వరుసగా సినిమా రిలీజ్లు
స్టాలిన్, బాస్ చిత్రాల తర్వాత కొంతకాలం గ్యాప్ ఇచ్చిన చిన్న, డబ్బింగ్ చిత్ర నిర్మాతలు మెల్లగా తమ చిత్రాలను విడుదలకు సిద్ధం చేశారు. ముందున్న దీపావళి సీజన్లో మళ్లీ ఎక్కువ సంఖ్యలో సినిమాలు విడుదలకు రెడీ కావడంతో ఈ రెండు మూడు వారాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోడానికి పలువురు నిర్మాతలు సిద్ధమయ్యారు.
అక్టోబర్ రెండవ వారంలో నాలుగు చిత్రాలు విడుదలవుతున్నాయి. శివాజీ, లయ, కృష్ణభగవాన్, అలీ, రఘుబాబు ప్రధాన తారాగణంగా రూపొందిన టాటా బిర్లా మధ్యలో లైలా చిత్రం అక్టోబర్ 12న రాష్ట్రమంతటా విడుదలవుతోంది. పూర్తి స్థాయి వినోదం అందించే ఈ చిత్రాన్ని లక్కీ మీడియా పతాకంపై నిర్మించారు. గతంలో ఇదే కాంబినేషన్లో వచ్చిన అదిరిందయ్యా చంద్రం చిత్రం విజయవంతం కావడంతో వారి తదుపరి చిత్రం - టాటా బిర్లా మధ్యలో లైలా - పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. శివాజీ ఇటీవల నటించిన సీతారామాడు చిత్రానికి మంచి ఓపెనింగ్స్ రావడంతో ఈ చిత్రానికి విజయావకాశాలు ఎక్కువే ఉన్నాయని నిర్మాత బి. వేణుగోపాల్, దర్శకుడు శ్రీనివాసరెడ్డి ఆశిస్తున్నారు.
అక్టోబర్ 13న విడుదలవుతున్న మరో చిత్రం పొగరు. తమిళనాట తిమిరుగా విడుదలై విజయఢంకా మోగించిన ఈ చిత్రంలో విశాల్, రీమాసేన్, శ్రియారెడ్డి, కిరణ్ రాథోడ్ తదితరులు ప్రధాన తారాగణం. విశాల్ గత చిత్రం పందెంకోడి తెలుగులో 100 రోజులకు పైగా విజయవంతంగా ప్రదర్శితం కావడంతో పొగరు చిత్రానికి భారీ ఓపెనింగ్స్ ఉంటాయి. ఈ చిత్రం విజయంపై నిర్మాతలు జి.కె. కార్పొరేషన్ అధినేత విక్రమ్ కృష్ణ ఆశాభావంతో ఉన్నారు. గతంలో విశాల్ మొదటి చిత్రం ప్రేమచదరంగం చిత్రానికి దర్శకుడైన తరుణ్ గోపి పొగరు చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు.
చిత్రాలు కాకుండా.. పెద్దగా అంచనాలు లేని మరో రెండు చిన్న చిత్రాలు కూడా అక్టోబర్ 13న విడుదలకు సన్నద్ధం అయ్యాయి. రాజేంద్రప్రసాద్ నటించిన సిసింద్రీ బాబాయ్ చిత్రం, చాలాకాలంగా విడుదలకు నోచుకోని మనసున మనసై.. చిత్రాలు కూడా అక్టోబర్ 13న విడుదల అవుతున్నట్టు ఆయా సంస్థలు ప్రకటించాయి. అవి విడుదలయ్యే వరకూ అనుమానమే.
రెండేళ్ల కిందట తమిళంలో వచ్చిన స్టార్ చిత్రాన్ని తెలుగులో - టక్కరి దొంగ, చక్కని చుక్క - పేరుతో విడుదల చేస్తున్నారు. ప్రశాంత్, జ్యోతిక నటించిన ఈ చిత్రానికి ప్రవీణ్ కాంత్ దర్శకుడు. ఎ. ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. ఈ డబ్బింగ్ చిత్రం అక్టోబర్ 13న విడుదలవుతోంది.
తొలిప్రేమ, ఇటీవల గోదావరి చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్.ఎస్.సి. ఆర్ట్స్ పతాకంపై గోపిచంద్ హీరోగా రూపుదిద్దుకున్న - రారాజు - చిత్రం అక్టోబర్ 19న విడుదలవుతోంది. గోపిచంద్ సరసన మీరా జాస్మిన్, అంకిత హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెంకటేశ్తో కలిసుందాం..రా వంటి సూపర్హిట్ అందించిన ఉదయ్శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు.
అక్టోబర్ 20న మరో రెండు తెలుగు చిత్రాలు, ఒక డబ్బింగ్ చిత్రం విడుదల కానున్నాయి. మూవీ మొఘల్ డి.రామానాయుడు మళయాలంలో నిర్మించిన చిత్రం తెలుగులోకి అనువదించారు. సురేశ్ గోపి హీరోగా నటించిన ఆ చిత్రాన్ని మోసగాళ్లకు మోసగాడుగా తెలుగులోకి అనువదించారు. ఈ చిత్రం అక్టోబర్ 20న విడుదల కాబోతోంది. ఇంకా అదే రోజున విష్ణువర్ధన్బాబు, జెనీలియా, శ్రీహరి ప్రధాన తారాగణంగా శ్రీను వైట్ల దర్శకత్వంలో మల్లిడి సత్యనారాయణ రూపొందించిన చిత్రం ఢీ విడుదల కానుంది. చక్రి సమకూర్చిన బాణీలు ఇప్పటికే హిట్ అయ్యాయి.
ఇంకా ప్రవాసాంధ్రుడు బాల కథానాయకునిగా గోవింద్ వరాహ రూపొందించిన బాల చిత్రం అక్టోబర్ 20న విడుదలవుతోంది. ఈ చిత్రంలో బాల సరసన శిల్ప హీరోయిన్గా నటించింది.
హిందీలో సూపర్హిట్ అయిన మాలామాల్ వీక్లీ చిత్రం భాగ్యలక్ష్మి బంపర్ డ్రాగా తెలుగులో రీమేక్ అయింది. ఈ చిత్రం అక్టోబర్ 21న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో ఉన్న కమేడియన్లు అందరూ దాదాపు నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, కిరణ్ రాథోడ్, రిషి, ఫర్జానా, బ్రహ్మానందం, అలీ, ధర్మవరపు, ఎల్బీ శ్రీరామ్.. తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి రచయిత ఎల్బీ శ్రీరామ్. చక్రి సంగీతం అందించారు. నిధి ప్రసాద్ దర్శకుడు. భాగ్యలక్ష్మి బంపర్ డ్రా పూర్తి వినోదభరితంగా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందంటున్నారు.


Click it and Unblock the Notifications