1760 కోట్లతో బన్నీ సంచలనం .. దంగల్కు చేరువలో, పుష్ప 2పై అమీర్ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం పుష్ప 2 ది రూల్. మూడేళ్ల క్రితం వచ్చిన పుష్ప ది రైజ్కి సీక్వెల్గా వచ్చిన ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అందుకు తగినట్లుగానే పుష్ప 2 కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా నార్త్లో అల్లు అర్జున్ బాక్సాఫీస్ను ఊచకోత కోస్తున్నాడు. ఈ క్రమంలో ఒక్కో సినిమా రికార్డును తిరగరాస్తున్నాడు.
ఇప్పటికే రూ.1700 కోట్లకు పైగా కలెక్షన్స్తో భారత్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో దంగల్, బాహుబలి 2 తర్వాతి స్థానంలో పుష్ప 2 నిలిచింది. మధ్యలో కొత్త సినిమాలు పోటీకి వస్తాయని భావించినప్పటికీ.. పుష్ప 2కి ఏమాత్రం ఆదరణ తగ్గడం లేదు. రేపో మాపో ఈ సినిమా.. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఎపిక్ మూవీ బాహుబలి 2 కలెక్షన్ల రికార్డును బద్ధలుకొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు అంటున్నారు.

అల్లు అర్జున్కు బీభత్సమైన ఫ్యాన్ బేస్ ఉన్న తెలుగు రాష్ట్రాలను మించి హిందీలో వసూళ్ల వర్షం కురుస్తోంది. కేవలం 21 రోజుల్లోనే రూ.1705 కోట్ల గ్రాస్ వసూళ్లను పుష్ప 2 రాబట్టడం వెనుక మేజర్ షేర్ హిందీ మార్కెట్దే. పాట్నాలో పుష్ప 2 ఈవెంట్ పెట్టినప్పుడు వచ్చిన స్పందనను చూసినప్పుడే రిజల్ట్ ఎలా ఉంటుందో మేకర్స్ ఊహించారు. అందుకు తగినట్లుగానే హిందీ బెల్ట్ కాసుల వర్షం కురిపిస్తోంది. తెలుగులో బుకింగ్స్ డ్రాప్ అయినా హిందీలో మాత్రం నిలకడగా వసూళ్లు వస్తున్నాయి.
మరోవైపు సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాలు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. బాధిత కుటుంబానికి అల్లు అర్జున్, సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి దాదాపు రూ.2 కోట్ల వరకు ఆర్ధిక సాయం అందించారు. ప్రస్తుతం బెయిల్పై ఉన్న అల్లు అర్జున్ తన ఇల్లు దాటి బయటికి రావడం లేదు.
పుష్ప 2 ప్రభంజనం నేపథ్యంలో ఈ సినిమా 25 రోజుల్లో రూ. 1760 కోట్ల వసూళ్లు సాధించినట్లు తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా పోస్టర్ విడుదల చేసింది. దీంతో బాహుబలి 2 సంగతి ఏమో కానీ దంగల్ రికార్డు గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ హీరోగా రెజ్లింగ్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఏకంగా రూ. 2070 .3 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి.. భారతీయ చిత్ర పరిశ్రమలో 2 వేల కోట్లు దాటిన తొలి సినిమాగా చరిత్రకెక్కింది.
ప్రస్తుతం పుష్ప 2 రూ.1760 కోట్ల మార్క్కి చేరుకోవడంతో అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ (ఏకేపీ) స్పందించింది. పుష్ప 2 బృందానికి ఏకేపీ నుంచి అభినందనలు.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది, దీనిని మరింత కొనసాగించాలని కోరుకుంటున్నానని ఏకేపీ ట్వీట్ చేసింది. ఈ మేరకు అల్లు అర్జున్, రష్మిక మందన్న, సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ను ఏకేపీ ట్యాగ్ చేసింది. దీనికి హీరో అల్లు అర్జున్ స్వయంగా స్పందించారు. మీ అభినందనలకు ధన్యవాదలంటూ రిప్లయ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











