Bharat Bhhagya Viddhaata Day 1 Collections భారత్ భాగ్య విధాత కలెక్షన్స్.. కంగనా మూవీకి తొలిరోజు ఎంతంటే?
26/11 ఉగ్రదాడులు.. దేశ ఆర్ధిక రాజధాని ముంబైపై పాక్ ప్రేరేపిత లష్కేరే తోయిబా తీవ్రవాదులు సృష్టించిన మారణహోమం. ఈ దారుణ ఘటనను భారతీయులు ఎప్పటికీ మరిచిపోరు. తాజ్ హోటల్, నారిమన్ పాయింట్, ఛత్రపతి శివాజీ టెర్మినస్పై విరుచుకుపడిన ఉగ్రవాదులు.. ప్రజలు, పర్యాటకులపై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ దారుణంలో 166 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 26 మంది విదేశీయులు, 20 మంది భద్రతా సిబ్బంది ఉండగా.. దాదాపు 300 మందికి పైగా గాయపడ్డారు.
ఈ దారుణంపై అనేక సినిమాలు వెండితెరపై వచ్చాయి. తాజాగా తెరకెక్కిన మూవీ భారత భాగ్య విధాత. 26/11 ముంబై ఉగ్రదాదుల సమయంలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల్ని ప్రాణాలకు తెగించి కాపాడిన నర్స్, ఆసుపత్రి సిబ్బంది జీవిత కథ, యదార్ధ సంఘటనల ఆధారంగా భారత భాగ్య విధాత సినిమాను తెరకెక్కించారు. బాలీవుడ్ క్వీన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు. జూన్ 12న ఈ సినిమా వరల్డ్ వైడ్గా విడుదలైంది. ఈ నేపథ్యంలో భారత్ భాగ్య విధాత మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? తొలిరోజు ఈ సినిమా వసూళ్లు ఎంత? అనేది పరిశీలిస్తే..

భారత్ భాగ్య విధాత తారాగణం
భారత్ భాగ్య విధాత మూవీని మణికర్ణిక ఫిల్మ్స్, పరంహన్స్ క్రియేషన్స్, యూనియా ఫిల్మ్స్, ఫ్లోటింగ్ రాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై కంగనా రనౌత్, శైలేష్ ఆర్ సింగ్, ధావల్ గడ, బబిత ఆశివాల్, ఆది శర్మలు నిర్మించగా మనోజ్ తపాడియా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో గిరిజా ఓక్ గాడ్బోలే, స్మిత తాంబే, సుహిత తట్టే, ఆశా శేలర్, ప్రియా బెర్దే, ఈషా దే, రసిక ఆఘాసే, అమృత నామ్దేవ్, ఆదిత్య మిశ్రా, జహిద్ ఖాన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అమన్ పంత్, కృష్ణ సోలో సంగీతం అందించగా.. దేవ్ రావ్ జాదవ్ ఎడిటర్గా, అయాన్ సిల్ సినిమాటోగ్రాఫర్గా వ్యవహరించారు.
భారత్ భాగ్య విధాత బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి భారత్ భాగ్య విధాత మూవీని 60 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించినట్లుగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. 26/11 దాడుల నాటి పరిస్ధితులను కళ్లకు కట్టినట్లుగా చూపించడానికి ప్రత్యేకంగా సెట్స్ వేశారు. ముంబైలోని కామా అండ్ అల్బ్లెస్ హాస్పిటల్ చుట్టూనే కథ నడుస్తుండటంతో ఆ హాస్పిటల్ సెట్ను వేశారు. అలాగే ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో కొన్ని సీన్లను చిత్రీకరించారు.
భారత్ భాగ్య విధాత బ్రేక్ఈవెన్ ఎంత?
బీజేపీ ఎంపీగా రాజకీయాల్లో బిజీగా ఉన్న కంగనా రనౌత్.. కొద్దిరోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఎమర్జెన్సీ మూవీ తర్వాత కంగనా నటిస్తోన్న మూవీ కావడంతో పాటు రాత్రికి రాత్రి నేషనల్ క్రష్గా మారిన గిరిజా ఓక్ కూడా నటిస్తుండటంతో భారత్ భాగ్య విధాతపై బజ్ నెలకొంది. దీనికి తోడు టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలో కొంతమేర హైప్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద దాదాపు 120 కోట్ల రూపాయలు రాబట్టాలని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. భారత్ భాగ్య విధాతను పెన్ మరుధర్ సినీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ దేశవ్యాప్తంగా విడుదల చేస్తోంది. బీహార్, ఒడిశాలలో ప్రకాష్ ఫిల్మ్స్ సంస్థ పంపిణీదారుగా వ్యవహరిస్తోంది. ఇక నార్త్ అమెరికా, ఇతర దేశాలలో ఫన్ ఏషియా ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ థియేట్రికల్ రైట్స్ దక్కించుకుంది.
భారత్ భాగ్య విధాత కలెక్షన్స్
కంగనా రనౌత్ మూవీకి అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయ్యాక ప్రేక్షకుల నుంచి ఓ మాదిరి రెస్పాన్స్ కనిపించింది. తొలిరోజు భారత్ భాగ్య విధాత మూవీ కోసం 21,785 టికెట్లు అమ్ముడయ్యాయి. తద్వారా అడ్వాన్స్ బుకింగ్లో 54.28 లక్షల రూపాయలు వసూలైనట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. తొలిరోజు ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తోంది. మై వాపస్ అవుంగాతో పాటు కరుప్పు, పెద్ది తదితర చిన్నాపెద్దా సినిమాల నుంచి కంగనా రనౌత్ మూవీకి గట్టి పోటీ ఎదురవుతోంది.
భారత్ భాగ్య విధాత తొలిరోజు వసూళ్ల అంచనా
తొలిరోజు ఇప్పటి వరకు భారత్ భాగ్య విధాత మూవీకి ఇండియాలో 1302 షోలు ప్రదర్శితమైన 10 శాతం ఆక్యూపెన్సీ సాధించినట్లు సాక్నిక్ నివేదించింది. ఢిల్లీలో 281 షోలు, ముంబైలో 167 షోలు, అహ్మదాబాద్లో 143, పూణేలో 73 షోలు, బెంగళూరులో 60 షోలు ప్రదర్శించినట్లు సాక్నిక్ పేర్కొంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం భారత్ భాగ్య విధాత మావీకి తొలిరోజు ఇండియాలో 38 లక్షల రూపాయల గ్రాస్ రాబట్టినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తొలిరోజు కంగనా మూవీకి వరల్డ్ వైడ్గా 1.50 కోట్ల రూపాయల నుంచి 2.50 కోట్ల రేంజ్లో ఓపెనింగ్స్ రాబట్టవచ్చని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications




