సురేష్ ప్రొడక్షన్స్ కీలక నిర్ణయం.. ఆ రెండు సినిమాలు డైరెక్ట్ రిలీజ్, ఎప్పుడంటే?
టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతగా ఉన్న సురేష్ బాబు కీలక నిర్ణయం తీసుకున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. సురేష్ ప్రొడక్షన్స్ లో వస్తున్న దాదాపు రెండు సినిమాలు ఇప్పటికే రిలీజ్ కి సిద్ధం చేశారని ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.

థియేటర్లు ఉన్నా
టాలీవుడ్ లో లీడింగ్ నిర్మాతల్లో ఒకరైన సురేష్ బాబుకి రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పెద్ద ఎత్తున థియేటర్లు ఉన్నాయి. అప్పుడప్పుడు కొందరు థియేటర్లు దొరకనప్పుడల్లా విమర్శలు చేసే నిర్మాతలలో ఆయన కూడా టార్గెట్ అవుతూ ఉంటారు. అలాంటి ఆయన తన రెండు సినిమాలను డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారని, ఇప్పటికే రెండు సినిమాలు డీలింగ్ పూర్తయ్యాయని అంటున్నారు. మూడో సినిమాకు సంబంధించిన డీల్ కూడా కుదురనుందని అంటున్నారు

ఓపెన్ చేయడం కష్టమే
ప్రస్తుతానికి థియేటర్లు ఓపెన్ చేసే పరిస్థితి కనిపించడం లేదు, ఆగస్టులో తెలంగాణలో థియేటర్లు ఓపెన్ చేస్తామని థియేటర్ల యజమానులు సంఘం అధ్యక్షుడు ఈ మధ్య ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లో ఆగష్టు తర్వాత కూడా ఓపెన్ చేసేలా కనిపించడం లేదు, అక్కడ టిక్కెట్ల వ్యవహారం ఎటూ ఉండనే ఉంది.

ఉంచుకోవడం కంటే అదే బెటర్
ఈ క్రమంలో ఇప్పటికే పూర్తయిన సినిమాలను అలాగే ఉంచుకోవడం కంటే నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయడం బెటర్ అని భావిస్తున్న సురేష్ బాబు వెంకటేష్ హీరోగా నటించిన తమిళ రీమేక్ సినిమా నారప్ప, మలయాళం రీమేక్ సినిమా దృశ్యం 2 కూడా ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

నారప్ప
వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన నారప్ప సినిమాలో ప్రియమణి హీరోయిన్ గా నటించింది. తమిళంలో ధనుష్ హీరోగా తెరకెక్కిన అసురన్ సినిమా అప్పట్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమాని ఇప్పుడు తెలుగులో నారప్ప పేరుతో రీమేక్ చేశారు. పూర్తిగా అనంతపురం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ సంస్థ మంచి రేటుకు కొనుక్కున్నట్లు సమాచారం. జులై 24 నుంచి స్ట్రీమ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

దృశ్యం 2
ఇక మరోపక్క మలయాళంలో అక్కడ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన దృశ్యం సీక్వెల్ సినిమా దృశ్యం 2 సూపర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమాని అదే పేరుతో అదే దర్శకుడితో ఇక్కడ తెలుగులో కూడా రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాను డిస్నీ హాట్ స్టార్ సంస్థకు సురేష్ బాబు డీల్ ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఈ సినిమా ఆగస్ట్ లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

విరాటపర్వం విషయానికి వస్తే
ఈ రెండు సినిమాలు కాకుండా రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వేణు దర్శకత్వంలో విరాటపర్వం అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా తమకు అమ్మాల్సిందిగా నెట్ ఫిక్స్ సంస్థ కోరగా ప్రస్తుతం దానికి సంబందించిన చర్చలు జరుగుతున్నాయని డీల్ కుదిరితే ఈ సినిమాను కూడా నేరుగా అమ్మేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.


Click it and Unblock the Notifications











