India Vs Pakistan Collections: థియేటర్లలో ఇండియా పాకిస్థాన్ మ్యాచ్.. ఎన్ని కోట్ల కలెక్షన్లు తెలుసా?
ఇండియాలో క్రికెట్ను మతం కంటే ఎక్కువగా భావించే అభిమానులకు పాకిస్థాన్తో మ్యాచ్ అంటే ఎక్కడా లేని జోష్ పుట్టుకొస్తుంది. కేవలం జోష్ మాత్రమే కాకుండా దేశభక్తి కూడా ఉరకలేస్తుంది. అలాంటి మ్యాచ్ జరుగుతుంటే.. ఆ అనుభూతిని పొందడానికి ఎంతకైనా వెనుకాడరు. అయితే క్రికెట్ అభిమానుల బలహీనతను క్యాష్ చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతుంటాయి. అలాగే ప్రతిష్టాకంగా కొనసాగుతున్న టీ20 వరల్డ్ కప్లో ఇండియాతో పాకిస్థాన్ మ్యాచ్ను థియేటర్లలో స్ట్రీమింగ్ చేశారు. ఆ మ్యాచ్కు వచ్చిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
అమెరికాలోని న్యూయార్క్లో ఇండియా, పాకిస్థాన్ మధ్య హోరా హోరీగా మ్యాచ్ జరిగింది. ఆద్యంత ఉత్కంఠను రేపిన ఈ మ్యాచ్లో భారత్ తడబాటుకు గురైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ కేవలం 19 ఓవర్లలో 119 పరుగులు చేసింది. అయితే పాకిస్థాన్ విజయం తప్పదని అభిమానులు నీరుగారిపోయారు.

అయితే ఈ మ్యాచ్లో బూమ్రా తన అద్బుతమైన బౌలింగ్తో భారత్కు విజయాన్ని సాధించి పెట్టారు. 120 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్థాన్ కేవలం 113 పరుగులే చేసింది. దాంతో 6 పరుగులు తేడాతో ఇండియా గెలుపు సాధించింది. పాకిస్థాన్కు ఊహించని పరాజయం దక్కింది. దాంతో ఇండియా అభిమానులు పండగ చేసుకొన్నారు.

ఇక ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్కు క్రేజ్ ఉండటంతో మల్టీ ప్లెక్స్ థియేటర్లలో ప్రదర్శించారు. థియేటర్లలో మ్యాచ్కు భారీ స్పందన లభించింది. ఉత్తర భారత దేశంలోని ప్రధాన నగరాల్లో మల్టీప్లెక్స్లకు క్రికెట్ ఫ్యాన్స్ పోటెత్తారు. దాంతో భారీగా కలెక్షన్లు నమోదు అయ్యాయి.
ఉతర భారత వ్యాప్తంగా క్రికెట్ మ్యాచ్కు సుమారుగా 43 శాతం ఆక్యుపెన్సీ నమోదు అయింది. ముంబైలో 45 శాతం, ఢిల్లీలో 34 శాతం, పూణెలో 51 శాతం, కోల్కతాలో 25 శాతం, ఆహ్మాదాబాద్లో 47 శాతం, సూరత్లో 40 శాతం, జైపూర్లో 44 శాతం, చండీగఢ్లో 44 శాతం, భోపాల్లో 51 శాతం, లక్నోలో 47 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

ఇక ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్కు రికార్డు కలెక్షన్లు నమోదు అయ్యాయి. ఈ మ్యాచ్కు మొత్తంగా 2.35 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు, 2 కోట్ల రూపాయల నికర వసూళ్లు నమోదు అయ్యాయి. ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ ప్రదర్శన భారీ సక్సెస్ అయిందనే టాక్ ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











