రికార్డులు బద్దలు కొడుతున్న ‘ఎవరు’.. మొదటి వారం ఎంత రాబట్టిందంటే...
సక్సెస్ఫుల్ హీరో అడవి శేష్ - కొత్త దర్శకుడు రాంజీ కలయికలో వచ్చిన చిత్రం 'ఎవరు'. రెజీనా కసండ్ర, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను పీవీపీ సినిమాస్ బ్యానర్లో తెరకెక్కించారు. మర్డర్ మిస్టరీతో రూపొందిన ఈ సినిమా స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుంచే మంచి స్పందనను రాబట్టుకుంది.
ఇందులో వచ్చే ట్విస్టులు, స్క్రీన్ ప్లే, నటీనటుల యాక్టింగ్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా రెజీనా, నవీన్ చంద్ర నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అందుకు అనుగుణంగానే సినీ విమర్శకులు కూడా ఈ సినిమాకు మంచి రివ్యూలు, రేటింగ్స్ ఇచ్చారు. దీంతో ఈ సినిమా హిట్ టాక్తో పాటు భారీ కలెక్షన్లనూ సాధిస్తూ విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే 'ఎవరు'తో అడవి శేషు హ్యాట్రిక్ కూడా సాధించాడు.

ఇక.. ఈ సినిమా కలెక్షన్ల పరంగానూ దూసుకుపోతోంది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ స్పందన వస్తుండడంతో 'ఎవరు' కలెక్షన్లు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. బీ, సీ సెంటర్లతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఈ సినిమాపై సంతృప్తితోనే ఉన్నారు. దీంతో 'ఎవరు' మొదటి వారంలో రూ. 10 కోట్ల షేర్ సాధించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఇప్పటికే లాభాలు కూడా వచ్చాయని అంటున్నారు. ఇది అడవి శేషు కెరీర్లోనే రికార్డు అని అంటున్నారు సినీ విశ్లేషకులు.
'ఎవరు' ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ రైట్స్ రూ. 9.10 కోట్లకు అమ్మారు. అందులో ఏపీ, తెలంగాణ రైట్స్ రూ. 6.80 కోట్లు, రెస్టాఫ్ ఏపీ రైట్స్ రూ. 60 లక్షలు ఉన్నాయి. అలాగే, ఓవర్సీస్ రైట్స్ రూ. 1.70 కోట్లకు ఇచ్చారు. ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో కొనుగోలు చేసిన మొత్తం పోగా లాభాలు గడిస్తున్నారట బయ్యర్లు. దీంతో వారంతా ఖుషీగా ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











