Athadu Re-Release Advance Booking: అతడు సెకండ్ రీ రిలీజ్ కలెక్షన్స్.. మహేశ్ మూవీ ఆ రికార్డు బ్రేక్ చేస్తుందా?
రీ రిలీజ్ కల్చర్లో చిత్ర నిర్మాతలు బాగానే లాభాలు గడిస్తున్నారు. డ్రై సీజన్లో రీ రిలీజ్ల వల్ల థియేటర్లు కూడా ప్రేక్షకుల రాకతో సందడిగా మారుతుండటంతో పాత హిట్ సినిమాలను ఈ జనరేషన్కు తగినట్లుగా అత్యాధునిక 4కే వెర్షన్, డాల్బీ డీటీఎస్ ఎఫెక్ట్స్తో రెడీ చేస్తున్నారు మేకర్స్. తెలుగునాట రీ రిలీజ్ బొమ్మలకు మంచి ఆదరణ లభిస్తోంది. పోకిరి, బిజినెస్మెన్, మురారి, అతడు, గబ్బర్సింగ్, జల్సా, ఖుషి, శివ, మనసంతానువ్వే, ఆరెంజ్ తదితర సినిమాలు రీ రిలీజ్లలో సరికొత్త రికార్డులు సృష్టించాయి. వీటిని చూసి మరికొందరు నిర్మాతలు కూడా తమ సినిమాలను రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
ఫిబ్రవరి 28న అతడు 4కే సెకండ్ రీ రిలీజ్
ఇకపోతే.. తెలుగు చిత్ర పరిశ్రమలో క్లాసిక్ అనదగ్గ సినిమాలలో అతడు మూవీ కూడా ఒకటి. త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్స్టార్ మహేశ్ బాబు, త్రిష నటించిన ఈ మూవీకి కల్ట్ ఫాలోయింగ్ ఉంది. టీవీలలో 1500 సార్లకు పైగా టెలికాస్ట్ అయినా ఏనాడూ బోర్ కొట్టలేదు. ఎన్నిసార్లు వేసినా భారీ టీఆర్పీలతో ట్రేడ్ పండితులను ఆశ్చర్యంలో ముంచెత్తుంతోంది. రీ రిలీజ్లోనూ చరిత్ర సృష్టించిన అతడు.. మరోసారి సెకండ్ రీ రిలీజ్ కానుంది. ఫిబ్రవరి 28వ తేదీన అతడును 4కే వెర్షన్లో విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అవ్వగానే.. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

అతడు సంచలన రికార్డులు
జయభేరి ఆర్ట్స్ బ్యానర్పై కిశోర్ దుగ్గిరాల, ఎం రామ్మోహన్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించగా.. మురళీ మోహన్ సమర్పకుడిగా వ్యవహరించారు. ప్రకాశ్రాజ్, సోనూసూద్, షయాజీ షిండే, కోటా శ్రీనివాసరావు, రాహుల్ దేవ్, నాజర్, సునీల్, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ, పోసాని కృష్ణమురళీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా 2005 ఆగస్ట్ 10న విడుదలైన అతడు చిత్రం భారీ వసూళ్లను సాధించింది. వరల్డ్ వైడ్గా 22 కోట్ల రూపాయల కలెక్షన్స్తో పాటు 205 కేంద్రాలలో 50 రోజులు, 38 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. ఒక్క హైదరాబాద్ సుదర్శన్ 35 ఎంఎం థియేటర్లో 175 రోజులు ప్రదర్శించబడటంతో పాటు ఏకంగా రూ.1.40 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
రీ రిలీజ్లో సంచలనం
సూపర్స్టార్ మహేశ్ బాబు 50వ పుట్టినరోజును పురస్కరించుకుని గతేడాది ఆగస్ట్ 9న అతడు 4k వెర్షన్లో రీ రిలీజై కలెక్షన్ల వర్షం కురిపించింది. వరల్డ్ వైడ్గా ఏకంగా 6.5 కోట్ల రూపాయలు వసూలు చేసి ట్రేడ్ పండితులను విస్మయానికి గురిచేసింది. తాజాగా ఫిబ్రవరి 28వ తేదీన అతడు చిత్రాన్ని మరోసారి రీ రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఇక సెకండ్ రీ రిలీజ్లో అతడుకు మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు. నైజాం థియేట్రికల్ రైట్స్ 18 లక్షల రూపాయలు, ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 16 లక్షల రూపాయలు, సీడెడ్ థియేట్రికల్ రైట్స్ 3 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియా 3 లక్షల రూపాయలు చొప్పున ఓవరాల్గా 40 లక్షల రూపాయల మేర బిజినెస్ చేసింది. సెకండ్ రీ రిలీజ్లో అతడు మూవీ బ్రేక్ఈవెన్ కావాలంటే 41 లక్షల రూపాయల షేర్.. 85 లక్షల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉంది.
అడ్వాన్స్ బుకింగ్లో అతడికి మంచి రెస్పాన్స్
కాగా.. ఫిబ్రవరి 28వ తేదీన అతడు 4కే రీ రిలీజ్ ఉండగా.. అడ్వాన్స్ బుకింగ్కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, చెన్నై, ఓవర్సీస్ ఏరియాలలో మంచి ఆక్యూపెన్సీ నమోదవుతున్నట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. బుక్ మై షోలో 9.8 యూజర్ రేటింగ్స్తో పాటు భారీగా టికెట్స్ సేల్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఫిబ్రవరి 24వ తేదీన మధ్యాహ్నం నాటికి ఇండియాలో తొలిరోజు 5 సెంటర్స్లో, 13 షోలకు గాను 975 టికెట్లు అమ్ముడవ్వగా.. అడ్వాన్స్ బుకింగ్లో లక్ష రూపాయలకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లుగా విశ్లేషకులు తెలిపారు.
మహేశ్ ఆ రికార్డ్ను బ్రేక్ చేస్తాడా?
మరోవైపు.. తెలుగునాట రీ రిలీజ్ కలెక్షన్స్లో బాహుబలి ది ఎపిక్ (50 కోట్ల రూపాయలు) నెంబర్ వన్గా ఉంది. ఆ తర్వాత ఖలేజా (10.25 కోట్ల రూపాయలు), మురారి (8.90 కోట్ల రూపాయలు), గబ్బర్ సింగ్ (8.01 కోట్ల రూపాయలు), ఖుషి (7.46 కోట్ల రూపాయలు), బిజినెస్మెన్ (6.90 కోట్ల రూపాయలు), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు(6.60 కోట్ల రూపాయలు) వసూలు చేశాయి. ఇప్పుడు అతడు సెకండ్ రీ రిలీజ్ నేపథ్యంలో గతేడాది రీ రిలీజ్ సందర్భంగా వసూలు చేసిన (6.45 కోట్ల రూపాయల) మొత్తాన్ని బ్రేక్ చేస్తుందేమో చూడాలి.


Click it and Unblock the Notifications











