Jana Nayagan vs The Raja Saab: యూఎస్ఏలో విజయ్ vs ప్రభాస్.. అడ్వాన్స్ బుకింగ్లో టాప్ ఎవరు? ఎన్ని కోట్లంటే?
దక్షిణాది చిత్ర పరిశ్రమకు సంబంధించినంత వరకు సంక్రాంతి అతిపెద్ద సీజన్. తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో పెద్ద పండుగను ఘనంగా జరుపుకుంటారు. ప్రపంచంలో ఎక్కడ, ఏ మూలన ఉన్నా సరే సొంతూరిలో ఆత్మీయుల మధ్య సంక్రాంతిని జరుపుకునేందుకు పట్నవాసులు పల్లెలకు పరుగులు తీస్తారు. సంక్రాంతి సీజన్లో సినిమాల సందడి కూడా ఎక్కువే. ఈ టైంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటిని జనం ఆదరిస్తూనే ఉంటారు. సంక్రాంతి సీజన్లో తమ సినిమా దిగితే బొమ్మ హిట్ అని సినీ జనాల నమ్మకం.
సంక్రాంతికి సినిమాల పండుగ
తెలుగు చిత్ర పరిశ్రమకు వస్తే.. ఈ సంక్రాంతికి చిన్నాపెద్దా సినిమాలు కలిపి సందడి చేయనున్నాయి. ది రాజా సాబ్, మన శంకర వరప్రసాద్ గారు, అనగనగా ఒకరాజు, నారీ నారీ నడుము మురారి, భర్త మహాశయులకు విజ్ఞప్తితో పాటు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు మార్కెట్ను ముంచెత్తనున్నాయి. మరీ ముఖ్యంగా కోలీవుడ్ సూపర్స్టార్, దళపతి విజయ్ నటించిన జన నాయగన్ జనవరి 9న విడుదల కానుంది. ఆ మరుసటి రోజే మరో తమిళ నటుడు శివ కార్తీకేయన్ నటించిన పరాశక్తి విడుదల కానుంది.

ఈ రెండు సినిమాలపైనే కన్ను
అయితే ఈ సినిమాలన్నింటిలోనూ అందరి చూపు నెలకొన్నది రెండు చిత్రాలపైనే. అవి ది రాజా సాబ్, జన నాయగన్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ది రాజా సాబ్ జనవరి 9న విడుదల కానుంది. యాక్షన్, కమర్షియల్ ఫార్ములాలకు దూరంగా ఫుల్ లెంగ్త్ హార్రర్ కామెడీ జోనర్లో ప్రభాస్ నటించిన సినిమా కావడంతో ది రాజా సాబ్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహనన్లు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ వచ్చింది.
విజయ్ చివరి చిత్రం జన నాయగన్
ఇక అదే రోజున దళపతి విజయ్ నటించిన జన నాయగన్ విడుదల కానుంది. హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా.. పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్లు కీలకపాత్రలు పోషించారు. తమిళనాట విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 3 దశాబ్ధాలకు పైగా తన నటనతో అలరించిన విజయ్... ప్రజా సేవ నిమిత్తం టీవీకే పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి దిగారు. దాంతో జన నాయగన్ తన సినీ జీవితంలో చివరి చిత్రమని ప్రచారం జరిగింది. మలేషియాలో జరిగిన ఈ సినిమా ఆడియో లాంచ్ వేడుకలో జన నాయగన్ తన కెరీర్లో ఆఖరి చిత్రమని మరో 30 ఏళ్లు ప్రజల కోసం నిలబడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపి అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించారు. విజయ్ చివరి చిత్రం కావడంతో జన నాయగన్పై తమిళనాడుతో పాటు దక్షిణాది ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
నార్త్ అమెరికాలో విజయ్ vs ప్రభాస్
జన నాయగన్, ది రాజా సాబ్ సినిమాలపై భారత్తో పాటు నార్త్ అమెరికాలోనూ ఆసక్తి నెలకొంది. విజయ్, ప్రభాస్లకు అక్కడ భారీ ఫ్యాన్ బేస్ ఉంది.. ఇద్దరి సినిమాలు నార్త్ అమెరికాలో భారీ కలెక్షన్స్ రాబట్టాయి. అలాంటిది ఈ ఇద్దరు సూపర్స్టార్స్ ఒకే రోజున బరిలో దిగడంతో రెండు సినిమాలపై భారీ ప్రభావం చూపించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. నార్త్ అమెరికాలో జనవరి 8వ తేదీన ది రాజా సాబ్, జన నాయగన్ సినిమాల ప్రీమియర్స్ పడనున్నాయి. ఈ ప్రీమియర్స్ కోసం అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయగా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. అయితే ఇప్పటి వరకు అందుతున్న లెక్కల ప్రకారం రెండు సినిమాలలో రాజా సాబ్పై జన నాయగన్ పైచేయి సాధించినట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
టాప్ ఎవరంటే?
ది రాజా సాబ్కు అమెరికాలోని 344 సెంటర్స్లో, 1035 షోలకు గాను 10789 టికెట్లు అమ్ముడయ్యాయి. తద్వారా 3,05,112 డాలర్లు (2.75 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. మొత్తం నార్త్ అమెరికాలో ది రాజా సాబ్కు ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్లో 315K డాలర్లు (2.83 కోట్ల రూపాయలు) వసూలైంది. ఇక జన నాయగన్ విషయానికి వస్తే... అమెరికాలోని 201 సెంటర్స్లో, 446 షోలకు గాను 12748 టికెట్లు అమ్ముడై... 260512 డాలర్లు (భారత కరెన్సీలో 2.34 లక్షల రూపాయలు) వసూలు చేసింది. మొత్తం నార్త్ అమెరికాలో జన నాయగన్కు ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్లో 350K (3.14 కోట్ల రూపాయలు) వసూలైంది. దాంతో ఈ రెండు సినిమాల మధ్య దాదాపు 30 లక్షల రూపాయల వ్యత్యాసం నమోదై.. జన నాయగన్ హవా చూపిస్తోంది. అయితే ప్రీమియర్స్కు మరో 8 రోజులు సమయం ఉండటంతో లెక్కలు మారే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











