్గురు వ్యక్తులు ఆయనను కాల్చి చంపారు. ఆయన బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ ఖాన్కు అత్యంత సన్నిహితుడు. దసరా వేడుకల్లో ముంబై నగరం ఉండగా.. ఈ హత్య కలకలం రేపింది. మిత్రుడి మరణవార్త విన్న సల్మాన్ ఖాన్ బిగ్బాస్ 18 షూటింగ్ని క్యాన్సిల్ చేసుకుని ముంబైలోని లీలావతి ఆసుపత్రికి చేరుకుని బాబా కుటుంబాన్ని పరామర్శించారు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
బాబా సిద్ధిఖీ మహారాష్ట్రలో పేరున్న రాజకీయ నేత. విలాసవంతమైన జీవితం గడపటంతో పాటు బాలీవుడ్ ప్రముఖులతో అత్యంత సన్నిహితంగా ఉండేవాడు. రంజాన్ సందర్భంగా అతను ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులకు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ వంటి సెలబ్రెటీలు హాజరయ్యేవారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన బాబా సిద్ధిఖీ మూడుసార్లు ఎమ్మెల్యేగా సేవలందించారు.

1958 సెప్టెంబర్ 13న బీహార్లోని పాట్నాలో జన్మించారు బాబా సిద్ధిఖీ. ఆయన పూర్తి పేరు బాబా జీయావుద్దిన్ సిద్ధిఖీ. షెహజీన్ సిద్ధిఖీని పెళ్లాడిన ఆయనకు అర్షియా సిద్ధిఖీ, జీషన్ సిద్ధిఖీ సంతానం. కుమారుడు జీషన్ కూడా రాజకీయాల్లోకి దిగి.. బాంద్రా ఈస్ట్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1977లో 18 ఏళ్ల వయసులోనే సిద్ధిఖీ కాంగ్రెస్ పార్టీలో యువ కార్యకర్తగా తన ప్రస్థానం ప్రారంభించారు. 1980 నాటికి ఆయన బాంద్రా తాలూకా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఎదిగాడు. 1988 నాటికి ముంబై నగర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికై సంచలనం సృష్టించాడు.
1992లో ముంబై మున్సిపల్ కార్పోరేషన్లో కార్పోరేటర్గా గెలపొందాడు. అనంతరం 1999 నుంచి వరుసగా మూడు సార్లు బాంద్రా వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (ఎంహెచ్ఏడీఏ) ముంబై బోర్డు ఛైర్మన్గానూ సిద్ధిఖీ సేవలందించారు. 2004- 2008 మధ్య కాంగ్రెస్ - ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వంలో సిద్ధిఖీ మంత్రిగా పనిచేశాడు. దాదాపు 48 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో సేవలందించిన సిద్ధిఖీ ఈ ఏడాది ప్రారంభంలో ఆ పార్టీతో అనుబంధాన్ని తెంచుకున్నారు. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి జైకొట్టడం మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది.

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని బాబా సిద్ధిఖీ తన కుటుంబ సభ్యులతో గ్రాండ్గా సెలబ్రెట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తన కుమారుడు జీషాన్ కార్యాలయం వద్ద శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో సిద్ధిఖీ బాణాసంచా కాలుస్తున్నారు. ఇంతలో ముగ్గురు వ్యక్తులు ముఖానికి ముసుగులు ధరించి ఆయనపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఘటనలో బాబా సిద్ధిఖీ కడుపు, ఛాతీలోకి బుల్లెట్లు దూసుకెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన అనుచరులు ఆయను లీలావతి ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించినట్లుగా జాతీయ మీడియా తెలిపింది.
అయితే బాబా సిద్ధిఖీ మరణం వెనుక ఎవరున్నారు..? ఆయనను ఎందుకు చంపారు? అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. జాతీయ మీడియా కథనాలను బట్టి సిద్ధిఖీ హత్య వెనుక కరడుగట్టిన గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ హస్తం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. బిష్ణోయ్ గ్యాంగ్ .. సల్మాన్ను హతమార్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మిత్రుడికి ప్రభుత్వం నుంచి రక్షణ కల్పించడంతో పాటు సల్మాన్ ఖాన్ను అండగా నిలిచాడు. దీంతో బిష్ణోయ్ గ్యాంగ్ .. బాబా సిద్ధిఖీని టార్గెట్ చేసిందనే వార్తలు వస్తున్నాయి. దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు, ముంబై క్రైం బ్రాంచ్ దర్యాప్తు ప్రారంభించింది.


Click it and Unblock the Notifications











