530 కోట్ల వసూళ్లతో సంచలనం .. డాకు మహారాజ్తో బాలయ్య రేర్ ఫీట్
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కెరీర్లో ఎన్నడూ లేనంత భీకరమైన ఫాంలో ఉన్నారు. అఖండ ముందు వరకు వరుస ఫ్లాపులతో అసలు కెరీర్ ముందుకు సాగుతుందా? లేదా అన్న డైలామాలో బాలయ్య అభిమానులు ఉన్నారు. కానీ ఎప్పుడైతే బోయపాటి శ్రీనుతో అఖండ చేశారో నాటి నుంచి రికార్డుల దుమ్మదులుపుతున్నారు బాలకృష్ణ. కోవిడ్ సమయంలో థియేటర్లకే రావడానికి ప్రేక్షకులు భయపడుతున్న వేళ.. తిరిగి వాతావరణం కళకళలాడేలా చేశారు బాలకృష్ణ.
ఇదే సమయంలో ఓటీటీల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి హోస్ట్గానూ సక్సెస్ కొట్టారు. తెలుగు ఓటీటీ ఫ్లాట్ఫాం ఆహాలో అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో ద్వారా ఎంతోమంది సెలబ్రెటీలను ఆయన ఇంటర్వ్వూ చేశారు. సెట్లో ఆయన అల్లరి, ఇంటర్వ్యూ చేసే విధానానికి ప్రేక్షకులు ఫిదా అయి ఆ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఇప్పటి వరకు 3 సీజన్లు పూర్తి చేసుకున్న అన్స్టాపబుల్ తాజాగా 4వ సీజన్ను కూడా ముగించనుంది.

ఇక బ్రాండ్ అండార్స్మెంట్స్లోనూ బాలయ్య దిగి సంచలనం సృష్టించారు. అలా బాలకృష్ణ ఏది పట్టుకున్నా బంగారంగా మారుతోంది. తాజాగా సినీరంగానికి 5 దశాబ్ధాలుగా అందిస్తున్న సేవలకు గాను బాలకృష్ణను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో నందమూరి అభిమానులు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బాలకృష్ణ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అభిమానులు కోరుతున్నారు.
ఇకపోతే.. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన డాకు మహారాజ్ ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై ఘన విజయం సాధించింది. అఖండ తర్వాత వరుసగా నాలుగో విజయాన్ని అందుకోవడంతో పాటు బాలయ్య కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది డాకు మహారాజ్. రూ.140 కోట్ల వసూళ్లతో దుమ్మురేపుతోంది. విడుదలై 15 రోజులు కావొస్తున్నా ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. లాంగ్ రన్లో డాకు మహారాజ్ ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తాడో చూడాలి.
కాగా.. డాకు మహారాజ్తో కలిపి 3 ఏళ్ల గ్యాప్లో 4 బ్లాక్బస్టర్లను తన ఖాతాలో వేసుకున్నాడు బాలకృష్ణ. అంతేకాదు.. ఈ నాలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రూ. 530 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి బాలయ్య పేరిట అరుదైన రికార్డు నమోదైంది. అఖండ రూ. 133 కోట్లు, వీరసింహారెడ్డి రూ.134 కోట్లు, భగవంత్ కేసరి రూ.132 కోట్లు చొప్పున మొత్తంగా 399 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టగా... డాకు మహారాజ్ ఇప్పటి వరకు రూ.140 కోట్ల గ్రాస్ అందుకుంది. అలా మొత్తంగా నాలుగు సినిమాల గ్రాస్ కలిపి ఏకంగా రూ.500 కోట్ల మార్క్ను దాటేసింది. త్వరలో తన లక్కీ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి అఖండ 2తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు బాలకృష్ణ. ఈ సినిమా బాలయ్య గత చిత్రాల రికార్డులను తిరగరాస్తుందని నందమూరి అభిమానులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











