Bhairavam Collections: బైరవం బాక్సాఫీస్ కలెక్షన్లు.. బెల్లంకొండ శ్రీను మూవీకి షాకింగ్ వసూళ్లు?
తమిళంలో ఘన విజయం సాధించిన గరుడన్ సినిమా ఆధారంగా రూపొందిన తెలుగు చిత్రం భైరవం. తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన యువ హీరోలు బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మనోజ్ మంచు హీరోలుగా, అదితి శంకర్, దివ్య పిళ్లై, ఆనంది హీరోయిన్లుగా సీనియర్ నటి జయసుధ కీలక పాత్రలో నటించారు. నాంది ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత కేకే రాధా మోహన్ ఈ సినిమాను నిర్మించారు. మే 30వ తేదీన రిలీజైన ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, బాక్సాఫీస్ వద్ద నమోదైన కలెక్షన్లు, బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాల్లోకి వెళితే..
మాస్, యాక్షన్, ఎంటర్టైనర్గా రూపొందిన భైరవం సినిమాకు డాక్టర్ జయంతిలాల్ గడ సమర్పకుడిగా వ్యవహరించారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్, పెన్ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమాలో భారీగా తారాగణం, టాప్ టెక్నిషియన్స్ పనిచేశారు. ఈ సినిమాను ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించడంతో బడ్జెట్ భారీగా పెరిగిపోయింది. ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ మూవీని సుమారుగా 35 కోట్ల రూపాయలతో నిర్మించారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

తెలుగు రాష్ట్రాల్లో భైరవం సినిమా ప్రమోషన్స్ జోరుగా కొనసాగడంతో బజ్ కూడా భారీగా క్రియేట్ అయింది. దాంతో ఈ సినిమాకు ఎక్కువగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నైజాం థియేట్రికల్ రైట్స్ 6 కోట్ల రూపాయలు, సీడెడ్లో 2.5 కోట్లు, ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 7.5 కోట్ల రూపాయల మేర జరిగింది. తెలుగు రాష్ట్రాల రైట్స్ సుమారుగా 16 కోట్ల మేర జరిగింది. ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల హక్కులు 1.5 కోట్ల రూపాయలు, అలాగే ఓవర్సీస్ హక్కులు 1.5 కోట్ల రూపాయలు మేర జరిగింది. దాంతో ఈ సినిమా హక్కులు 19 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
భైరవం సినిమా రిలీజ్ తర్వాత మిక్స్డ్ టాక్ సొంతం చేసుకొన్నది. దానికి తోడు ఈ సినిమా కలెక్షన్లపై ఖలేజా సినిమా రీరిలీజ్ కూడా భారీగా ఎఫెక్ట్ చేసింది. దాంతో ఈ సినిమా ఆక్యుపెన్సీ అంతంత మాత్రంగానే ఉంది. ఈ సినిమా ఉదయం ఆటలకు 35 శాతం ఆక్యుపెన్సీ, మధ్యాహ్నం ఆటకు 38 ఆక్యుపెన్సీ, సాయంత్రం ఆటలకు 30 శాతం, రాత్రి ఆటలకు 35 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. అత్యధికంగా గుంటూరులో 50 శాతం, వైజాగ్లో 40 శాతం, వరంగల్, విజయవాడ, హైదరాబాద్లో 35 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.
ఇక ఈ సినిమా తొలి రోజు వాస్తవంగా వేసిన అంచనా కంటే తక్కువగానే వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. భైరవం సినిమా వరల్డ్ బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్గానే వసూళ్లను సాధించింది. ఖలేజా రీ రిలీజ్ సునామీని తట్టుకొని ఓవర్సీస్, ఆంధ్రా, తెలంగాణలో స్ట్రాంగ్గా కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా తొలి రోజు 3.6 కోట్ల గ్రాస్ వసూళ్లు, రెండో రోజు 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా మొత్తంగా 6.6 కోట్ల వసూలు రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
తెలుగు రాష్ట్రాల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 1.75 కోట్లు, రెండో రోజు 1.5 కోట్లు వసూలు చేసింది. నైజాంలో 1.25 కోట్లు, సీడెడ్లో 50 లక్షలు, ఆంధ్రాలో 1.5 కోట్ల రూపాయలు గత రెండు రోజుల్లో వసూలు చేసింది. ఈ సినిమా ఓవర్సీస్లో 25 లక్షల రూపాయలు రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇదిలా ఉండగా, ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం వరల్డ్ బాక్సాఫీస్ వద్ద 20 కోట్ల రూపాయలు షేర్.. 40 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. ఈ మూవీ వస్తున్న రోజుల్లో ఈ మూవీ ఏ మేరకు వసూళ్లను రాబడుతుంది? బ్రేక్ ఈవెన్ టార్గెట్ను అధిగమిస్తుందా అనే విషయాన్ని కొద్ది రోజులు ఆగి చూడాల్సిందే. బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాలు, వార్తల కోసం ఫిల్మీబీట్ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











