వంద కోట్లకు చేరువైన ఇలియానా చిత్రం
ముంబై : ఇలియానా నటించిన తొలి హిందీ సినిమా 'బర్ఫీ'. రణ్బీర్ కపూర్ హీరోగా నటించిన చిత్రం 'బర్ఫి'. ఇందులో ఆయన మూగ, చెముడు ఉన్న వ్యక్తి పాత్రలో నటించారు. ప్రియాంక చోప్రా, ఇలియానా హీరోయిన్స్ . అనురాగ్ బసు దర్శకత్వం వహించారు. ఈ సినిమా త్వరలోనే రూ.వంద కోట్ల క్లబ్బులో చేరబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు యూటీవీ వర్గాలు ఓ ప్రకటన విడుదల చేశాయి. ఇప్పటిదాకా 'బర్ఫి' సినిమాకు స్థిరమైన వసూళ్లు దక్కాయి. ఇటీవలే మా సినిమా విదేశీ విభాగంలో ఆస్కార్ నామినేషన్ కూడా దక్కించుకుంది. దీంతో మరింతగా ప్రేక్షకులకు చేరువవుతోందనీ.. ఆ ప్రభావంతో వసూళ్లు రూ.వంద కోట్లు దాటడం ఖాయమని లెక్కలేశారు.
'బర్ఫీ' చిత్రం సెప్టెంబర్ 14న విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈచిత్రం ఒక చెవిటి, మూగ వ్యక్తి కథ. రణబీర్ ఆ పాత్రలో అద్భుతంగా నటించాడు. రణబీర్ తన నటనతో తాత రాజ్ కపూర్ పేరు నిలబెట్టాడనే ప్రశసంసలు అందుకుంటున్నాడు. జిల్మిల్ పాత్రలో ప్రియాంక చోప్రా నటకు మంచి మార్కులు పడ్డాయి. సౌత్ లో ఇప్పటికే తన టాలెంట్ నిరూపించుకున్న ఇలియానా ఈ చిత్రంలో శృతి పాత్రలో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈ చిత్రం గురించి ఇలియానా మాట్లాడుతూ...'బర్ఫీకోసం తాను మంచి మంచి అవకాశాలను వదులుకున్నానని, గ్లామర్ లేకపోయినా తన ఫిజిక్ చక్కగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నానని, తన కెరీర్లోనే ఓ గొప్ప విజయంగా బర్ఫీని చెప్పుకుంటానని తెలిపింది. కమర్షియల్గా ఈ కథ విజయం సాధించకపోయినా విమర్శకుల ప్రశంసలు తప్పక లభిస్తాయని తనకుముందే తెలుసని, అయితే ప్రేక్షకులు ఈ చిత్రానికి ఇంత విజయం అందించడం మాత్రం సరికొత్తగా ఉందని, ఈ చిత్రంలో భాగమైనందుకు గర్వంగా ఉంది అని అంటోంది.
మరో ప్రక్క ఈ చిత్రంతో హిందీకి పరిచయమైన గోవా బ్యూటీ ఇలియానా 'బర్ఫి' తో బాలీవుడ్లో సక్సెస్ అవుతాననే నమ్మకం ఉందంటోంది. ఆమె మాట్లాడుతూ..''సినిమాల్లోకి వచ్చిన కొత్తలోనే నేను భయపడలేదు. ఎంతో ఆత్మవిశ్వాసంతో కెమెరా ముందు నిలబడ్డాను. ఇప్పుడు ఇన్ని సినిమాలు చేసిన తర్వాత ఎందుకు భయపడతాను. సక్సెస్ కాననే సందేహమే లేదు. నటిగా ఎలాంటి పాత్రని అయినా చేయగల దమ్ము నాలో ఉంది. అలాంటప్పుడు అభద్రతాభావానికి ఎందుకు గురవుతాను. కచ్చితంగా అక్కడ కూడా నాకంటూ ఓ స్థానం సంపాదించుకుంటా'' అంటున్నారు ఇలియానా.
ఇక ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల బరిలోకి భారతదేశం తరఫున 'బర్ఫీ' చిత్రం దిగబోతోంది. 2012 సంవత్సరానికిగానూ 'బర్ఫీ' చిత్రాన్ని ఎంపిక చేసినట్టు ప్రకటించారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆస్కార్ జ్యూరీ ఛైర్పర్సన్ మంజు బోరా ఈ విషయం తెలియచేసారు. ఆస్కార్ అవార్డ్స్ విభాగంలో 'ఉత్తమ విదేశీ చిత్రం' విభాగానికి సంబంధించిన నామినేషన్ కోసం మన భారతదేశం నుంచి ఒక సినిమాని ఎంపిక చేసింది ఎఫ్ఎఫ్ఐ. వివిధ భారత భాషల్లో రూపొందిన దాదాపు 20 చిత్రాలను వీక్షించారు.


Click it and Unblock the Notifications











