Athadu 4K Second Re-Release: సెకండ్ రీ రిలీజ్లో అతడు సంచలనం.. మహేశ్ మూవీకి బిజినెస్ ఎన్ని కోట్లంటే?
ఇటీవలి కాలంలో సినిమాలను ప్రేక్షకులను ఆదరించే విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటున్నారు. తమకు తగిన కంటెంట్ లేకపోతే ఎంత పెద్ద స్టార్ హీరో నటించిన సినిమా అయినా మరో మాట లేకుండా తిరస్కరిస్తున్నారు. నచ్చితే ఎన్నిసార్లయినా చూసేందుకు వెనుకాడటం లేదు. థియేటర్లో హిట్ అనిపించుకున్న సినిమాలు ఓటీటీలో ఫట్ అంటున్నాయి. థియేటర్లలో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాలు ఓటీటీలో బ్లాక్బస్టర్గా నిలుస్తున్నాయి. జనం నాడిని పట్టుకోవడం మహామహా దర్శకులకు కూడా కష్టంగా మారుతోంది.
అతడుకు కల్ట్ స్టేటస్
అయితే థియేటర్లోనూ, టెలివిజన్లోనూ.. ప్రస్తుత ఓటీటీ యుగంలోనూ బ్లాక్బస్టర్గా నిలిచిన చిత్రాలు అరుదు. ఎన్నిసార్లు టీవీలలో వేసినా జనం ఎగబడి చూస్తూనే ఉంటారు. రీ రిలీజ్లోనూ వసూళ్ల వర్షం కురిపిస్తుంటాయి. ఇలాంటి చిత్రాలను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. ఈ కోవలోకే వస్తుంది అతడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్స్టార్ మహేశ్ బాబు నటించిన ఈ సినిమా.. ఆయన కెరీర్తో పాటు తెలుగు చలన చిత్ర చరిత్రలోనే క్లాసిక్ అనిపించుకుని కల్ట్ స్టేటస్ అందుకుంది.

టీవీలో అతడు సంచలనం
20 ఏళ్ల క్రితం రిలీజైన అతడు మూవీ టెలివిజన్లో దాదాపు 1500 సార్లకు పైగా టెలికాస్ట్ అయ్యింది. ఎప్పుడు వేసినా జనం మంచి టీఆర్పీని కట్టబెడుతూనే ఉన్నారు. టీవీ ఇండస్ట్రీకి సంబంధించి అతడు నెలకొల్పిన ఘనతను అందుకోవడం భవిష్యత్తులో అసాధ్యం. ఇక రీరిలీజ్లలోనూ అతడు మూవీ కలెక్షన్స్ విషయంలో ప్రభంజనం సృష్టిస్తోంది. తాజాగా మరోసారి అతడు మూవీని సెకండ్ టైమ్ రీ రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్లో అతడు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ వివరాల్లోకి వెళితే..
థియేటర్లో అతడు ప్రభంజనం
ప్రముఖ నటుడు మురళీ మోహన్ కుటుంబానికి చెందిన జయభేరి ఆర్ట్స్ బ్యానర్పై కిశోర్ దుగ్గిరాల, ఎం రామ్మోహన్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. మహేశ్ బాబు, త్రిష హీరో హీరోయిన్లు నటించగా.. ప్రకాశ్రాజ్, సోనూసూద్, షయాజీ షిండే, కోటా శ్రీనివాసరావు, రాహుల్ దేవ్, నాజర్, సునీల్, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ, పోసాని కృష్ణమురళీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా 2005 ఆగస్ట్ 10న విడుదలైన అతడు చిత్రం భారీ వసూళ్లను సాధించింది. వరల్డ్ వైడ్గా 22 కోట్ల రూపాయల కలెక్షన్స్తో పాటు 205 కేంద్రాలలో 50 రోజులు, 38 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. ఒక్క హైదరాబాద్ సుదర్శన్ 35 ఎంఎం థియేటర్లో 175 రోజులు ప్రదర్శించబడటంతో పాటు ఏకంగా రూ.1.40 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
రీ రిలీజ్లో అతడు రికార్డులు
సూపర్స్టార్ మహేశ్ బాబు 50వ పుట్టినరోజును పురస్కరించుకుని గతేడాది ఆగస్ట్ 9న అతడు 4k వెర్షన్లో రీ రిలీజై కలెక్షన్ల వర్షం కురిపించింది. వరల్డ్ వైడ్గా ఏకంగా 6.5 కోట్ల రూపాయలు వసూలు చేసి ట్రేడ్ పండితులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. తాజాగా మహేశ్ అభిమానులకు శుభవార్త చెప్పారు అతడు నిర్మాతలు. ఈ సినిమాను ఫిబ్రవరి 28వ తేదీన మరోసారి రీ రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. అయితే మహేశ్ బాబుకు సంబంధించి కానీ అతడు యూనిట్కు సంబంధించిన కానీ ఎలాంటి ప్రత్యేక సందర్భాలు లేవు. అయినప్పటికీ ఈ సినిమాను సెకండ్ రీ రిలీజ్కు తీసుకురావడం ఆశ్చర్యం కలిగిస్తే.. ఈ మూవీకి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ మరింత హాట్ టాపిక్గా మారింది.
అతడు సెకండ్ రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
అతడు 4K సెకండ్ రీ రిలీజ్కు నైజాం థియేట్రికల్ రైట్స్ 18 లక్షల రూపాయలు, ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 16 లక్షల రూపాయలు, సీడెడ్ థియేట్రికల్ రైట్స్ 3 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియా 3 లక్షల రూపాయలు చొప్పున ఓవరాల్గా 40 లక్షల రూపాయల మేర బిజినెస్ చేసింది. ఈ నెంబర్ల ద్వారా మహేశ్ బాబు క్రేజ్, అతడు సినిమాపై జనంలో ఆదరణ ఎలా ఉందో తెలియజేస్తుంది. సెకండ్ రీ రిలీజ్లో అతడు మూవీ బ్రేక్ఈవెన్ కావాలంటే 41 లక్షల రూపాయల షేర్.. 85 లక్షల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉంది. సంక్రాంతి తర్వాత టాలీవుడ్ నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలో ఏ పెద్ద సినిమా రిలీజ్ కాకపోవడం అతడు రీ రిలీజ్కు కలిసొస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మరి అతడు సెకండ్ రీ రిలీజ్లో ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











