రూ.9 కోట్ల బడ్జెట్.. రూ.50 కోట్ల కలెక్షన్స్.. బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న చిన్న సినిమా..
ఇటీవలకాలంలో సినీ పరిశ్రమలో పాన్ ఇండియా సినిమాల కంటే ప్రాంతీయ సినిమాలే బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తున్నాయి. ఒకప్పుడు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలే భారీ వసూళ్లకు చిరునామాగా ఉండేవి. కానీ, ఇప్పుడు చిన్న బడ్జెట్తో తెరకెక్కిన ప్రాంతీయ సినిమాలను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. తాజాగా మరాఠీ సినిమా 'దేవూల్ బంద్ 2'(Deool Band 2 Collection) బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ప్రవీణ్ తార్డే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భక్తి, సామాజిక అంశాలు, భావోద్వేగాలను కలగలిపి రూపొందించిన ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా మహారాష్ట్ర ప్రేక్షకులు ఈ సినిమాను తమకు దగ్గరైన కథగా భావించడంతో థియేటర్లలో ప్రేక్షకుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది.
'దేవూల్ బంద్ 2' సినిమాలో స్నేహల్ తార్డే, మోహన్ జోషి, ప్రవీణ్ తార్డే, మహేష్ మంజ్రేకర్ కీలక పాత్రల్లో నటించారు. కథ రైతుల ఆత్మహత్యలు, గ్రామీణ జీవితం, ఆధ్యాత్మికత వంటి అంశాల చుట్టూ తిరుగుతుంది. సంగీత పేగుడే అనే మహిళా రైతు జీవితంలో చోటుచేసుకునే సంఘటనలు, ఆమెకు కలిగే దైవ అనుభూతి, సమాజం చూపే స్పందన వంటి అంశాలను దర్శకుడు హృదయాలను కదిలించేలా తెరకెక్కించాడు. ప్రేక్షకులను కేవలం భక్తి అంశాలతోనే కాకుండా సామాజిక సమస్యలపై ఆలోచింపజేసే విధంగా కథను నడిపించడం ఈ సినిమా ప్రధాన బలం. గ్రామీణ నేపథ్యం, భావోద్వేగాలు, దైవ విశ్వాసం, కుటుంబ విలువలు కలిసి ప్రేక్షకులను బలంగా కనెక్ట్ చేస్తున్నాయి.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం 'దేవూల్ బంద్ 2' కేవలం 11 రోజుల్లోనే రూ.47.41 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద నెట్ కలెక్షన్లు ఇప్పటికే రూ.40.30 కోట్లకు చేరుకున్నాయి. ప్రస్తుతం సినిమా 976కి పైగా షోలతో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఆదివారం ఒక్కరోజే రూ.2 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ లెక్కన చూస్తే త్వరలోనే రూ.50 కోట్ల మైలురాయిని అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
సినిమా విజయానికి ప్రధాన కారణం 'వర్డ్ ఆఫ్ మౌత్'. మొదట విడుదల సమయంలో సుమారు 1,100 షోలతో ప్రారంభమైన ఈ చిత్రానికి ప్రేక్షకుల స్పందన ఊహించని స్థాయిలో వచ్చింది. దీంతో ఎగ్జిబిటర్లు అదనంగా వందల సంఖ్యలో షోలను పెంచారు. ప్రస్తుతం రోజుకు 1,800కు పైగా షోలు ప్రదర్శించబడుతున్నాయని మరాఠీ సినీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు, భక్తి చిత్రాలను ఇష్టపడే వారు పెద్ద ఎత్తున థియేటర్లకు వస్తుండటం కలెక్షన్ల పెరుగుదలకు కారణమవుతోంది.
ప్రస్తుతం 'దేవూల్ బంద్ 2' మరాఠీ సినీ పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో వేగంగా ముందుకు దూసుకెళ్తోంది. ఈ ట్రెండ్ కొనసాగితే త్వరలోనే టాప్-5 మరాఠీ సినిమా జాబితాలోకి చేరే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా చూస్తే.. కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారనే విషయాన్ని మరోసారి నిరూపించింది 'దేవూల్ బంద్ 2'. రూ.9 కోట్ల బడ్జెట్తో ప్రారంభమైన ఈ ప్రయాణం ఇప్పుడు రూ.50 కోట్ల మైలురాయి దిశగా దూసుకపోతుంది.
33 గంటల పాటు నాన్ స్టాప్ షూటింగ్
ఈ సినిమా విజయానికి మూవీ మేకర్స్ పడిన కష్టాలు కూడా అంతే ఆసక్తికరంగా ఉన్నాయి. ఒక ఇంటర్వ్యూలో నటుడు మోహన్ జోషి మాట్లాడుతూ.. దర్శకుడు ప్రవీణ్ తార్డే సినిమా పట్ల ఎంత అంకితభావంతో ఉన్నారో వెల్లడించారు. ఓ షెడ్యూల్లో భాగంగా ఏకంగా 33 గంటల పాటు నిరవధికంగా షూటింగ్ కొనసాగిందని తెలిపారు. సమయం ఎలా గడిచిందో దర్శకుడికి కూడా తెలియలేదని చెప్పారు. అదే విషయాన్ని స్నేహల్ తార్డే కూడా ధృవీకరించారు. అంతేకాదు, జూనియర్ ఆర్టిస్టులుగా తీసుకున్న గ్రామస్థులు తమ పనుల కోసం వెళ్లిపోవడంతో చివరకు దర్శకుడు తన స్నేహితులు, డ్రైవర్లకే జూనియర్ ఆర్టిస్టుల దుస్తులు వేసి సన్నివేశాలు పూర్తి చేసినట్లు వెల్లడించారు.


Click it and Unblock the Notifications




