మన శంకర వరప్రసాద్ గారికి రికార్డ్ బిజినెస్.... ఆంధ్రా, నైజాంలలో చిరు మూవీకి ఎన్ని కోట్లంటే?
తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించినంత వరకు సంక్రాంతి అతిపెద్ద సీజన్. పెద్ద పండక్కి పట్నవాసులు తమ సొంతూళ్లకు వెళ్లి ఆత్మీయులు, సన్నిహితులతో సంక్రాంతిని జరుపుకుంటారు. కుటుంబం మొత్తం కాలక్షేపం కోసం సినిమాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. అందుకే ఈ టైంలో వచ్చే ఎన్ని సినిమాలకైనా చోటు దక్కడంతో పాటు అన్నింటిని ప్రజలు ఆదరిస్తారనే నమ్మకం సినీ వర్గాల్లో ఉంది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్
అందుకే తెలుగునాట దశాబ్ధాలుగా అగ్రనటులంతా తమ సినిమాలను ఖచ్చితంగా సంక్రాంతికి విడుదల చేస్తూ వస్తున్నారు. ఈ సంక్రాంతికి కుటుంబం మొత్తాన్ని అలరించేందుకు సిద్ధమయ్యారు మెగాస్టార్ చిరంజీవి. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరు నటిస్తోన్న చిత్రమే మన శంకర వరప్రసాద్ గారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా వరల్డ్ వైడ్గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

నిర్మాతగా సుస్మిత కొణిదెల
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత సాహు గారపాటితో కలిసి చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తుండగా.. భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకత్వం వహిస్తున్నారు, తమ్మిరాజు ఎడిటర్గా పనిచేస్తున్నారు. మన శంకర వరప్రసాద్ గారులో చిరంజీవి సరసన లేడీ సూపర్స్టార్ నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. అలాగే విక్టరీ వెంకటేష్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. వీరితో పాటు కేథరిన్ థ్రెసా, మాస్టర్ రేవంత్, బేబీ ఐరా, హర్షవర్థన్లు తదితరులు నటిస్తున్నారు.
హైప్ పెంచేసిన అనిల్ రావిపూడి
అనిల్ రావిపూడి శరవేగంగా ఈ సినిమాను పూర్తి చేశారు. వరుస షెడ్యూల్స్తో షూటింగ్ను పరుగులు పెట్టించారు. ఇక ప్రమోషనల్ కార్యక్రమాలకు పెట్టింది పేరైన అనిల్.. టైటిల్ గ్లింప్స్తోనే హిట్ కొట్టేశారు. ఆ తర్వాత లెజెండరీ సింగర్ ఉదిత్ నారాయణ్ను రంగంలోకి దించి మీసాల పిల్ల సాంగ్తో సినిమాపై మరింత హైప్ పెంచారు. ఆ తర్వాత శశిరేఖ సాంగ్, విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పోస్టర్స్తో మన శంకర వరప్రసాద్ గారితో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగాస్టార్ క్రేజ్, అనిల్ రావిపూడి సక్సెస్ ట్రాక్తో ఈ సినిమాకు భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
మన శంకర వరప్రసాద్ గారు బిజినెస్
ఈ సినిమాపై ఉన్న హైప్ దృష్ట్యా మన శంకర వరప్రసాద్ గారు థియేట్రికల్ రైట్స్ కోసం ప్రముఖ సంస్థలు, నిర్మాతలు ఎగబడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బిజినెస్కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మన శంకర వరప్రసాద్ గారికి ఆంధ్రాలోని 6 ప్రాంతాల థియేట్రికల్ రైట్స్ 55 కోట్ల రూపాయల మేర అమ్ముడు కాగా.. నైజాం థియేట్రికల్ రైట్స్ 32 కోట్ల రూపాయలు, సీడెడ్లో 18 కోట్ల రూపాయలు చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 105 కోట్ల రూపాయల బిజినెస్ చేసినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దాంతో ఆంధ్రా, నైజాంలలో మన శంకర వరప్రసాద్ గారు సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 110 కోట్ల రూపాయల షేర్, 220 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయాలని వాల్యూ నిర్దేశించారు ట్రేడ్ అనలిస్టులు.
చిరంజీవి మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
అయితే తమిళనాడు, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ మార్కెట్తో కలిపి మన శంకర వరప్రసాద్ గారు సినిమా మొత్తం థియేట్రికల్ బిజినెస్ 150 కోట్లపైనే చేస్తుందని భావిస్తున్నారు. అదే నిజమైతే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 320 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉంది. మరి చిరంజీవి మూవీ ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











