Bholaa Shankar షాకింగ్గా భోళా శంకర్ అడ్వాన్స్ బుకింగ్.. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి కంటే..
మెగాస్టార్ చిరంజీవి, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, మహానటి కీర్తి సురేష్ నటించిన చిత్రం భోళా శంకర్. తమిళంలో విజయవంతమైన వేదాళం సినిమా ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో నిర్మాత అనిల్ సుంకర నిర్మించారు. ఈ చిత్రం ఆగస్టు 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. ఈ బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
వాల్తేరు వీరయ్య సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత చిరంజీవి నటించిన మాస్ ఎంటర్టైనర్ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో దాదాపు డజనుకుపైగా కమెడియన్లు చిరంజీవితో నటించడంతో ఈ సినిమా మాస్ కామెడీ అవ్వడం గ్యారెంటీ అనే ఫీలింగ్తో ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాకు నైజాంలో తప్ప ఎక్కడ పెద్దగా అడ్వాన్స్ బుకింగ్కు స్పందన కనిపించకపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.

భోళా శంకర్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళితే.. యూకేలో 67 షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి 5500 టికెట్లు అమ్ముడుపోయాయి. ప్రీమియర్లకు 45K పౌండ్స్ వసూలు అయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్ ద్వారా యూకేలో 44 లక్షల రూపాయలు వసూలు అయ్యాయి.
అమెరికాలో భోళా శంకర్ ప్రీమియర్కు మంచి స్పందన కనిపిస్తున్నది. ఈ సినిమాను 326 లొకేషన్లలో 885 షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 200K డాలర్ల వరకు అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు నమోదు అయ్యాయి. ప్రీమియర్లతో కలిపి ఈ సినిమా 350K డాలర్లను వసూలు చేసే అవకాశం ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా నైజాంలో భోళా శంకర్ సినిమాకు మంచి స్పందన కనిపిస్తున్నది. హైదరాబాద్లో ఈ సినిమా 50 శాతం ఆక్యుపెన్సీని అడ్వాన్స్ బుకింగ్ ద్వారా సాధించింది. దాంతో ఈ చిత్రం హైదరాబాద్లోనే 1.64 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 3 కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో నమోదయ్యే అవకాశం ఉంది.

భోళా శంకర్ సినిమాకు తొలి రోజు కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల రూపాయాలు వసూలు చేసే అవకాశం ఉంది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే 35 కోట్ల వరకు రాబట్టే ఛాన్స్ కనిపిస్తున్నది. ఒకవేళ ఈ రేంజ్లో కలెక్షన్లు సాధిస్తే.. తొలివారంలోనే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

తెలుగు సినిమా పరిశ్రమలో ఇటీవల రిలీజైన సినిమాలతో పోల్చుకొంటే భోళా శంకర్ అడ్వాన్స్ బుకింగ్ చాలా స్లోగా సాగుతున్నట్టు కనిపిస్తున్నది. వాల్తేరు వీరయ్య సినిమా 15 కోట్లకుపైగా అడ్వాన్స్ బుకింగ్ సాధిస్తే.. వీరసింహారెడ్డి 15 కోట్ల రూపాయలకు లోపు, బ్రో చిత్రం 14 కోట్ల రూపాయలు, దసరా 11 కోట్ల రూపాయలు, భోళా శంకర్ చిత్రం 5 కోట్ల మేరకే అడ్వాన్స్ బుకింగ్ సాధించింది. అయితే దసరా బరిలో వాల్తేరు, వీరసింహారెడ్డి రావడం వల్ల ఎక్కువగా అడ్వాన్స్ బుకింగ్ జరిగింది. ప్రస్తుతం పండుగ మూడ్ లేకపోవడం వల్ల అడ్వాన్స్ బుకింగ్ తగ్గింది. కరెంట్ బుకింగ్ భారీగా ఉండే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.


Click it and Unblock the Notifications











