Maa Inti Bangaaram Advance Booking: ఓవర్సీస్లో సమంత ర్యాంపేజ్.. ‘మా ఇంటి బంగారం’కు అదిరేపోయే బుకింగ్స్..
Maa Inti Bangaaram Advance Booking: సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత.. ఈ అమ్మడు 'మా ఇంటి బంగారం' అనే సినిమాలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీలో సమంత ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా స్వయంగా నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ 'మా ఇంటి బంగారం'విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటుంది. ముఖ్యంగా నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ దుమ్మురేపుతున్నాయి.
మా ఇంటి బంగారం సినిమాను సమంత స్వంత బ్యానర్ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై నిర్మించగా, ప్రముఖ దర్శకురాలు నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సమంతతో పాటు శ్రీముఖి, లక్ష్మీ, గౌతమి, గుల్షన్ దేవయ్య, మంజూష, ఆనంద్, శ్రినివాస్ గవిరెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ అంశాలను జోడించి తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరో ఆసక్తికర విషయమేమిటంటే.. ఈ సినిమాను కేవలం 59 రోజుల్లోనే పూర్తి చేశారట.

బడ్జెట్ పరంగా చూస్తే ఈ సినిమా సుమారు రూ.28 నుంచి రూ.30 కోట్ల మధ్య వ్యయంతో నిర్మించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో సమంత పారితోషికం లెక్కలో లేదని సమాచారం. సొంత నిర్మాణ సంస్థ కావడంతో ఆమె ముందుగా రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. సినిమా బిజినెస్ పూర్తయ్యాక ఒప్పందం ప్రకారం ఆమె వాటా తీసుకోనున్నారని టాక్ వినిపిస్తోంది.
ఇక ఇప్పటికే ఈ సినిమా నాన్-థియేట్రికల్ బిజినెస్ ద్వారా మంచి లాభాలను అందుకున్నట్లు సమాచారం. ఓటీటీ, శాటిలైట్, మ్యూజిక్ హక్కులు కలిపి దాదాపు రూ.35 కోట్లకు పైగా విక్రయమైనట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంటే విడుదలకు ముందే సినిమా పెట్టుబడిలో పెద్ద భాగం రికవరీ అయినట్టే. అంతేకాదు, థియేట్రికల్ బిజినెస్ విలువ కూడా రూ.30 నుంచి రూ.35 కోట్ల మధ్య ఉన్నట్లు అంచనా. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ సుమారు రూ.35 కోట్ల వరకు ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. విడుదల కేవలం ఒక్క రోజే ఉండటంతో ప్రస్తుతం అందరి దృష్టి ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్పైనే ఉంది. తాజా సమాచారం ప్రకారం నార్త్ అమెరికాలో ఈ సినిమా ఇప్పటికే 1.25 లక్షల డాలర్లు (125K)పైగా అడ్వాన్స్ సేల్స్ సాధించింది. భారత కరెన్సీ ప్రకారం ఇది సుమారు 1.07 కోట్ల రూపాయల గ్రాస్కు సమానం. విడుదలకు ముందే కోటి రూపాయల మార్క్ను దాటడం సినిమాపై ఉన్న క్రేజ్కు నిదర్శనంగా నిలుస్తోంది. అలాగే.. సమంతకు ఓవర్సీస్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరోసారి స్పష్టమైందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
గతంలో సమంత నటించిన 'యశోద'సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.33 కోట్ల నుంచి 35 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మా ఇంటి బంగారం కు వస్తున్న పాజిటివ్ బజ్, స్ట్రాంగ్ ప్రమోషన్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే ఆ రికార్డులను అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్లో స్ట్రాంగ్ ఓపెనింగ్స్ వస్తే, ఈ సినిమా కొత్త బెంచ్మార్క్ను సెట్ చేసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో తెలియలంటే.. జూన్ 19 వరకు వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications




