3000 కోట్లతో ఆదిత్యధర్ సంచలనం.. ధురంధర్ 2 ప్రభంజనంలోనూ రాజమౌళిదే డామినేషన్
ధురంధర్, ధురంధర్ 2 చిత్రాల విజయాలతో భారతీయ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్గా మారారు ఆదిత్యధర్. తనదైన స్టోరీ టెల్లింగ్, స్క్రీన్ ప్లేతో సినిమా మేకింగ్లో కొత్త ట్రెండ్ సెట్ చేశారు ఆదిత్య. చిన్నా చితకా డైరెక్టర్ల నుంచి స్టార్స్ వరకు ఎవరైనా సరే .. తన విధానాన్ని ఫాలో కావాల్సిన పరిస్ధితిని కల్పించారు. ఇక స్పై యాక్షన్ మూవీస్కి సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేశారు ఆదిత్యధర్. తాజాగా దర్శకుడిగా ఆయన అరుదైన ఘనతను సాధించారు. ఈ వివరాల్లోకి వెళితే..
తీసింది మూడు సినిమాలే అయినా తిరుగులేని స్థార్డమ్ను అందుకున్నారు ఆదిత్య ధర్. దర్శకుడిగా ఉరి: ది సర్జికల్ స్ట్రైక్, ధురంధర్, ధురంధర్ 2 చిత్రాలను తెరకెక్కించారు. అంతకముందు బూండ్, ఆక్రోష్, తేజ్, ఆర్టికల్ 370, ధూమ్ ధామ్, బారాముల్లా చిత్రాలకు రైటర్గా, మాటల రచయితగా వ్యవహరించారు. ఉరి మూవీతోనే తన సత్తా ఏంటో నిరూపించుకున్న ఆయన.. ధురంధర్ సిరీస్తో పీక్స్ చూశారు. ధురంధర్తో సక్సెస్ కొట్టి.. కేవలం మూడు నెలలు తిరిగేసరికి దానికి సీక్వెల్ను విడుదల చేయడం ఆదిత్య ప్రతిభకు నిదర్శనం.

ధురంధర్తో ఇండస్ట్రీ హిట్ అందుకోవడంతో దాని సీక్వెల్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ హైప్కి తగిన విధంగా సినిమా లేకపోతే ప్రేక్షకులు, విశ్లేషకులు, సినీ ప్రముఖుల నుంచి విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చేది. కానీ ఆదిత్య అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ధురంధర్ 2పై ఉన్న అంచనాలను అందుకోవడంతో పాటు కొత్త రికార్డులను సెట్ చేశారు. దాదాపు 4 గంటల నిడివి ఉన్న సినిమాను థియేటర్లలోకి వదలడమే సాహసం అనుకుంటే.. అంతసేపు ప్రేక్షకుడిని కుర్చీలో మునివేళ్లపై కూర్చొనేలా చేయడం ఆయన టాలెంట్ను నిరూపిస్తోంది.
ధురంధర్ 2 మూవీ 14 రోజుల వరకు ఇండియాలో 920 కోట్ల రూపాయల నెట్.. 1101.47 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయగా.. ఓవర్సీస్లో 365 కోట్ల రూపాయలు రాబట్టింది. దీంతో కలిపి 14 రోజుల్లో వరల్డ్ వైడ్గా ఏకంగా 1466 కోట్ల రూపాయలు వసూలు చేసి కొత్త లెక్కలు సెట్ చేసింది. 2000 కోట్ల టార్గెట్ దిశగా వేగంగా పరుగులు తీస్తోంది ధురంధర్ 2. ఇప్పటికే అత్యధిక కలెక్షన్స్ సాధించిన భారతీయ చిత్రాల్లో టాప్ 5లో తన రెండు చిత్రాలతో చరిత్ర సృష్టించిన ఆదిత్యధర్ మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు.
దర్శకుడిగా ఆదిత్యధర్ తెరకెక్కించిన సినిమాలు అన్నీ కలిపి 3000 కోట్లకు పైగా వసూళ్లను సాధించాయి. తొలుత ఆయన దర్శకత్వం వహించిన మూవీ ఉరి: ది సర్జికల్ స్ట్రైక్స్ మూవీ 2019 జనవరి 11న విడుదలైంది. 2016లో ఉరిలోని ఇండియన్ ఆర్మీ బేస్పై ఉగ్రవాదుల దాడి, దీనికి కౌంటర్గా పాక్ ఆక్రమిత కాశ్మీర్పై భారత సైన్యం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఉరికి ఇండియాలో 244.14 కోట్ల రూపాయల నెట్.. 293.75 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాగా.. ఓవర్సీస్లో 48 కోట్ల రూపాయలతో కలిపి వరల్డ్ వైడ్గా 341 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టింది.
ఇక ధురంధర్ సంగతి అందరికీ తెలిసిందే. 2025 డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఇండియాలో 840 కోట్ల రూపాయల నెట్.. 1007.85 కోట్ల రూపాయలు గ్రాస్, ఓవర్సీస్లో 300 కోట్ల రూపాయల వసూళ్లతో కలిపి 1307 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇప్పుడు తాజాగా ధురంధర్ 2తో కలిపి ఆదిత్యధర్ తెరకెక్కించిన మూడు సినిమాలు వరల్డ్ బాక్సాఫీస్ వద్ద 3144.43 కోట్ల రూపాయలు రాబట్టాయి. సగటున ఒక్కో సినిమా 1048.14 కోట్ల రూపాయలు రాబట్టి ఆదిత్యధర్ సత్తాను చాటి చెప్పాయి.
అయితే ఇంత ఘనత సాధించినప్పటికీ.. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రికార్డ్ను మాత్రం ఆదిత్యధర్ టచ్ చేయలేకపోయాడు. భారీ కలెక్షన్స్ సాధించిన సినిమాలతో జక్కన్న ఈ లిస్ట్లో టాప్లో కొనసాగుతున్నారు. ఆర్ఆర్ఆర్(1387 కోట్ల రూపాయలు), బాహుబలి ది కన్క్లూజన్ (1810 కోట్ల రూపాయలు), బాహుబలి ది బిగినింగ్ (650 కోట్ల రూపాయలు), ఈగ (130 కోట్ల రూపాయలు), మగధీర (150 కోట్ల రూపాయలు)తో ఆయన చిత్రాలు 4150 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. భారతీయ సినీ చరిత్రలో తొలిసారిగా 2 సార్లు 1000 కోట్ల కలెక్షన్స్ సాధించిన సినిమాలు తీసిన దర్శకుడు రాజమౌళియే. ఇప్పుడు ధురంధర్ 2 ఎన్ని రికార్డులు సృష్టిస్తున్నా.. వాటన్నింటినీ తుడిచిపెట్టగలిగింది రాజమౌళియేనని విశ్లేషకులు భావిస్తున్నారు. సూపర్స్టార్ మహేశ్ బాబుతో ఆయన తెరకెక్కిస్తోన్న వారణాసి మూవీతో సరికొత్త రికార్డుల్ని జక్కన నెలకొల్పుతాడని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications



















