Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
వివాదాలే కలిసి వచ్చి రికార్డులు బ్రద్దలు కొడ్తోంది
హైదరాబాద్ :ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ఖాన్ నటించిన పీకే చిత్రం సరికొత్త బాక్సాఫీసు రికార్డులను సృష్టిస్తోంది. చిత్రం ఆదాయం ఇప్పటికే రూ. 300 కోట్లు దాటడంతో అత్యధిక వసూళ్లు చేసిన బాలీవుడ్ చిత్రంగా ఖ్యాతికెక్కింది. ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా వున్న ధూమ్-3 చిత్రం రికార్డును పీకే బద్దలు కొట్టింది.
ఆమిర్ ఖాన్ నటించిన తాజా బాలీవుడ్ చిత్రం ‘పీకే' ఇంటా బయటా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. డిసెంబర్ 19న విడుదలైన ఈ చిత్రం శనివారం నాటికి ఏకంగా 544 కోట్ల రూపాయలను వసూలు చేసి ఆల్టైమ్ రికార్డును సాధించింది. ఇందులో ఓవర్సీస్ వసూళ్లే 134 కోట్ల రూపాయలు కావటం విశేషం. గతంలో 542 కోట్ల గరిష్ఠ వసూళ్లను సాధించిన చిత్రంగా ఉన్న ‘ధూమ్-3' రికార్డును పీకే బద్దలు కొట్టింది.
ఈ చిత్రంలో హిందూ మతాన్ని కించపరిచేలా కొన్ని దృశ్యాలున్నాయని అభ్యంతరాలు వ్యక్తమైనా దాని ప్రభావం వసూళ్ల మీద పడలేదు. ఇక..ఈ చిత్రం ఇంత పెద్ద హిట్ కావటంపై చిత్ర దర్శకుడు రాజు హిరానీ ఆనందం వ్యక్తం చేశారు. తమ సినిమాకు కథే హీరో అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో హిర్వానీ, ఆమిర్ఖాన్ల కాంబినేషన్లో వచ్చిన ‘త్రీ ఇడియట్స్' సినిమా కూడా ఘనవిజయం సాధించింది. త్వరలోనే ఈ సినిమా 600 కోట్ల రూపాయల లక్ష్యాన్ని సులభంగా అధిగమిస్తుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు.
గత కొన్నేళ్లుగా అమీర్ఖాన్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల్ని నమోదుచేస్తున్నాయి. గజిని చిత్రంతో బాలీవుడ్లో తొలిసారిగా 100కోట్ల మైలురాయిని అందుకున్నారు అమీర్ఖాన్. త్రీ ఇడియట్స్ చిత్రంతో 200కోట్ల మైలురాయిని అధిగమించారు. తాజాగా పీకే చిత్రం ద్వారా 300కోట్ల కలెక్షన్స్ సాధించారు. మతపరమైన విశ్వాసాల్ని ప్రశ్నించేలా పీకే చిత్రంలో కొన్ని అంశాలున్నాయని వివాదాలు చెలరేగుతున్నా.. ఇవేమీ కలెక్షన్స్పై ప్రభావం చూపకపోవడం విశేషమని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
మరో ప్రక్క ఆమీర్ఖాన్ నటించిన 'పీకే' చిత్రంలో హిందూ దేవతలు, మతగురువులను అవహేళన చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వివిధ హిందూ సంస్థల కార్యకర్తలు సోమవారం దేశంలోని పలు ప్రాంతాల్లో విధ్వంసానికి పాల్పడ్డారు. కర్రలు, ఇనుపరాడ్లు చేతబట్టి 'పీకే' చిత్రాన్ని ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద విధ్వంసం సృష్టించారు. భజరంగ్దళ్, రాష్ట్రీయ హిందూ ఆందోళన్ తదితర హిందూమత సంస్థలు 'పీకే' చిత్ర ప్రదర్శనలను నిషేధించాలంటూ డిమాండ్ చేస్తున్నాయి.
జనవరి 11వ తేదీన మర్బాద్, కల్యాణ్, థానే నగరాల్లో ఆందోళనలను చేపడతామనీ, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామనీ 'ది రాష్ట్రీయ హిందూ ఆందోళన్' ప్రతినిధి ఒకరు తెలిపారు.జమ్ములో 150మందికి పైగా భజరంగ్దళ్ కార్యకర్తలు సోమవారం ప్రదర్శన నిర్వహించారు. భోపాల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్న థియేటర్ల అద్దాలను పగుల కొట్టారు.
ఆగ్రాలో 'పీకే' చిత్రాన్ని ప్రదర్శిస్తున్న థియేటరుపై భజరంగ్దళ్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు దాడి చేశారు. గుజరాత్లోని పలుప్రాంతాల్లో పీకే చిత్రాన్ని ప్రదర్శిస్తున్న థియేటర్లపై ఆందోళనకారులు విరుచుకుపడ్డారు. పీకే చిత్రంపై చెలరేగిన సంచలనం నేపథ్యంలో వివరాలన్నిటినీ పరిశీలిస్తామని సమాచార,ప్రసారాల శాఖ తెలిపింది.
అలాగే....హిందువుల మనోభావాలను దెబ్బతీశారని, అశ్లీలత, అసభ్యతను ప్రోత్సహించారంటూ బాలీవుడ్ చిత్రం 'పీకే' దర్శకుడు, నిర్మాత, కథనాయకుడిపై రాజస్థాన్లోని జయపురలో కేసు నమోదైంది. ఇక్కడి బజాజ్ నగర్ పోలీస్ ఠాణాలో స్థానికంగాఉండే బసంత్ గెహ్లాట్ శుక్రవారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మరోవైపు ఉత్తర్ప్రదేశ్లోని వారణాసి అదనపు చీఫ్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో స్థానిక న్యాయవాది కమలేష్ చంద్ర త్రిపాఠి కూడా 'పీకే' చిత్రం దర్శకుడు, నిర్మాత, కథనాయకుడిపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన న్యాయస్థానం జనవరి ఆరున విచారణకు ఆదేశించింది. మరోవైపు ఆ చిత్రాన్ని ప్రదర్శిస్తున్న థియేటర్ల యజమానుల మీద చీఫ్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలోనూ త్రిపాఠి ఫిర్యాదు చేశారు. దీనిని అంగీకరించిన న్యాయస్థానం జనవరి 8న విచారణకు ఆదేశించింది.
'పీకే' చిత్రంపై నిషేధం విదించాలంటూ దాఖలైన వ్యాజ్యంపై వారం రోజుల్లోగా నిర్ణయాన్ని తెలియచేయాలని అలహాబాద్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని సోమవారం వివరణ కోరింది. 'హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్' అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ఇంతియాజ్ ముర్తాజ్, జస్టిస్ రితురాజ్ అవస్థిలతో కూడిన లఖ్నవూ ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
అదేవిధంగా పీకే చిత్రానికి సెన్సార్ బోర్డు జారీచేసిన 'ఏ' ధ్రువీకరణ పత్రాన్ని కూడా రద్దు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్లు ధర్మాసనాన్ని కోరారు. పీకే చిత్రంలో హిందూ దేవతలు, మత విశ్వాసాలను అవమానపర్చేలా సన్నివేశాలున్నాయని పిటిషనర్ల తరఫు న్యాయవాది హెచ్ఎస్ జైన్ ఆరోపించారు.