Karuppu Day 20 Collection: కరుప్పు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల సునామీ.. సూర్య మూవీకి ఎన్ని కోట్ల లాభాలంటే?
Karuppu Box Office Collection: తమిళ స్టార్ హీరో సూర్య, స్టార్ హీరోయిన్ త్రిష జంటగా నటించిన ఫాంటసీ కోర్ట్రూమ్ డ్రామా'కరుప్పు'. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ఈ సినిమా మే 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ను అందుకున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా ఆకట్టుకుంటోంది. తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ప్రదర్శన కొనసాగిస్తోంది. విడుదలై 20 రోజులు పూర్తవుతున్నా సినిమా వసూళ్ల జోరు ఏమాత్రం తగ్గకపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో సూర్య సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసింది? 20వ రోజు కలెక్షన్లు ఎంత?అనే వివరాల్లోకెళ్తే..
ఈ సినిమా నిర్మాణ వ్యయాల విషయానికి వస్తే.. భారీ స్టార్ కాస్ట్, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, విస్తృత స్థాయి ప్రమోషన్లు, విజువల్ ఎఫెక్ట్స్ ఖర్చులతో కలిపి 'కరుప్పు'ను దాదాపు రూ.140 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. విడుదలకు ముందే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో జరిగింది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల థియేట్రికల్ హక్కులు సుమారు రూ.7 కోట్లకు అమ్ముడవగా, తమిళనాడులో రూ.70 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్లు సమాచారం. అలాగే కర్ణాటకలో రూ.10 కోట్లు, కేరళలో రూ.5 కోట్ల మేర థియేట్రికల్ వ్యాపారం నమోదు చేసింది. విడుదల తర్వాత అన్ని ప్రాంతాల్లోనూ మంచి వసూళ్లు రాబడుతూ 'కరుప్పు' బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది.

ఇక కలెక్షన్ల విషయానికి వస్తే.. తొలి వారంలో ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ లభించడంతో 'కరుప్పు' బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లింది. తొలి వారంలోనే ఈ సినిమా రూ.113.85 కోట్ల గ్రాస్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. సూర్య కెరీర్లోనే అత్యంత వేగంగా వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. రెండో వారంలో కూడా సినిమా తన జోరును కొనసాగించింది. ఈ కాలంలో రూ.54.30 కోట్ల గ్రాస్ రాబట్టి మంచి వసూళ్లు అందుకుంది. అయితే మూడో వారంలోకి అడుగుపెట్టిన తర్వాత కలెక్షన్లలో కొంత మందగమనం కనిపించింది. అయినప్పటికీ సినిమా ఇంకా పలు ప్రాంతాల్లో మంచి ఆక్యుపెన్సీతో ప్రదర్శితమవుతోంది.
మూడో శుక్రవారం ఈ సినిమా రూ.3.74 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, శనివారం రూ.5.92 కోట్లు, ఆదివారం రూ.6.79 కోట్లు రాబట్టింది. వీకెండ్లో మంచి వసూళ్లు నమోదు చేసింది. ఇక సోమవారం రూ.2.76 కోట్లు, మంగళవారం రూ.2.35 కోట్ల గ్రాస్ సాధించింది. అయితే మంగళవారం కలెక్షన్లు ఇప్పటివరకు నమోదైన వాటిలో అత్యధిక డ్రాప్గా ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇలా తాజా గణాంకాల ప్రకారం, 19 రోజుల ముగింపు నాటికి 'కరుప్పు' ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.216.10 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వసూళ్లు రూ.294.85 కోట్లకు చేరుకున్నాయి. దీంతో రూ.300 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టేందుకు సినిమా కేవలం కొన్ని అడుగుల దూరంలో ఉంది.
ఇక 20 రోజు అంచనా కలెక్షన్ల ప్రకారం.. బుధవారం రూ. 2 కోట్ల నుంచి 2.5 కోట్ల వరకు వసూలు చేసే అవకాశముందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన చూస్తే.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.220 కోట్ల గ్రాస్ కలెక్షన్లకు చేరుకునే అవకాశముందనీ, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వసూళ్లు రూ.300 కోట్లకు చేరవవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇదిలాఉంటే.. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరుప్పు(వీర భద్రుడు)కు మంచి ఆదరణ లభిస్తోంది. తాజా ట్రేడ్ రిపోర్టుల ప్రకారం.. 19 రోజుల ముగింపు నాటికి తెలుగు రాష్ట్రాల్లో 'కరుప్పు' రూ.36.34 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ సుమారు రూ.17.39 కోట్లుగా నమోదైంది. కాగా, ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు కేవలం రూ.7 కోట్లకే అమ్ముడుపోయినట్లు సమాచారం. దీంతో ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లకు రూ.10.39 కోట్లకు పైగా లాభాలు వచ్చినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 248.42 శాతం రికవరీ సాధించడం విశేషం. సాధారణంగా డబ్బింగ్ సినిమాలకు ఇలాంటి రికవరీలు అరుదుగా కనిపిస్తాయి. కానీ 'కరుప్పు' మాత్రం కంటెంట్ బలం, సూర్య స్టార్డమ్, త్రిష నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా మూడో మంగళవారం కూడా సినిమా అద్భుతమైన వసూళ్లు సాధించింది. ఆ రోజు ఒక్కరోజే రూ.73 లక్షల గ్రాస్ రాబట్టింది. ఆశ్చర్యకరంగా సోమవారం కలెక్షన్లతో పోలిస్తే మంగళవారం 7 శాతం వృద్ధి నమోదు కావడం ట్రేడ్ వర్గాలను ఆకట్టుకుంది. సాధారణంగా మూడో వారంలో వసూళ్లు తగ్గిపోతాయి. కానీ 'కరుప్పు' మాత్రం ఇంకా ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తూనే ఉంది.
రాష్ట్రాల వారీగా చూస్తే తెలంగాణలో ఈ సినిమా రూ.18.40 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, ఆంధ్రప్రదేశ్లో రూ.17.94 కోట్ల గ్రాస్ సాధించింది. రెండు రాష్ట్రాల్లోనూ సమాన స్థాయిలో ఆదరణ లభించడం విశేషం. భాషల వారీగా చూస్తే తమిళ తరువాత తెలుగు వెర్షన్కు అత్యధిక స్పందన లభించింది. మొత్తం రూ.36.34 కోట్ల గ్రాస్లో తెలుగు వెర్షన్ ఒక్కటే రూ.34.70 కోట్ల వసూళ్లు సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా 'కరుప్పు' బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ.300 కోట్ల క్లబ్కు చేరువైన ఈ సినిమా, సూర్య కెరీర్లో మరో భారీ విజయంగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయి కలెక్షన్లు రావడం సూర్య మార్కెట్ మరింత బలపడిందనే సంకేతాలను ఇస్తోంది. మొత్తానికి కేవలం రూ.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్తో విడుదలైన 'కరుప్పు', ఇప్పటికే రూ.17 కోట్లకు పైగా షేర్ సాధించి డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కొనసాగుతున్న జోరు చూస్తుంటే ఈ సంఖ్యలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications






